భారీ కుట్ర?: గాంధీపై 3సార్లు కాల్పులు జరిపిన గాడ్సే, 4వ బుల్లెట్ పేల్చిందెవరు?
ఇప్పటి వరకు మహాత్మాగాంధీని చంపింది ఎవరంటే? నాథురాం గాడ్సే అనే సమాధానమే వచ్చేది. కానీ, ఇప్పుడు మరో ప్రశ్న తలెత్తింది. తాను గాంధీని మూడుసార్లు కాల్చానని కోర్టులో చెప్పాడు.
న్యూఢిల్లీ: ఇప్పటి వరకు మహాత్మాగాంధీని చంపింది ఎవరంటే? నాథురాం గాడ్సే అనే సమాధానమే వచ్చేది. కానీ, ఇప్పుడు మరో ప్రశ్న తలెత్తింది. తాను గాంధీని మూడుసార్లు కాల్చానని కోర్టులో చెప్పాడు. పోలీసులు తమ విచారణలో కూడా అదే తేల్చారు. కానీ, గాంధీ శరీరంలో నాలుగు బుల్లెట్లు ఉన్నట్లు మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే ఆ నాలుగో బుల్లెట్ ఎవరు కాల్చారనేది ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది.
అసలు విషయం దాచేశారా?
గాంధీ హత్య వెనక అసలు కారణమేంటి? 1948, జనవరి 30న గాంధీ హత్య సమయంలో గాడ్సే, ఆప్టేతోపాటుగా మరో హంతకుడూ అక్కడ ఉన్నాడా? అనే పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జాతిపితను నాథూరామ్ గాడ్సే మూడుసార్లు కాల్చాడని పోలీసులు తమ నివేదికలో పేర్కొన్నారు. అయితే నాలుగో బుల్లెట్ కూడా గాంధీ శరీరంలో ఉందని నాటి మీడియాలో కథనాలొచ్చాయి. గాడ్సే మూడుసార్లు కాలిస్తే.. నాలుగో బుల్లెట్ పేల్చిందెవరు? ఈ ప్రశ్నలపై స్పష్టత ఇవ్వాలని సుప్రీం కోర్టులో తాజాగా పిటిషన్ దాఖలైంది. గాంధీ హత్యకు సంబంధించి అసలు విషయాల్ని దాచిపెట్టేందుకు చరిత్రలోనే అతిపెద్ద కుట్ర జరిగిందనే అనుమానాలనూ పిటిషన్లో లేవనెత్తారు.
సావర్కర్పై ఆధారాలేవి?
అంతేగాక, గాంధీ హత్యతో సంబంధం లేని వినాయక్ దామోదర్ సావర్కర్పై నిందమోపేందుకు ఆధారాలున్నాయా? అని పిటిషన్ ప్రశ్నించింది. ముంబైకి చెందిన చరిత్ర పరిశోధనకారుడు, అభినవ్ భారత్ సంస్థ ట్రస్టీ డాక్టర్ పంకజ్ ఫడ్నిస్ ఈ పిటిషన్ వేశారు. గాంధీ హత్యపై విచారణ జరపాలంటూ 1966లో అప్పటి ప్రభుత్వం వేసిన జస్టిస్ జేఎల్ కపూర్ కమిషన్ అసలు వాస్తవాలను, కుట్ర కోణాన్ని బహిర్గతపర్చడంలో పూర్తిగా విఫలమైందని, ఇందుకోసం కొత్త కమిషన్ను వేయాలని కోరారు.
నాలుగో బుల్లెట్ గురించి పట్టించుకోరా?
గాంధీ హత్య కేసులో కోర్టులు 3 బుల్లెట్ల సిద్ధాంతంపైనే పూర్తిగా ఆధారపడటాన్ని పంకజ్ ఫడ్నిస్ ప్రశ్నించారు. దీని ఆధారంగానే గాడ్సే, నారాయణ్ ఆప్టేలను నవంబర్ 15, 1949లో ఉరిశిక్ష విధించారు. 'నాటి మీడియా రిపోర్టులు, నా పరిశోధనల ప్రకారం గాంధీ శరీరంలో 4 బుల్లెట్లు దిగాయి. 7 బుల్లెట్లుండే గాడ్సే పిస్టల్ నుంచి 4 వినియోగించని బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంటే నాలుగో బుల్లెట్ గాడ్సే పిస్టల్ నుంచి వచ్చే అవకాశమే లేదు. అంటే ఖచ్చితంగా మరో హంతకుడు అక్కడే ఉన్నాడు. అతను ఎవరనేది ఇంతవరకు తేలలేదు' అని పేర్కొన్నారు. కాగా, సరైన సాక్ష్యాల్లేవంటూ సావర్కర్ను వదిలేసిన విషయం తెలిసిందే.
గాంధీ హత్యతో ఇప్పటికీ ఉద్రిక్తతే..
దేశ విభజన తప్పదని తెలిశాక.. భారత్-పాక్ ప్రజల మధ్య సత్సంబంధాలుండేలా గాంధీ-జిన్నా చేసిన ప్రయత్నాన్ని అమలుకాకుండా చూసేందుకే మహాత్ముడి హత్య జరిగిందని ఫడ్నిస్ ఆరోపించారు. గాంధీ-జిన్నా ప్రయత్నం అమలుకాని కారణంగానే ఇప్పటికీ భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని ఫడ్నిస్ పేర్కొన్నారు. కాగా, లక్షలాది మంది హిందువులకు అన్యాయం చేస్తున్నారనే కారణంగానే తాను గాంధీని హతమార్చినట్లు గాడ్సే ఉరిశిక్షకు ముందు కోర్టులో అంగీకరించారు. దీంతో గాడ్సేతోపాటు అతనికి సహకరించిన ఆప్టేను 1949లో ఉరితీశారు.