టీడీపీకి 'పంచ్' గట్టిగానే తగిలిందా?, సోషల్ మీడియా దెబ్బకు ఉలిక్కిపడి..
ఓ కార్టూనిస్టును అరెస్టు చేయడానికి స్వయంగా ప్రభుత్వమే పూనుకోవడంపై బాబు సర్కార్ ను సోషల్ మీడియాలో జనం ఉతికారేశారు.
అమరావతి: ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే పొలిటికల్ పంచ్ రవి కిరణ్ ను అరెస్టు చేసి.. ఆపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తగానే యూటర్న్ తీసుకుందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వైసీపీ అనుకూల మీడియా సాక్షి దీనిపై ప్రభుత్వాన్ని సూటిగా నిలదీస్తోంది.
నిజానికి సోషల్ మీడియాలో ఆయా నాయకులు, పార్టీలపై సెటైర్లు కొత్తేమి కాదు. కానీ విషయాన్ని జగన్ కు అంటగట్టి ఏదో చేద్దామనుకున్న చంద్రబాబు సర్కార్ తిరిగి నాలుక కరుచుకోక తప్పలేదు. విమర్శలు వెల్లువెత్తడంతో వివాదాన్ని కొత్తపల్లి గీత నమోదు చేసిన కేసుతో ముడిపెట్టాలని టీడీపీ ప్రయత్నించిందని జగన్ మీడియా ఆరోపిస్తోంది.
కాగా, అరకు ఎంపీ కొత్తపల్లి గీత పార్టీ ఫిరాయించిన సమయంలోను రవికిరణ్ ఆమెపై పొలిటికల్ పంచ్ వేశారు. దీంతో గతంలో రవికిరణ్ పై ఆమె కేసు నమోదు చేసింది. తాజాగా మరోసారి ఆమె ఫిర్యాదు మేరకు రవికిరణ్ పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆ కేసు కోసమే రవికిరణ్ ను అరెస్టు చేసినట్లు చూపించాలని పోలీసులు ప్రయత్నించినట్లుగా ఆరోపణలున్నాయి.
తొలుత అసెంబ్లీ కార్యదర్శి ఫిర్యాదు మేరకే అరెస్టు చేశామని చెప్పిన పోలీసులు ఆ తర్వాత, అరెస్టును దానికి సంబంధించిందిగా ఎక్కడా ధ్రువీకరించకపోవడం, దానికి తోడు కొత్త కేసులు తెరపైకి తీసుకురావడం చూస్తుంటే ఇదంతా ప్రభుత్వ పెద్దల కనుసన్నుల్లో జరిగిన వ్యవహారంగానే ఉందని వైసీపీ వర్గాలు అంటున్నాయి.
పోలీసు నిబంధనలు కూడా లెక్క చేయక:
నిజానికి పక్క రాష్ట్రాల్లోని వ్యక్తులను అరెస్టు చేయాల్సినప్పుడు.. ఆ రాష్ట్ర పోలీసులకు తొలుత సమాచారం అందించాల్సి ఉంటుంది. కానీ గుంటూరు పోలీసులు అలాంటి నిబంధనలేవి లెక్కలోకి తీసుకోలేదు. ఉదయం 6గం. తర్వాతే అరెస్టు చేయాలన్న నిబంధనను సైతం వారు విస్మరించారు. అర్థరాత్రి సమయంలోనే రవికిరణ్ ను అదుపులోకి తీసుకున్నారు.
అర్థరాత్రి సమయంలో తన భర్తను పోలీసులు చెప్పా పెట్టకుండా తీసుకెళ్లిపోవడంతో.. కంగారు చెందిన రవికిరణ్ భార్య సుజన శంషాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అంతేకాదు, భర్త భద్రతపై అనుమానం ఉన్నందునా.. హెబియస్ కార్పస్ పిటిషన్ వేయాలని ఆమె భావించారు. దీంతో పోలీసులు పునరాలోచనలో పడ్డారు.
అప్పటికప్పుడు జాగ్రత్తపడ్డ పోలీసులు రవికిరణ్ అరెస్టును ధ్రువీకరించక తప్పలేదు. సచివాలయానికి సమీపంలో ఉన్న మందడం ఏఎస్పీ కార్యాలయంలో రవికిరణ్ ను పోలీసులు ప్రశ్నించినట్లుగా ఆ తర్వాత వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసకున్న మీడియా అక్కడకు వెళ్లగా.. పోలీసులు వారిని లోపలికి కూడా అనుమతించలేదు.
విషయం బయటకు పొక్కడంతో రవికిరణ్ ను రహస్య ప్రాంతానికి తరలించాలని పోలీసులు భావించినట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో రాత్రి 10గం. సమయంలో ఏఎస్పీ కార్యాలయం ఉన్న వీధిలో కరెంటు సరఫరా నిలిపివేసి.. అక్కడినుంచి ఓ రహస్య ప్రాంతానికి రవికిరణ్ ను తరలించారు.
ఓ కార్టూనిస్టును అరెస్టు చేయడానికి స్వయంగా ప్రభుత్వమే పూనుకోవడంపై బాబు సర్కార్ ను సోషల్ మీడియాలో జనం ఉతికారేశారు. ప్రభుత్వాలు వ్యక్తుల మీద తమ శక్తిని ప్రయోగించడంపై మండిపడ్డారు. దీంతో వ్యవహారం బెడిసికొట్టేలా ఉందని భావించిన టీడీపీ ఈ విషయంలో వెనక్కి తగ్గినట్లు సమాచారం. ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేయాలో తేల్చుకోలేక, ఆపై రవికిరణ్ ను శంషాబాద్ లోని అతని నివాసం వద్ద వదిలిపెట్టి వెళ్లారు.