పూణెలో ఏపీకి చెందిన టెక్కీ అదృశ్యం: విషాదం, మంచాన పడిన తల్లి
అమరావతి: విజయవాడకు సమీపంలోని నున్న ప్రాంతానికి చెందిన ఓ సాప్ట్వేర్ ఇంజనీర్ మహారాష్ట్రలోని పూణెలో ఉద్యోగ నిమిత్తం వెళ్లి అదృశ్యమయ్యాడు. దీంతో కుటుంబంలో విషాదం నెలకొంది. దీనిపై పూణె పోలీసులకు ఫిర్యాదు చేసినా సక్రమంగా స్పందించడం లేదని, ప్రభుత్వమే స్పందించి తమకు న్యాయం చేయాలని యువకుడి తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.
తండ్రి లక్ష్మారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం నున్న గ్రామానికి చెందిన గుదిబండి లక్ష్మారెడ్డి, పార్వతి భవానీ దంపతుల కుమారుడు శ్రీహర్షారెడ్డి(28) ఎంబీఏ పూర్తి చేశాడు. అనంతరం గతేడాది డిసెంబర్ నెలలో పూణెలోని ప్రైవేట్ టెలికం కంపెనీ వోడాఫోన్లో టీం మేనేజర్గా చేరాడు.
ప్రతి రోజూ తల్లిదండ్రులకు ఫోన్ చేసి మాట్లాడే అతడు ఈ నెల ఆగస్టు 6 (శనివారం) నుంచి కుటుంబ సభ్యులతో మాట్లాడటం మానేశాడు. దీంతో అతడి ఫోన్కు తల్లిదండ్రులు ప్రయత్నిస్తున్నా ఫోన్ స్విచ్ఛాఫ్ అని వచ్చింది. దీంతో అనుమానం వచ్చిన తండ్రి ఈ నెల 9వ తేదీన పూణెకు వెళ్లి విచారించగా అదృశ్యం అయినట్లు గుర్తించారు.
శ్రీహర్షారెడ్డి పనిచేస్తున్న వోడాఫోన్ కంపెనీకి వెళ్లి విచారించగా కంపెనీ ప్రతినిధులు సరిగ్గా స్పందించలేదు. దీంతో వెంటనే తన కుమారుడు అదృశ్యమైనట్లు పూణెలోని కరాడి ప్రాంతంలోని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే భాషాపరమైన ఇబ్బందులతో అక్కడి పోలీసులు సక్రమంగా స్పందించడం లేదు.
దీంతో శ్రీహర్షారెడ్డి బావ ప్రదీప్ అక్కడకు వెళ్లి విచారించారు. ఆగస్టు 6న 1:55 గంటలకు తాను ఉంటున్న హాస్టల్ నుంచి బయటకు వచ్చాడని, 2 గంటల ప్రాంతంలో ఏటీఎంలో రూ. 6000 డ్రా చేసినట్టు తెలుసుకున్నారు. ఆ తర్వాత 2:53 గంటల సమయంలో ఫోన్ స్విచ్చాఫ్ అయిందని పూణె పోలీసులు తెలిపారు.
కుమారుడి అదృశ్యంతో తల్లి పార్వతి భవానీ అనారోగ్యం పాలైంది. తమ ఒక్కగానొక్క కుమారుడికి ఏం జరిగిందో తెలియక నరకయాతన పడుతున్నారు. తండ్రి లక్ష్మారెడ్డి కొడుకు కోసం ఇంకా పూణెలోనే గాలిస్తున్నారు. మరోవైపు శ్రీహర్షారెడ్డి అదృశ్య సంఘటనను స్థానిక ప్రజాప్రతినిధులు జీతం శ్రీనివాసరావు, సుబ్రహ్మణ్యరాజులు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ దృష్టికి తీసుకెళ్లారు.
దీంతో ప్రభుత్వం ద్వారా ఆదుకుంటామని శ్రీహర్షారెడ్డి తల్లిదండ్రులకు ఆయన హామీ ఇచ్చినట్లుగా సమాచారం.