వైద్యారోగ్య శాఖా మంత్రిగా.. తొలిరోజే ఏపీలో మెడికల్ కాలేజీలపై శుభవార్త చెప్పిన విడదల రజిని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో మంత్రిగా స్థానం దక్కించుకున్న విడదల రజిని సోమవారం నాడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలను స్వీకరించారు. కుటుంబంతో కలిసి సచివాలయంలోని తన చాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన విడదల రజిని మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి నాడే గుడ్ న్యూస్ చెప్పారు.
ప్రతి పార్లమెంట్ పరిధిలోనూ మెడికల్ కళాశాలలు
ప్రతి పార్లమెంటు పరిధిలోనూ మెడికల్ కళాశాలలు రాబోతున్నాయని మంత్రి విడదల రజిని వెల్లడించారు. వైద్య ఆరోగ్య శాఖకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని విడదల రజిని పేర్కొన్నారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా కృషి చేస్తానని ఆమె తెలిపారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వైద్యరంగాన్ని దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిపారని భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరిన్ని మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువస్తామని విడదల రజిని పేర్కొన్నారు.
నాడు- నేడు ద్వారా ఏపీ ఆస్పత్రుల్లో మౌలిక వసతుల కల్పన
నాడు- నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని విడదల రజిని తెలిపారు. బీసీలకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఎవరూ ఇవ్వనంత ప్రాధాన్యత ఇచ్చారని, బీసీలు ఎప్పటికీ సీఎం జగన్ వెంటే ఉంటారని విడదల రజిని స్పష్టం చేశారు. అంతేకాదు మెడికల్ సర్వీసెస్ విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఐకాన్ గా నిలుస్తోందని మంత్రి విడదల రజిని పేర్కొన్నారు. ఏపీలో అందుతున్న వైద్యసేవలు పట్ల కేంద్రం నుంచి కూడా ప్రశంసలు అందుతున్నాయని ఆమె వెల్లడించారు. రాష్ట్రంలో మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమకూరుస్తున్నామని, టెలిమెడిసిన్ సర్వీసెస్, హెల్త్ సెంటర్లను కూడా ఏర్పాటు చేస్తున్నామని విడదల రజిని పేర్కొన్నారు.
పేదలకు వైద్యం విషయంలో సీఎం జగన్ రాజీ పడటం లేదు
పేదలకు వైద్యం అందించే విషయంలో సీఎం జగన్ ఎక్కడా రాజీ పడకుండా ముందుకు వెళుతున్నారని ఆమె తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా మార్చడానికి జగన్ కృషి చేస్తున్నారని మంత్రి విడదల రజిని వెల్లడించారు. ప్రతి పార్లమెంటు పరిధిలో మెడికల్ కాలేజీలు రాబోతున్నాయని శుభవార్త చెప్పిన మంత్రి విడుదల రజిని, రాష్ట్రంలో 16 మెడికల్ కళాశాలలో త్వరలో ఏర్పాటు కాబోతున్నాయి అంటూ వెల్లడించారు.
వచ్చే నెలాఖరులోగా అన్ని మెడికల్ కళాశాలల నిర్మాణ పనులు ప్రారంభం అవుతాయి
వచ్చే నెలాఖరు లోపు అన్ని మెడికల్ కళాశాల నిర్మాణ పనులు ప్రారంభం కాబోతున్నాయి అని విడదల రజిని పేర్కొన్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి నాడే రాష్ట్రంలో మెడికల్ కళాశాలల నిర్మాణం పై గుడ్ న్యూస్ చెప్పిన విడదల రజిని సీఎం జగన్ తనకు ఇచ్చిన బాధ్యత మేరకు వైద్య ఆరోగ్యశాఖను గాడిలో పెట్టడం కోసం తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించటమే తమ ప్రభుత్వం లక్ష్యమని పేర్కొన్నారు.