లోకేష్ పాదయాత్రలో ఉద్రిక్తత.. స్టూల్ పైనే నిరసన; లోకేష్ పై మరో క్రిమినల్ కేసు!!
ఇటీవల లోకేష్ ప్రచార వాహనాన్ని సీజ్ చేసిన పోలీసులు, తాజాగా జీడీ నెల్లూరు నియోజకవర్గ సంసిరెడ్డిపల్లిలో లోకేష్ మాట్లాడే మైక్ ను లాక్కున్నారు. దీంతో అక్కడ టెన్షన్ చోటుచేసుకుంది. ఆయనపై క్రిమినల్ కేసు మరోమారు నమోదైంది.
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువ గళం పాదయాత్ర అనేక ఉద్రిక్తతల మధ్య కొనసాగుతోంది. ఇటీవల లోకేష్ ప్రచార వాహనాన్ని సీజ్ చేసిన పోలీసులు, తాజాగా లోకేష్ మాట్లాడే మైక్ ను లాక్కున్నారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. ఆయనపై క్రిమినల్ కేసు మరోమారు నమోదైంది.
లోకేష్ పాదయాత్రను అడ్డుకున్న పోలీసులు
చిత్తూరు జిల్లాలో లోకేష్ పాదయాత్ర కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈరోజు లోకేష్ పాదయాత్రలో భాగంగా జీడీ నెల్లూరు నియోజకవర్గ సంసిరెడ్డిపల్లిలో లోకేష్ తన పాదయాత్రను కొనసాగించే క్రమంలో ఆయన పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. స్టూల్ పైకి ఎక్కి లోకేష్ మాట్లాడే ప్రయత్నం చేస్తుండగా, ఆయన నిలుచున్న స్టూల్ ను కూడా పోలీసులు లాగేసే ప్రయత్నం చేశారు.
పోలీసుల తీరుకు నిరసనగా టీడీపీ ఆందోళన..
లోకేష్ మాట్లాడడానికి మైకు తీసుకు వస్తున్న భాష అనే కార్యకర్త నుంచి మైకులు లాక్కున్న పోలీసులు లోకేష్ పాదయాత్రకు అడ్డంకులు సృష్టించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న టిడిపి కార్యకర్తలు పోలీసులు తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. లోకేష్ ను మాట్లాడకుండా అడ్డుకోవడం వెనుక కారణం ఏమిటని టిడిపి నాయకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇక పోలీసులు తెలుగుదేశం పార్టీ నేతలపై, లోకేష్ పాదయాత్ర పై కొనసాగిస్తున్న వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.
స్టూల్ పైనే నిలబడి నిరసన తెలిపిన లోకేష్.. క్రిమినల్ కేసు నమోదు
నారా లోకేష్ సైతం స్టూల్ పైనే నిలబడి పోలీసుల తీరుకు తన నిరసనను వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగం పుస్తకాన్ని చూపిస్తూ పోలీసులపై లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తమ పాదయాత్రకు ఇచ్చిన అనుమతులను లోకేష్ ఉల్లంఘించారని, నిబంధనలకు విరుద్ధంగా పాదయాత్రను నిర్వహిస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలోని లోకేష్ పై మరో క్రిమినల్ కేసులు కూడా నమోదు చేశారు. చిత్తూరు జిల్లా నర్సింగరాయపేట పిఎస్ లో లోకేష్ పై మరో క్రిమినల్ కేసును నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్లు 188, 341, 290 రెడ్ విత్ 34 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
చిత్తూరు జిల్లా పాదయాత్రలో లోకేష్ పై ఇది ఐదో కేసు
ఎలాంటి అనుమతి లేకుండా సమావేశాన్ని నిర్వహించారని, లోకేష్ పాదయాత్రకు ఇచ్చిన అనుమతులను ఉల్లంఘించారని పోలీసులు కేసు నమోదు చేశారు. లోకేష్ తో పాటు ఇతర తెలుగుదేశం పార్టీ నేతల పైన కూడా పోలీసులే ఫిర్యాదు చెయ్యటం గమనార్హం. పాదయాత్ర ప్రారంభించిన నాటినుండి ఇప్పటివరకు నారా లోకేష్ పై కేసును నమోదు అవుతూనే ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో నారా లోకేష్ పై కేసు నమోదు కావడం ఇదే ఐదోసారి. లోకేష్ తో పాటుగా టిడిపి నేతలు పులివర్తి నాని, అమర్నాథ రెడ్డి, దొరబాబు, చంద్రదండు ప్రకాష్ లపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications