విజయ్ మాల్యా: వెంకయ్యవి ఉత్తమాటలేనా, యావత్ జాతినే మోసం చేశాడా?
బెంగుళూరు: కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ మాజీ ఛైర్మన్ విజయ్ మాల్యా యావత్ దేశాన్ని, న్యాయ వ్యవస్థనూ, రాజ్యాంగాన్నీ మోసం చేశాడా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. బ్యాంకుల నుంచి రూ. 9000 కోట్ల రుణం తీసుకుని ఎగ్గొట్టిన కేసులో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు, వార్తలను చూస్తుంటే నిజమే అనిపిస్తోంది.
రాజ్యసభ ఎంపీగా ప్రజా జీవితంలో ఉన్న మాల్యా ఎన్నో నిజాలను దేశ ప్రజల ముందు దాచి పెట్టారు. తాజాగా బ్రిటన్ ఓటర్ల జాబితాలో మాల్యా పేరు ఉందని ఓ మీడియా కథనాన్ని వెల్లడించడం పెద్ద సంచలాన్ని కలిగిస్తోంది. అదే నిజమైతే, విదేశాంగ శాఖ భారత పాస్ పోర్టును రద్దు చేసినా ఆయనకు ఎటువంటి నష్టం వాటిల్లదని అంటున్నారు.
బ్రిటన్ ఓటర్ల జాబితాలోని అడ్రస్ ప్రకారం ఉత్తర లండన్ నుంచి గంట ప్రయాణముండే హెర్ట్ఫోర్డ్షైర్లోని తెవిన్ గ్రామంలో లేడీవాక్ పేరు గల మూడు అంతస్థుల భవనంలో ఆయన నివసిస్తున్నట్లు 'ది సండే టైమ్స్' ఆ వార్తా కథనంలో తెలిపింది. ఇదే విషయాన్ని మాల్యా నిర్ధారించినట్లు పేర్కొంది.
ఇలా బ్రిటన్ ఓటర్ల జాబితాలో మాల్యా పేరు ఉండటంతో ఆయన బ్రిటీష్ పౌరుడు అవుతారు. దీంతో తమ పౌరుడిని అప్పగించేందుకు బ్రిటన్ ససేమిరా అంటుంది. దీంతో ఆయన్ను భారత్కు తెచ్చి చట్టం ముందు దోషిగా నిలిపే అవకాశం దాదాపు లేనట్టేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
సండే టైమ్స్ కథనం ప్రకారం 1992 నుంచే ఆయన బ్రిటన్ పౌరుడిగా ఉన్నాడట. ఈ విషయాన్ని రాజ్యసభకు నామినేట్ అవుతున్న వేళ, సమర్పించే అఫిడవిట్లో ఆయన పేర్కొన లేదు. ఇది జాతి ద్రోహమే. తాను బ్రిటన్ పౌరుడినన్న విషయాన్ని తెలిపితే, ఇక్కడ రాజ్యసభకు ప్రాతినిథ్యం వహించే అవకాశం దక్కదు. ఈ విషయాన్ని ఉద్దేశపూర్వకంగా దాచి ఆయన ప్రజలందరినీ మోసం చేశాడని ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇక మాల్యాను ఎలాగైనా దేశానికి తిరిగి రప్పిస్తామని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ చెప్పినప్పటికీ, అదేమంత సులభమైన విషయం కాదని అంటున్నారు. భారత విదేశాంగ శాఖ ఆయన పాస్ పోర్టును రద్దు చేస్తున్నట్టు ప్రకటించినా, ఓ బ్రిటన్ పౌరుడిగా, అక్కడి పాస్ పోర్టును పొందడం మాల్యాకు పెద్ద కష్టమేమీ కాదంటున్నారు.
ఇదిలా ఉంటే సోమవారం బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసిన కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ విజయ్ మాల్యా విషయంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్గా ఉందని అన్నారు. మాల్యాను తిరిగి వెనక్కి తీసుకొస్తామని బ్యాంకుల నుంచి తీసుకున్న సొమ్ములను తిరిగి చెల్లించేలా చేస్తామని అన్నారు.
మాల్యాపై ఛీటింగ్ కేసు
ఉత్తరప్రదేశ్కు చెందిన స్థానిక కోర్టు విజయ్ మాల్యాపై ఛీటింగ్ కేసు పెట్టాలని అక్కడి పోలీసులను ఆదేశించింది. 2010 నుంచి 2012 మధ్యకాలానికి కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్లో పైలట్గా పనిచేసిన బులంద్షహర్ వాసి ఆకాశ్ శర్మ సంస్థపై కేసు పెట్టారు. తనకు సంస్థ రూ.9 లక్షలు చెల్లించాల్సి ఉందని కోర్టుకు తెలిపారు.
తన జీతం నుంచి మినహాయించుకున్న టీడీఎస్ను కంపెనీ ఆదాయం పన్ను శాఖ వద్ద డిపాజిట్ చేయలేదని తెలిపారు. ఇది మోసపూరిత చర్యేనని శర్మ ఆరోపించారు. ఆయన వాదనలతో ఏకీభవించిన చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ నుపుర్.. మాల్యాపై ఐపీసీ సెక్షన్ 420 ప్రకారంగా కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు.