వైసీపీ ఎమ్మెల్యే వసంత పార్టీ మార్పు, కేశినేనితో భేటీపై వసంత నాగేశ్వరరావు క్లారిటీ..
ఏపీలో ఎన్టీఆర్ జిల్లా మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తన నియోజకవర్గంలో చోటు చేసుకుంటున్న రాజకీయాలపై తాజాగా భావోద్వేగంతో కూడిన వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీలో ఇతర నియోజకవర్గాలకు చెందిన నేతలు మైలవరం పాలిటిక్స్ లో వేలు పెడుతున్నా ఏమీ చేయలేని నిస్సహాయత ఆయన మాటల్లో కనిపించింది. దీంతో ఆయన పార్టీ మారతారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆయన తండ్రి వసంత నాగేశ్వరరావు ఇవాళ క్లారిటీ ఇచ్చారు. అలాగే విజయవాడ ఎంపీ కేశినేని నానితో తన భేటీపైనా నాగేశ్వరరావు స్పష్టత ఇచ్చారు.
మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తాజా వ్యాఖ్యలపై మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు స్పందించారు. ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ వ్యాఖ్యలు యాదృచ్ఛికం అని తండ్రి నాగేశ్వరరావు స్పష్టంచేశారు. స్వయంకృషి తో పైకి వచ్చిన వ్యక్తి వసంత కృష్ణ ప్రసాద్ అని, దేవినేని ఉమ మాటలకు బాధ కలిగే ఉమాపై మైలవరంలో గెలిచి చూపించడం జరిగిందన్నారు. అలాగే మైలవరం లో దేవినేని ఉమ కనీసం ఒక ఆఫీస్ కూడా ఏర్పాటు చేయలేదని, కృష్ణ ప్రసాద్ ఆఫీస్ ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని తెలిపారు. చివరిగా కృష్ణ ప్రసాద్ పార్టీ మారే అవకాశాలు లేవని మాజీ మంత్రి వసంత స్పష్టం చేశారు.
మరోవైపు విజయవాడ ఎంపీ కేశినేని నానితో భేటీపైనా స్పందించిన వసంత నాగేశ్వరరావు.. కేశినేని నాని కూతురు పెళ్లి వేడుకకు వెళ్ళకపోవడం కారణంగా ఆయన్ను ఇప్పుడు కలిసి శుభాకాంక్షలు చెప్పానన్నారు. అదే సమయంలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఆధునికణ కోసం కూడా డబ్బు అడిగానన్నారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. గతంలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఆధునికీకరణ కోసం అప్పటి మంత్రి అనిల్ కుమార్ కలవడం కూడా కలిసినా నిధులు మంజూరు చేయలేదన్నారు.