మళ్ళీ చంద్రబాబు సీఎం కావాలి..అమరావతిని కాపాడాలన్న రాజధాని మహిళా రైతులు
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు న్యూఇయర్ వేడుకలకు చాలా దూరంగా ఉన్నారు. రాజధాని అమరావతి విషయంలో జరుగుతున్న రగడ నేపథ్యంలో రాజధాని రైతులు బాధలో ఉంటే కొత్త సంవత్సరం జరుపుకోవడం అవసరమా అని ఆయన నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉన్నారు. ఇక అంతే కాదు కొత్త సంవత్సరమైన 2020 లో మాజీ సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి తో కలిసి రాజధాని అమరావతి ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.
రైతుల దీక్షకు మద్దతు తెలిపిన చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు
రైతుల బాధలు అడిగి తెలుసుకుంటున్నారు. రాజధాని అమరావతిని మార్చవద్దని, సేమ్ అమరావతి అంటూ సాగుతున్న రైతుల దీక్షకు చంద్రబాబు భువనేశ్వరి దంపతులు మద్దతు తెలిపారు.
కొత్త సంవత్సరం తొలి రోజున రాజధాని ప్రాంతం లోని ఎర్రబాలెం లో రైతు దీక్షకు మద్దతు తెలిపిన చంద్రబాబు దంపతులు కొత్త సంవత్సరం రోజు రైతుల మధ్యే గడుపుతున్నారు. ఈ సందర్బంగా రాజధాని మహిళా రైతులు తమ ఆవేదనను చంద్రబాబుకు విన్నవించుకున్నారు.
రాజధాని విషయంలో వైసీపీ వచ్చిన నాటి నుండి నీలినీడలు
జగన్ సీఎం అయిన తర్వాత ఇప్పటివరకు అన్నీ ఇబ్బందులు ఎదురవుతున్నాయని, రాజధాని విషయంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి నీలి నీడలు కమ్ముకున్నాయి అని, ఉన్న భవనాలు కూల్చడం మినహాయించి కొత్త భవనాలు కట్టిన జాడే లేదని మహిళలు చంద్రబాబుకు చెబుతున్నారు. ఇంతవరకు రాజధాని నిర్మాణం వైసిపి ప్రభుత్వ హయాంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని వారు పేర్కొన్నారు.
ఓట్లేసినందుకు చెప్పుతో కొట్టుకునేలా చేశారన్న మహిళలు
జగన్ ను నమ్మి ఓట్లు వేసినందుకు మమ్మల్ని మేం చెప్పుతో కొట్టుకునేలా పరిపాలన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క రాజధాని నిర్మాణానికి నిధులు లేని ఏపీ ప్రభుత్వం మూడు రాజధానులను నిర్మాణం ఎలా చేస్తుంది అంటూ ప్రశ్నిస్తున్న మహిళలు చంద్రబాబుకు తమ గోడును విన్నవించుకున్నారు. మళ్లీ చంద్రబాబు నాయుడు సీఎం కావాలని, అమరావతిని కాపాడగలిగింది చంద్రబాబు ఒక్కరే అని వారు చెప్తున్నారు.
చంద్రబాబు మళ్ళీ సీఎం కావాలి .. అమరావతిని కాపాడాలని కోరిన మహిళలు
రైతులు చంద్రబాబును అమరావతిని కాపాడాలని ముక్తకంఠంతో నినదిస్తున్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనలో రాజధాని రైతులకు కష్టాలు వచ్చిపడ్డాయి అని, రాష్ట్ర అభివృద్ధి కోసమే నాడు భూములు ఇచ్చామని, కానీ నేడు కొత్త సంవత్సరం రోజు కూడా కన్నీళ్ళ పర్యంతం అవుతున్నామని చంద్రబాబు ముందు కన్నీరు పెట్టుకున్నారు రాజధాని ప్రాంత మహిళా రైతులు. తమ బిడ్డల భవిష్యత్ ప్రశ్నార్ధకం చేస్తున్నారని ఆందోళన చేస్తున్న మాపై వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు మహిళా రైతులు .