వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్రకు మూడేళ్ళు ... 10 రోజుల పాటు రోజుకో పథకం అందించాలని సీఎం ఆదేశం
ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించి నేటికి సరిగ్గా మూడేళ్లు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పిన 14 నెలల పాటు సాగిన ప్రజా సంకల్ప యాత్రలో వైయస్ జగన్మోహన్ రెడ్డి మొత్తం 3648 కిలోమీటర్ల మేర నడిచారు .13 జిల్లాలలో 134 నియోజకవర్గాలలో ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగారు. ప్రజాసంకల్పయాత్ర కారణంగా నిత్యం ప్రజల్లో ఉంటూ వచ్చిన వైయస్ జగన్మోహన్ రెడ్డికి గత ఎన్నికలలో ఏపీ ప్రజలు అనూహ్యంగా పట్టం కట్టారు.

నవంబర్ 6వ తేదీ నుండి 10 రోజుల పాటు ప్రజా చైతన్య కార్యక్రమాలు
పాదయాత్ర చేసిన జగన్ కు ఎన్నికల్లో అద్భుతమైన విజయాన్ని అందించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డిగా అధికారాన్ని కట్టబెట్టారు.
వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర కు నేటితో మూడు సంవత్సరాలు. ఈ సందర్భంగా నవంబర్ 6వ తేదీ నుండి 10 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది . ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించి మూడు ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు.

'ప్రజల్లో నాడు ..ప్రజల కోసం నేడు' పేరిట పలు కార్యక్రమాలు
నాటి ప్రజాసంకల్పయాత్ర తాలూకు జ్ఞాపకాలను నేడు గుర్తు చేసుకుంటున్నారు.
ప్రజల్లో నాడు.. ప్రజల కోసం నేడు పేరిట పది రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సజ్జల రామకృష్ణా రెడ్డి పేర్కొన్నారు. ఇక నేటి నుండి ప్రజా చైతన్య కార్యక్రమాలు నిర్వహించనున్నామని ఈ కార్యక్రమాల్లో నియోజక వర్గ ఎమ్మెల్యేలు, ఇన్చార్జిలు , స్థానిక నేతలు పాల్గొంటారని తెలిపారు. గత ప్రభుత్వం ఊహకందని అప్పు మిగిల్చి వెళ్లినా, కరోనాతో ఆర్థిక వ్యవస్థ తలకిందులైన, ప్రజల సంక్షేమం లోను, సంక్షేమ పథకాలను అందించడంలోనూ సీఎం జగన్మోహన్ రెడ్డి ఏరోజు వెనక్కి పోలేదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

అర్హులై లబ్ది పొందలేని వారికి 10 రోజుల పాటు పథకాల అందజేత
ప్రజా సంకల్ప పాదయాత్ర పూర్తి చేసి మూడు ఏళ్ళు పూర్తవుతున్న నేపథ్యంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. అర్హులై ఉండి సంక్షేమ పథకాల ద్వారా లబ్ది పొందలేకపోయిన వారికి, నూతనంగా దరఖాస్తు చేసుకున్న వారికి ఈ 10 రోజుల పాటు సహాయం అందించాలని సీఎం జగన్ ఆదేశించారు. నిన్న జరిగిన కేబినెట్ భేటీ తర్వాత మంత్రులతో కాసేపు మాట్లాడిన సీఎం జగన్ మోహన్ రెడ్డి కొన్ని అంశాలపై సూచనలు చేశారు. పది రోజుల పాటు నిరుపేదలైన లబ్ధిదారులకు సహాయం అందించడం ద్వారా ప్రజా సంకల్ప యాత్ర కార్యక్రమాలను నిర్వహించాలని ఆయన సూచించారు.












Click it and Unblock the Notifications