కేంద్రం చెప్పిందే జరుగుతుందా .. పీపీఏల విషయంలో జగన్ సర్కార్ నోటీసులకు ట్రిబ్యునల్ స్టే
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీలో తన మార్క్ పాలన కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రం వద్దని చెప్పినా జగన్ విద్యుత్ ఒప్పందాల పునః సమీక్ష చేపట్టారు .
కేంద్రం వద్దని వారించినా జగన్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు జగన్ సర్కార్ పై విద్యుత్ కంపెనీలు రివర్స్ అయ్యేలా చేస్తోంది . జగన్ ఎప్పుడైతే విద్యుత్ ఒప్పందాలను పునః సమీక్షించాలని భావించారో అప్పుడే కేంద్రం అక్షంతలు వేసింది. పీపీఏలను పునఃసమీక్షించడం వల్ల పెట్టుబడిదారుల్లో అపనమ్మకం ఏర్పడుతుందని కేంద్ర శక్తి వనరుల శాఖ జగన్ కు లేఖ రాసి మరీ హెచ్చరించింది . దీని వల్ల భవిష్యత్తులో కంపెనీలు దేశంలోనూ, అలాగే రాష్ట్రంలోనూ పునరుత్పాదక ఇంధన రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి సంశయిస్తాయని ఆ లేఖలో పేర్కొన్నారు . అయినప్పటికే కేంద్రం చెప్పిన విషయాలను పక్కనపెట్టిన సీఎం జగన్ కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ రెనివెబుల్ ఎనర్జీ డెవలపర్స్ తో గత టీడీపీ ప్రభుత్వం చేసుకున్న విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలపై (పిపిఎలపై) విచారణకు ఓ కమిటీని వేసి సదరు కంపెనీ లకు కొనుగోలు ధర తగ్గించాలని నోటీసులు జారీ చేసింది.

పిపిఎలపై గ్రీన్ కో కంపెనీకి నోటీసులు పంపిన జగన్ సర్కార్ ... ట్రిబ్యూనల్ లో పిటీషన్ వేసిన కంపెనీ
రాష్ట్ర ప్రభుత్వం చేసుకునే ఒప్పందాలు ఏవైనా సెంట్రల్ రెగ్యులేటరీ కమిషన్ నిబంధనల మేరకే జరుగుతాయని చెప్పినా , ఇక చేసుకున్న ఒప్పందాల్లో ఏదైనా అవినీతి జరగడం, మితిమీరిన లబ్ధి జరిగిందన్న విషయాలు రుజువైతే తప్ప వాటిని పునః పరిశీలన చేయడానికి అవకాశం లేదని పేర్కొన్నా జగన్ మాత్రం విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలపై చాలా గట్టిగా నిర్ణయం తీసుకున్నారు. దూకుడుగా కమిటీ ఏర్పాటు చేసి రేట్లు తగ్గించాల్సిందేనని ఏపీ సర్కార్ కొన్ని విద్యుత్ ఉత్పత్తి కంపెనీలకు నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులపై ట్రిబ్యునల్ స్టే విధించింది. విద్యుత్ కంపెనీలకు నోటీసులు జారీ చేసిన విషయం ఇప్పటి వరకూ బయట పెట్టలేదు కానీ ఇలా నోటీసులు అందుకున్న కంపెనీల్లో గ్రీన్కో అనే కంపెనీ మాత్రం న్యాయ పోరాటం స్టార్ట్ చేసి ఏపీ సర్కార్ కు రివర్స్ పంచ్ ఇచ్చింది .

ధర తగ్గించాలని ఏపీ ప్రభుత్వ నోటీసులకు ట్రిబ్యునల్ స్టే విధింపు
ఈ కంపెనీకి చెందిన మూడు విద్యుత్ యూనిట్లతో ఏపీ సర్కార్ విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుంది. ఈ కంపెనీ సోలార్ పవర్ ఉత్పత్తి చేస్తుంది. ఈ సంస్థతో ఏపీ సర్కార్.. యూనిట్ ను ధర రూ. 4.50కు కొనుగోలు ఒప్పందం చేసుకుంది. అయితే.. తక్షణం... రూ. రూ.2.44కి తగ్గించాలని ఏపీ సర్కార్ గ్రీన్కో కంపెనీకి నోటీసులు పంపింది. మూడు రోజుల క్రితం.. పీపీఏలపై సీఎం జగన్ నియమించిన ఉన్నత స్థాయి కమిటీ.. ఈ విద్యుత్ కంపెనీల ప్రతినిధులతో సమావేశమయింది. వారెవరూ ధరలను తగ్గించేందుకు అంగీకరించలేదు. దీంతో ఆ పీపీఏ లను రద్దు చేసుకుంటామన్న చందంగా మాట్లాడింది జగన్ సర్కార్. దీంతో ట్రిబ్యునల్ ను ఆశ్రయించిన గ్రీన్ కో కంపెనీ అప్పిలేట్ ట్రిబ్యునల్లో పిటీషన్ వేసింది. ఈ పిటీషన్లో ఏపీ సర్కార్ తీరును వివరించింది. అసలు ధరల నిర్ణయం అనే ప్రక్రియతో ,ఏపీ సర్కార్ పాత్ర చాలా పరిమితమని,ధరల నిర్ణయం రెగ్యులేటరీ పరిధిలోకి వస్తుందన్న గ్రీన్కో కంపెనీ ట్రిబ్యునల్లో వాదించింది.

కేంద్రం మాట బేఖాతరు చేసినందుకు ఫలితం .. విద్యుత్ కంపెనీల న్యాయపోరాటం
ఏపీ సర్కార్ .. తాము రాజస్థాన్ ప్రభుత్వానికి రూ.2.44కి యూనిట్ ఇస్తున్నామని.. అదే ధరకు ఇవ్వాలని డిమాండ్ చేస్తోందని రాజస్థాన్ లో ఉత్పత్తి వ్యయం తక్కువని ఏపీలో చాలా ఎక్కువని పేర్కొంది. దీంతో ట్రిబ్యునల్ ఏపీ సర్కార్ నోటీసులకు స్టే విధించింది. కేంద్రం మాట బేఖాతరు చేసినందుకు కేంద్రం చెప్పిందే ప్రస్తుతం జరుగుతుంది. పీపీఏల విషయంలో గ్రీన్ కో కంపెనీ న్యాయపోరాటం సాగిస్తుంది. ఇక జగన్ పీపీఏ ల పునః సమీక్ష నేపధ్యంలో భవిష్యత్ లో ఇంకా ఏం జరుగుతుందో అన్న ఆందోళన వ్యక్తం అవుతుంది.












Click it and Unblock the Notifications