విజయవాడ కార్పోరేషన్లో డివిజన్ల పెంపు..! గెజిట్ నోటిఫికేషన్ జారీ..!
ఏపీలో స్థానిక సంస్ధల ఎన్నికలకు సిద్దమవుతున్న ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా డివిజన్లు, వార్డుల సంఖ్యను పెంచుతోంది. ఇందులో భాగంగా కీలకమైన విజయవాడ నగర పాలక సంస్ధలోనూ (Vijayawada Municipal Corporation) డివిజన్ల సంఖ్యను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్లో 64 డివిజన్లు ఉండగా.. వీటిని 86కు పెంచాలని నిర్ణయించింది. కొత్తగా ఏర్పడిన 22 డివిజన్లతో కలుపుకుని ఇప్పుడు మొత్తం 86 డివిజన్లు అయ్యాయి.
కార్పోరేషన్ ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది మే నెలలో విజయవాడలో డివిజన్ల పెంపు ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. డివిజన్లను ప్రస్తుతం ఉన్న 64 నుంచి 86కు పెంచేందుకు వీలుగా మే 18 నుంచి 24 వరకూ ప్రజల నుంచి అధికారులు అభ్యంతరాలు స్వీకరించారు. ఇందులో అత్యధికంగా విజయవాడ తూర్పు నియోజకవర్గం పరిధిలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటివరకూ తూర్పులో ఉన్న 21 డివిజన్ల సంఖ్య కాస్తా 29కి పెరిగింది. వీటిపై ప్రజల నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాకపోవడంతో వీటిని ఖరారు చేశారు. అలాగే మిగిలిన ప్రాంతాల్లోనూ డివిజన్ల పెంపుపై అభ్యంతరాలు ఆహ్వానించి ఖరారు చేశారు. దీంతో 86 డివిజన్లు ఖరారయ్యాయి.

ప్రస్తుతం అమరావతి రాజధాని పరిధిలో ఉన్న విజయవాడ కార్పోరేషన్లో తాజా మార్పుల తర్వాత జరిగే ఎన్నికలు అంతే కీలకం కాబోతున్నాయి. అందుకే ఇక్కడ ఈసారి ప్రత్యక్ష ఎన్నికల విధానంలో మేయర్ పదవి కూడా కీలకంగా మారింది. దీనికి కేవలం టీడీపీలోనే 15 మంది వరకూ పోటీ పడుతున్నారు. ఇక కూటమిలో మిత్రపక్షాలైన జనసేన, బీజేపీ కూడా అవకాశం కోసం ఎదురుచూస్తున్నాయి. అలాగే విపక్ష వైసీపీ కూడా ఇక్కడ అదృష్టం పరీక్షించుకోనుంది.














Click it and Unblock the Notifications
