స్నేహలత హత్యకూ, జేసీ ఇంటిపై దాడికీ లింకు- జగన్ సర్కారుపై చంద్రబాబు ఫైర్
ఏపీలో టీడీపీ నేతలు, దళితులు, ఇతర బలహీన వర్గాల్ని లక్ష్యంగా చేసుకుని దాడులు, హత్యలు జరుగుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ మండిపడ్డారు. గతంలో ఓట్ల కోసం ఓదార్పు యాత్రలు చేసిన జగన్ ఇప్పుడు ఎందుకు చేయడం లేదని చంద్రబాబు ప్రశ్నించారు. అనంతపురంలో దళిత యువతి స్నేహలత హత్యకూ, ఇవాళ మాజీ ఎమ్మెల్యే జేసీ ఇంటిపై జరిగిన దాడికీ లింకు ఉందనేలా చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. అసలు రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా అమలవుతోందా అని చంద్రబాబు ప్రశ్నించారు.
గన్ వచ్చేలోపు జగన్ రాలేదే ?
ఏపీలో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలపై విపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా అనంతపురంలో దళిత యువతి స్నేహలత హత్యపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల నిర్లక్ష్యంతోనే ఈ హత్య జరిగిందని, ఇది సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన అని చంద్రబాబు ఆరోపించారు. గన్ వచ్చే లోపు జగన్ వస్తాడన్న మాటలు ఏమయ్యాయని సీఎంను ఆయన ప్రశ్నించారు. ఆడపిల్లలకు మేనమామగా ఉంటానన్న జగన్ ఇప్పుడు కంశుడిలా తయారయ్యారని చంద్రబాబు విమర్శించారు. దిశ చట్టం అమల్లో ఉండగానే దిశ పోలీసు స్టేషన్కు యువతి తల్లి ఫోన్ చేస్తే స్పందన లేదన్నారు.
ఈ సందర్భంగా స్నేహలత కుటుంబానికి చంద్రబాబు రెండు లక్షల రూపాయల సాయం ప్రకటించారు.
స్నేహలత హత్యను దారిమళ్లించేందుకే జేసీ ఇంటిపై దాడి
ఇవాళ టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఆయన అనుచరుల దాడిపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా జరిగిన స్నేహలత హత్యకూ, ఇవాళ జేసీ ఇంటిపై దాడికీ సంబంధం ఉందన్నారు. స్నేహలత హత్య నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే జేసీ ఇంటిపై దాడికి దిగారని చంద్రబాబు ఆరోపించారు. స్నేహలత హత్యతో పాటు ఇతర ఘటనలపైనా సీబీఐ దర్యాప్తు చేయించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. బాధ్యులతో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపైనా చర్యలు తీసుకోవాలన్నారు.
జగన్ దేశభక్తుల చరిత్ర తెలుసుకోవాలి...
నేరస్తుల చరిత్ర తెలిసిన జగన్ ఇప్పుడు దేశభక్తుల చరిత్ర గురించి కూడా తెలుసుకోవాలని చంద్రబాబు సూచించారు. స్నేహలత తల్లిలా మరో తల్లి బాధపడకుండా ఉండాలనే ఈ ఘటనపై ప్రతీ ఒక్కరూ స్పందించాలని చంద్రబాబు కోరారు. అవసరమైతే ప్రభుత్వంపై తిరుగుబాటు చేయాలన్నారు. పోలీసులు కూడా ఉద్యోగాల కోసం చూసుకోకుండా బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని చంద్రబాబు సూచించారు. ఈ ఊరు కాకపోతే మరో ఊరెళ్లి పనిచేసుకోవచ్చని పోలీసులకు తెలిపారు. ప్రజలు రోడ్డెక్కి నినదిస్తే తప్ప వారికి న్యాయం జరగదన్నారు. తాడోపేడో తేల్చుకోకపోతే పోలీసులు దారికి రారని ప్రజలకు చంద్రబాబు సూచించారు.