రాజోలులో ఒకే కాన్పులో ముగ్గురు కవలపిల్లలు.. అంతా బాగానే ఉన్నా బాధ ఏంటంటే!!
ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు జన్మించిన అరుదైన ఘటన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో చోటుచేసుకుంది. ఒ తల్లి నవమాసాలు ముగ్గురు బిడ్డలను మోసి వారికి జన్మనిచ్చింది. ఇక ఈ ముగ్గురు కవలపిల్లలు పుట్టిన అరుదైన ఘటన వారి కుటుంబంలో సంతోషాన్ని, అంతే బాధను మిశ్రమంగా కలిగించింది.
ఒకే కాన్పులో ముగ్గురు కవలపిల్లలు
ఇంతకీ విషయానికి వస్తే కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం, ఊడిమూడి గ్రామానికి చెందిన నాగరాజు, భవాని భార్యాభర్తలు. వారి పెళ్లి జరిగి మూడేళ్ళు అయ్యింది. ఇక తాజాగా యిల్లింగి భవాని పురిటి నొప్పులతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరింది. ఇక ఆమె గర్భం లో ముగ్గురు కవల పిల్లలు ఉన్నారు అని గుర్తించిన ఆసుపత్రి వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించి ముగ్గురు కవల పిల్లలను డెలివరీ చేశారు. సహజంగా ఇలాంటి డెలివరీలలో పుట్టిన పిల్లలు కాస్త వీక్ గా ఉంటారు.

ముగ్గురు ఆడపిల్లలను పెంచటం భారం అంటున్న తండ్రి
కానీ పుట్టిన ముగ్గురు ఆడపిల్లలు చాలా ఆరోగ్యంగా ఉన్నారని, తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. వివాహమైన మూడేళ్ల తర్వాత ఒకేసారి ముగ్గురు పిల్లలు జన్మించటంతో తల్లిదండ్రులు ఆనందంలో, అదే సమయంలో ఆలోచనలో పడ్డారు. ముగ్గురు పిల్లలు పుట్టటం ఆనందంగా ఉందని భవాని భర్త నాగరాజు వెల్లడించారు. అయితే రోజువారి కూలి చేసుకుంటూ జీవనం సాగిస్తున్న తమకు ఒకే కాన్పులో ముగ్గురు ఆడపిల్లలు పుట్టడం కాస్త భారమని తండ్రి నాగరాజు చెబుతున్నాడు.

ఒక్క మగపిల్లాడు ఉంటే బాగుండేదన్న ఫ్యామిలీ..
ముగ్గురు పిల్లలను పోషించడం భారమని తండ్రి చెప్పిన మాటల్లో వాస్తవం ఉన్నప్పటికీ, ట్విస్ట్ ఏంటంటే ముగ్గురిలో ఒకరు బాబు అయితే బాగుండేదని తండ్రి పేర్కొనడం విన్న వారిని కాస్త ఆలోచించేలా చేసింది. మగ పిల్లవాడు పుట్టి ఉంటే మరింత సంతోషంగా ఉండే వారిమని కుటుంబ సభ్యులు చేసిన వ్యాఖ్యల్లో ఆడపిల్లలు పెంచటమే భారము అన్న భావన ప్రతిధ్వనించింది.
ఏదేమైనప్పటికి దేవుడిచ్చిన బిడ్డలను ఆనందంగా పెంచుకుంటామని చెబుతున్నప్పటికీ, మగ పిల్లవాడు కావాలి అన్న వారి కోరిక, సమాజంలో ఆడ పిల్లలకు మగ పిల్లలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని, మగబిడ్డ కావాలని నేటికీ ఆశ పడుతున్న తల్లిదండ్రుల తీరును, సమాజంలో ఆడ, మగ పై ఉన్న వివక్షను స్పష్టం చేస్తోంది.












Click it and Unblock the Notifications