మాధవ్ వీడియో లీక్-టీడీపీ ఇరుక్కుంటుందా ? సీఐడీ ఎంట్రీతో టర్నింగ్ ! ఓటుకు నోటులా..
ఏపీలో హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్న వీడియో వ్యవహారం కలకలం రేపుతోంది. ఈ ఎపిసోడ్ లో తమను ఇబ్బందిపెడుతున్న టీడీపీని ఆత్మరక్షణలోకి నెట్టేందుకు వైసీపీ సర్కార్ వ్యూహరచన చేస్తోంది. ఇందులో భాగంగానే సీఐడీని రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. నిన్న సీఐడీ ఛీఫ్ సునీల్ కుమార్ చేసిన వ్యాఖ్యలు, ప్రభుత్వ వ్యవహారశైలి చూస్తుంటే త్వరలో అసలు ఈ వీడియోను బయటికి తెచ్చిన వారిపై కేసుల నమోదుకు రంగం సిద్దమవుతున్నట్లు సమాచారం.

గోరంట్ల మాధవ్ ఎపిసోడ్
హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్న వీడియో వ్యవహారం రాజకీయంగా తీవ్ర కలకలం రేపుతోంది. అసలు ఈ వీడియో బయటికి వచ్చినప్పటి నుంచి దీన్ని సమర్ధించుకోలేక, తప్పుబట్టలేక అధికార వైసీపీ ఇరుకునపడుతోంది. దీంతో టీడీపీ కూడా స్వరం పెంచుతోంది. చంద్రబాబు నుంచి టీడీపీలో కిందిస్ధాయి నేత వరకూ మాధవ్ ను టార్గెట్ చేస్తున్నారు. దీన్ని గమనించిన వైసీపీ పోలీసులు, సీఐడీ సాయంతో ఎదురుదాడికి దిగుతోంది. దీంతో టెక్నికల్ గా మాధవ్ ను ఇరుకునపెట్టేందుకు టీడీపీ ప్రయత్నించింది. దానికి ప్రభుత్వం సీఐడీ సాయంతో కౌంటర్ ఇస్తోంది.

సీఐడీ ఎంట్రీ-ఎదురుదాడి
గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంలో సీఐడీకి ఎవరూ ఫిర్యాదు చేయలేదు. కానీ సీఐడీ మాత్రం ఈ వీడియో ఒరిజినల్ అంటూ టీడీపీ బయటపెట్టిన యూఎస్ ఎక్లిప్స్ ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ పై నిజ నిర్ధారణ మాత్రం చేసేసింది. సదరు సంస్ధకు మెయిల్ పెట్టి మరీ ఈ వీడియోపై ఇచ్చిన నివేదిక మార్ఫింగ్ చేశారంటూ సీఐడీ ఛీఫ్ సునీల్ కుమార్ ప్రకటించేశారు. దీంతో పాటు రాజమౌళి సినిమాలో కూడా పులుల్ని వీడియో తీస్తే ఒరిజినల్ లాగే కనిపిస్తాయంటూ సీఐడీ ఛీఫ్ సునీల్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. దీంతో సీఐడీ ఎంట్రీ, ఎదురుదాడి వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి.

టీడీపీపై కేసులు తప్పవా ?
మాధవ్ వీడియోను తొలుత బయటికి తెచ్చిన వ్యవహారంలో టీడీపీ నేతల్ని టార్గెట్ చేసేందుకు సీఐడీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై మాధవ్ సిబ్బంది పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదును ఆధారంగా చేసుకుని దర్యాప్తు చేసి సీఐడీ కేసులు నమోదు చేయబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే అధికార పార్టీ ఎంపీ నగ్న వీడియోను ఒరిజినల్ కాదని పోలీసులు ప్రకటించిన తర్వాత కూడా యూఎస్ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపి నకిలీ రిపోర్ట్ ఇప్పించారన్న అభియోగాలతో టీడీపీపై కేసులు నమోదుచేయొచ్చని చెప్తున్నారు. ఇదే జరిగితే టీడీపీ చిక్కుల్లో పడటం ఖాయంగా కనిపిస్తోంది.

చంద్రబాబు అస్త్రమే వాడుతున్న జగన్ ?
గతంలో చంద్రబాబు ఓటుకు నోటు కేసులో దొరికిన తర్వాత తాను మాట్లాడారా లేదా అన్న విషయాన్ని పక్కనపెట్టి తన ఆడియో ఎలా ట్యాప్ చేశారంటూ కేసీఆర్ పై ఎదురుదాడికి దిగారు. దీంతో ఈ మొత్తం వ్యవహారాన్ని బయటపెట్టిన కేసీఆర్ సర్కార్ ఇరుకునపడింది. చివరికి ఈ కేసు అప్రాధాన్యంగా మారిపోయింది. ఇప్పుడు మాధవ్ వీడియో వ్యవహారంలోనూ అది నిజమా కాదా అన్నది తేల్చాల్సిన జగన్ సర్కార్..దాన్ని వదిలిపెట్టి దాన్ని బయటపెట్టిన టీడీపీని టార్గెట్ చేయడం చూస్తుంటే చంద్రబాబు బాటలోనే జగన్ సాగుతున్నట్లు అర్ధమవుతోంది. మరి అప్పట్లో చంద్రబాబుకు పనికొచ్చిన ఎదురుదాడి అస్త్రం ఇప్పుడు జగన్ కు ఉపయోగపడుతుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications