తిరుమలలో అన్యమత స్టిక్కర్ తో వాహనం.. కేసులతో పాటు, అధికారిపైనా టీటీడీ కఠినచర్యలు!
తిరుమలలో అన్యమత ప్రచారం విషయంలో టిటిడి బోర్డు చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో అన్య మత చిహ్నం స్టిక్కర్తో వాహనం తిరుమల కొండపై ఉన్న విషయాన్ని గుర్తించిన టిటిడి ఈ మేరకు చర్యలను చేపట్టింది. తిరుమల కొండపై అన్యమత ప్రచారానికి సంబంధించి స్టికర్ లతో ఎటువంటి వాహనాలను అనుమతించని టిటిడి, అన్యమత ప్రచారానికి సంబంధించిన స్టిక్కర్ తో కొండపైకి వచ్చిన డ్రైవర్, యజమాని పైన కేసు నమోదు చేసింది
అలిపిరి చెక్ పోస్ట్ దాటి తిరుమలకు అన్యమత స్టిక్కర్ తో వాహనం
తమిళనాడు రాష్ట్రానికి చెందిన TN-31-AE-4073 వాహనంపై అన్య మతానికి చెందిన చిహ్నం స్టిక్కర్ అతికించబడి సదరు వాహనము తిరుమల కొండపై ఉన్న విషయం గుర్తించిన టిటిడి ఈరోజు ఉదయం 10.40 గంటల సమయంలో అలిపిరి చెక్పోస్ట్ వద్ద ఈ వాహనం 9 వ లేన్ గుండా వచ్చినట్టు గుర్తించింది. అక్కడ విధుల్లో ఉన్న CT-5949 వి. వాసు బాబు (9వ లేన్, అలిపిరి) ఈ అన్యమత చిహ్నాన్ని గుర్తించలేకపోయారు.

తిరుమల II టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
ఈ సమాచారం అందిన వెంటనే, సంబంధిత విజిలెన్స్ సిబ్బంది వాహనాన్ని తిరుమలలోని ఫైర్ ఆఫీస్ సమీపంలోని పార్కింగ్ ప్రాంతంలో గుర్తించి, వెంటనే ఆ స్టిక్కర్ను తొలగించారు. అనంతరం, ఈ విషయంపై తిరుమల II టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తిరుమల నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా వారిపై కేసు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలని వారు ఫిర్యాదు చేశారు.
అన్యమత స్టిక్కర్ గుర్తించని విధుల్లో ఉన్న సిబ్బందిని తొలగింపు
వాహన డ్రైవర్ అయిన తమిళనాడు కరూర్ జిల్లాకు చెందిన గోబి మరియు ఆ వాహనం యొక్క యజమాని పై AP చారిటబుల్ మరియు హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ మరియు ఎండోమెంట్ Act - 1987 ( AP CHRIE ACT) పరిధిలో కేసు నమోదు చేశారు. పలుమార్లు సూచనలు ఇచ్చినప్పటికీ స్టిక్కర్ను గుర్తించడంలో విఫలమైనందున, CT-5949 వి. వాసు బాబు ను వెంటనే అలిపిరి విధుల్లో నుండి తొలగించారు. అతని పై విధుల్లో నిర్లక్ష్యానికి సంబంధించి శాఖాపరమైన చర్యలు తీసుకున్నట్టు టీటీడీ పేర్కొంది.












Click it and Unblock the Notifications