భీమవరానికి అల్లూరి విగ్రహం-30 అడుగుల ఎత్తు-3 కోట్ల ఖర్చు-15 టన్నుల బరువు-ప్రత్యేకతలివే
బ్రిటిష్ తెల్లదొరల్ని ఎదిరించి భారత్ కు స్వాతంత్ర సాధనలో బీజాలు వేసిన విప్లవ వీరుల్లో అల్లూరి సీతారామరాజు కూడా ఒకరు. ఆయన జన్మించి 125 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా, భారత్ కు స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తవుతున్న వేళ నిర్వహిస్తున్న ఆజాదీగా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో ఈ విప్లవ వీరుడికి ఘననివాళి అర్పించాలని నిర్ణయించారు. జూలై 4న భీమవరంలో భారీ విగ్రహావిష్కరణతో ప్రధాని మోడీ అల్లూరికి నివాళులు అర్పిస్తారు. ఈ విగ్రహం ప్రత్యేకతలు ఓసారి చూద్దాం..
భీమవరం చేరుకున్న అల్లూరి విగ్రహం
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకుని జూలై 4న ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఆవిష్కరించే అల్లూరి 30 అడుగుల కాంస్య విగ్రహం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం చేరుకుంది. పట్టణంలోని 34వ వార్డు ఏఎస్ఆర్ నగర్లోని మునిసిపల్ పార్కులో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ విగ్రహం ఆవిష్కరణ కోసం ప్రధాని మోడీ ప్రత్యేకంగా ఏపీ టూర్ కు రానున్నారు. ఈ కార్యక్రమం పూర్తి కాగానే తిరిగి ఢిల్లీకి పయనం కానున్నారు.
విగ్రహం ప్రత్యేకతలివే
ప్రధాని మోడీ ఆవిష్కరించనున్న అల్లూరి సీతారామరాజు విగ్రహానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ విగ్రహాన్ని దాదాపు రూ.3 కోట్ల ఖర్చుతో 15 టన్నుల బరువుతో నిర్మించారు. పాలకొల్లు మండలం ఆగర్రు గ్రామానికి చెందిన అల్లూరి సీతారామరాజు సహకారంతో దీన్ని తయారు చేయించారు. ఈ విగ్రహం 30 అడుగుల ఎత్తు ఉంది. అల్లూరి విగ్రహాన్ని ఎత్తులో నిర్మించిన కాంక్రీట్ దిమ్మెపై నిలబెట్టారు. విగ్రహం ఆవిష్కరణ నాటికి పార్క్ను అందంగా తీర్చిదిద్దడానికి క్షత్రియ పరిషత్ ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయి.
రాజుల నేలపై ఆవిష్కరణ
అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా భీమవరం ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నాయి. క్షత్రియుల జనాభా ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో అయితేనే ఈ విప్లవవీరుడి విగ్రహావిష్కరణ బావుంటుందని అంతా భావించారు. దీంతోపాటు మన్యం వీరుడు పుట్టిన ప్రాంతం కూడా ఇక్కడే ఉంది. దీంతో ఈ కార్యక్రమానికి భీమవరం వేదికైంది. ఇంతవరకూ బాగానే ఉన్నా స్ధానిక ఎంపీ, క్షత్రియుడు కూడా అయిన రఘురామరాజు ఈ కార్యక్రమానికి హాజరవుతారా లేదా అన్నది ఉత్కంఠ రేపుతోంది.