కేంద్రంతో విభేదాలు లేవు: ప్రధాని, రైల్వే మంత్రిని కలిసిన టిఆర్ఎస్ ఎంపీలు
న్యూఢిల్లీ: తెలంగాణ ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీని కోరినట్లు తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంటు సభ్యుడు కె కేశవరావు తెలిపారు. బుధవారం ఆయనతోపాటు ఎంపీలు వినోద్, జితేందర్ రెడ్డి, తదితరులు ప్రధాని నరేంద్ర మోడీ, రైల్వే మంత్రి సురేష్ ప్రభులను కలిశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రంలోని సమస్యలను ప్రధాని దృష్టికి వెళ్లినట్లు వారు తెలిపారు. సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుకోవాలని కోరినట్లు చెప్పారు. ఉద్యోగుల విభజనను వేగవంతం చేయాలని కోరినట్లు తెలిపారు. రాష్ట్రానికి ఐఏఎస్, ఐపిఎస్లను కేటాయించాలని కోరినట్లు తెలిపారు.
రాష్ట్రంలో అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని కేంద్ర మంత్రులకు వివరించామని వారు తెలిపారు. ఉద్యోగులు, అధికారుల విభజన పూర్తి కాకపోవడంతో పాలనా పరమైన సమస్యలు వచ్చాయన్నారు. హైకోర్టు విభజన చేయాలని ప్రధానిని కోరామని తెలిపారు.
రాష్ర్టానికి ఇస్తామన్న ఎన్టీపీసీని త్వరగా కేటాయించాలని విజ్ఞప్తి చేశామని పేర్కొన్నారు. రాష్ర్టానికి సంబంధించిన ప్రతి అంశం వెంటనే పరిష్కరించే దిశగా తాము ముందుకు వెళ్తున్నామని చెప్పారు. వాటర్ గ్రిడ్ ద్వారా ప్రతి ఇంటికీ మంచి నీళ్లు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని స్పష్టం చేశారు.
రాష్ట్రంలోని పెండింగ్ రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేయాలని రైల్వే మంత్రి సురేష్ ప్రభును కోరినట్లు ఎంపీలు తెలిపారు. అదే విధంగా కొత్త రైల్వే లైన్లపై చర్చించినట్లు తెలిపారు.