కోటంరెడ్డి టీడీపీలో చేరిక వేళ అపశృతి- బాణాసంచా పేలుడులో ఇద్దరికి గాయాలు..
ఏపీలో నిన్నమొన్నటి వరకూ వైసీపీలో పనిచేసి అనంతరం బహిష్కరణకు గురైన నెల్లూరు నేత, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఇవాళ టీడీపీలో చేరుతున్నారు. ఈ సందర్భంగా నెల్లూరు నుంచి భారీ ఎత్తున కార్యకర్తలతో ఆయన మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి తరలివచ్చారు.
కోటంరెడ్డి బ్రదర్స్ అనుచరులు భారీ ఎత్తున నెల్లూరు నుంచి తరలిరావడంతో మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయం వద్ద సందడి నెలకొంది. ఈ సందర్భంగా వారు భారీ ఎత్తున బాణాసంచా పేల్చారు. భారీ ఎత్తున వాహానాలతో తరలివచ్చిన వీరు పార్టీలో చేరే ముందే టీడీపీ కార్యాలయం ముందు బాణాసంచా కాల్చారు. ఈ క్రమంలో బాణాసంచా తొలుత వాహనాలపై పడి అనంతరం కార్యకర్తలకు కూడా అంటుకుంది. దీంతో ఒక్కసారిగా అలజడి రేగింది.
బాణాసంచా అంటుకోవడంతో ఇద్దరు కార్యకర్తలు తీవ్ర గాయాలపాలయ్యారు. వెంటనే వారి పక్కన ఉన్నకార్యకర్తలు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. వీరిలో ఒకరు తీవ్ర గాయాలపాలైనట్లు తెలుస్తోంది. మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే వారికి అక్కడే ప్రాథమిక చికిత్స చేసి సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. టీడీపీలో కోటంరెడ్డి చేరబోతున్న వేళ అకస్మాత్తుగా చోటు చేసుకున్న ఈ ఘటన కలకలం రేపింది.
మరోవైపు వైసీపీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా ఉన్నకోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సొంత పార్టీతో విభేదించడం మొదలుపెట్టాక జగన్ వీరిని దూరం పెట్టారు. అనంతరం నెల్లూరు రూరల్లో ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని ఇంచార్జ్ గా కూడా నియమించారు. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్ధితుల్లోనూ కోటంరెడ్డి గెలవకుండా చేయాలని వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ సమయంలో కోటంరెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డిని పార్టీ పదవుల నుంచితొలగించిన అధిష్టానం.. పార్టీ సభ్యత్వంనుంచి కూడా సస్పెండ్ చేసింది. దీంతో ఆయన టీడీపీలో చేరేందుకు మార్గం సుగమమైంది.