రణరంగంగా రేణిగుంట: విద్యుత్ చార్జీలపై నిరసన ర్యాలీలో టీడీపీ వైసీపీ కార్యకర్తల రాళ్ళ దాడి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెరిగిన విద్యుత్ ఛార్జీలను నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. అయితే చిత్తూరు జిల్లా రేణిగుంటలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో విద్యుత్ ఛార్జీలను నిరసిస్తూ సాగిన ఆందోళన కార్యక్రమం ఉద్రిక్త పరిస్థితులకు కారణమైంది. రేణిగుంటలో తెలుగుదేశం పార్టీ నిరసన కార్యక్రమం రణరంగంగా మారింది. టిడిపి నేత బొజ్జల సుధీర్ రెడ్డి తిరుపతి, పార్లమెంటు నియోజకవర్గ ఇన్చార్జి నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో రేణిగుంట అంబేద్కర్ విగ్రహం నుంచి పోలీస్ స్టేషన్ వరకు తెలుగుదేశం పార్టీ నేతలు ర్యాలీలో టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
పెరిగిన విద్యుత్ చార్జీలను నిరసిస్తూ టీడీపీ ఆందోళన, వైసీపీ దాడి
ప్రశాంతంగా ర్యాలీ నిర్వహిస్తున్న టీడీపీ కార్యకర్తలపై ఒక్కసారిగా వైసిపి కార్యకర్తలు విరుచుకుపడ్డారు. తిరుపతి పార్లమెంటు టిడిపి అధ్యక్షుడు నరసింహ యాదవ్, శ్రీకాళహస్తి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి బొజ్జల సుధీర్ రెడ్డి పై వైసిపి మహిళా కార్యకర్తలు చెప్పులు, చీపుర్లను విసరడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. తెలుగుదేశం పార్టీ ర్యాలీని రేణిగుంట సర్పంచ్ నగేష్, ఉపసర్పంచ్ సుజాత, వైసీపీ శ్రేణులు అడ్డుకున్న క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పరస్పరం ఒకరిపై ఒకరు రాళ్ళతో దాడి చేసుకున్నారు. ఇక పోలీస్ స్టేషన్ కు సమీపంలో ఈ ఘటన జరగడంతో పోలీసులు అప్రమత్తమై ఇరు వర్గాలను అదుపుచేసే ప్రయత్నం చేశారు.
టీడీపీ , వైసీపీ కార్యకర్తల మధ్య బాహాబాహీ .. రాళ్ళ దాడి, ఉద్రిక్తత
కాసేపు అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ తో ఏం జరుగుతుందో అని ఆందోళన చెందిన రోడ్డుపై దుకాణదారులు స్వచ్ఛందంగా షాపులను మూసివేశారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. తెలుగుదేశం పార్టీ ర్యాలీ ముగించుకొని టీడీపీ నేతలు వెళుతున్న క్రమంలో కూడా వారి వాహనాలపై దాడులకు దిగారు వైసిపి కార్యకర్తలు. టిడిపి నేతల వాహనాలపై రాళ్ల దాడికి దిగిన వైసీపీ నేతలు తెలుగుదేశం పార్టీ నేతల కార్ల అద్దాలను ధ్వంసం చేశారు.
వైసీపీ కార్యకర్తలను అడ్డుకోవటంలో పోలీసులు విఫలం .. టీడీపీ ఆగ్రహం , ఎస్పీకి ఫిర్యాదు
ఇంతా జరుగుతుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారని, వైసిపి కార్యకర్తలను అడ్డుకోవడం లేదని టిడిపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసిపి ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలను వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టిన తమపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ టిడిపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై చిత్తూరు జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేస్తామని, వైసీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం పై పోలీసు బాస్ దృష్టికి తీసుకెళ్తామని టిడిపి నేతలు తిరుపతి అర్బన్ ఎస్పీ కార్యాలయానికి ఫిర్యాదు చేయడానికి వెళ్లారు.
Recommended Video
విద్యుత్ చార్జీల పెంపుపై టీడీపీ నేతల తీవ్ర ఆగ్రహం
ఇదే సమయంలో విద్యుత్ చార్జీలను పెంచి వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం సామాన్యుల నడ్డి విరుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిన విద్యుత్ చార్జీలపై నిరసన తెలియజేశారు. ప్రభుత్వ తీరుపై, వైసీపీ నాయకుల గూండాగిరీపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గతంలో టిడిపి హయాంలో నాణ్యమైన విద్యుత్ ను తక్కువ ధరలకు ఇచ్చామని, ప్రస్తుతం వైసిపి హయాంలో విద్యుత్ చార్జీల పెంపుతో సామాన్య ప్రజలను నిట్టనిలువునా దోపిడీ చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. విద్యుత్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు.