విశాఖ-బెంగళూరు ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్..!
ప్రస్తుతం ఏపీలో అత్యంత రద్దీ ఉన్న రూట్లలో విశాఖపట్నం -బెంగళూరు (Visakhapatnam- Bengaluru) మార్గం కూడా ఒకటి. బెంగళూరులో ఉండే సాఫ్ట్ వేర్ ఉద్యోగులు వారాంతంలో ఉత్తరాంధ్రలోని తమ స్వస్థలాలకు రావడం, తిరిగి వెళ్లడం కారణంగా ఈ రూట్లో రద్దీ అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు ప్రత్యేక రైళ్లు నడుపుతున్న దక్షిణ కోస్తా రైల్వే మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రైళ్లను మరికొంతకాలం పొడిగించాలని అధికారులు నిర్ణయించారు.
విశాఖపట్నం నుంచి ఎస్ఎంవీటీ బెంగళూరుకు ప్రతీ శుక్రవారం నడుపుతున్న ప్రత్యేక రైలు నంబర్ 08581 గడువు ఈ నెల 31తో ముగియనుంది. ఈ నేపథ్యంలో మళ్లీ ఆగస్టు 7 నుంచి సెప్టెంబర్ 25 వరకూ నడపాలని దక్షిణ కోస్తా రైల్వే నిర్ణయం తీసుకుంది. అలాగే ఎస్ఎంవీటీ బెంగళూరు నుంచి విశాఖపట్నానికి ప్రతీ శనివారం నడుపుతున్న ప్రత్యేక రైలు నంబర్ 08507 గడువు ఆగస్టు 1తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈ రైలును తిరిగి ఆగస్టు 8 నుంచి సెప్టెంబర్ 26 వరకూ నడపబోతున్నారు.

ప్రస్తుతం ఈ రెండు రైళ్లు నడుపుతున్న రూట్ , సమయాలు, కోచ్ లు, హాల్ట్ లు ఏమీ మారకుండా అలాగే కొనసాగుతాయని దక్షిణ కోస్తా రైల్వే అధికారులు ప్రకటించారు. ప్రయాణికుల నుంచి అడ్వాన్స్ రిజర్వేషన్ల కోసం పెరుగుతున్న డిమాండ్ ఆధారంగా రైల్వే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా వారాంతంలో ఈ రెండు స్టేషన్ల మధ్య రద్దీ ఎక్కువగా ఉంటున్నట్లు తెలుస్తోంది. కాబట్టి విశాఖ - బెంగళూరు మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికులు ఈ ప్రకటనను గమనించి తదనుగుణంగా రిజర్వేషన్లు చేయించుకోవాల్సిందిగా అధికారులు కోరుతున్నారు.















Click it and Unblock the Notifications