వైసీపీకి కంట్లో నలుసులా చింతకాయల విజయ్ ? టీడీపీ సోషల్ వ్యూహకర్త-అదను చూసి పట్టిన సీఐడీ!
ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీగా సాగుతున్న పొలిటికల్ వార్ లో సోషల్ వ్యూహాలది కీలక పాత్ర. ప్రత్యర్ధుల బలహీనతల్ని ఎప్పటికప్పుడు పట్టుకుని వాటిని తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా సెకన్ల వ్యవధిలోనే వైరల్ చేయగల వ్యూహాలకు ఇప్పుడు ఏపీలో ఎంతో డిమాండ్ ఉంది. ఈ పనిని సమర్ధవంతంగా నిర్వహించడం ద్వారా వైసీపీ ప్రభుత్వానికి కంటగింపుగా మారిపోయారు చింతకాయల విజయ్. సీఎం జగన్ సతీమణి భారతిపై పెట్టిన పోస్టు వ్యవహారంలో సీఐడీ ఇచ్చిన నోటీసులతో విజయ్ మరోసారి తెరపైకి వస్తున్నారు.
ఎవరీ చింతకాయల విజయ్?
టీడీపీకి చెందిన మాజీ మంత్రి, సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడి కుమారుడే ఈ చింతకాయల విజయ్. ఐటీ నిపుణుడైన విజయ్ కొంతకాలంగా హైదరాబాద్ లోనే ఉంటూ టీడీపీ సోషల్ మీడియా వ్యూహాల్లో కీలకంగా ఉన్నారు. 2019 ఎన్నికలకు ముందే టీడీపీ సాంకేతిక వ్యూహాల్లో కీలకంగా మారిన చింతకాయల విజయ్ గురించి పార్టీ కార్యకర్తలందరికీ తెలియకపోయినా ప్రధాన నేతలకు మాత్రం తెలుసు.
గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ టీడీపీ కోసం సోషల్ వ్యూహాలు రూపొందించినా అప్పట్లో వైసీపీ హవా కారణంగా విజయ్ ప్రతిభ వెలుగు చూడలేదు. అందులోనూ ప్రత్యర్ధి వైసీపీకి ప్రశాంత్ కిషోర్ వంటి వ్యూహకర్తలు పనిచేస్తున్న సమయంలో అధికార టీడీపీని పోటీగా నిలబెట్టడంలో కాస్త వెనుకబడ్డా... టీడీపీ విపక్షంలోకి వచ్చిన తర్వాత మాత్రం విజయ్ పేరు మార్మోగుతోంది.
ఐటీడీపీ వ్యూహకర్తగా పేరు
ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీగా సాగుతున్న పొలిటికల్ వార్ లో బహిరంగంగా సాగే విమర్శలతో పాటు సోషల్ మీడియా పాత్ర కూడా కీలకంగా మారిపోయింది. దీంతో విపక్ష టీడీపీని ఆ విషయంలో వైసీపీ కంటే పైచేయి సాధించిపెట్టేలా చేయడంలో విజయ్ కీలకపాత్ర పోషించారు. 2019 కంటే ముందు టీడీపీ అధికారంలో ఉండగానే ఆ పార్టీకి సోషల్ మీడియా వ్యూహాలు, ప్రచారం కోసం ప్రారంభించిన విభాగం ఐటీడీపీని నడిపిస్తోంది చింతకాయల విజయ్.
పార్టీలో గల్లా జయదేవ్ వంటి మరికొందరు నేతలతో కలిసి విజయ్ నడిపిస్తున్న ఐటీడీపీ 2019 ఎన్నికల్లో టీడీపీకి ఉపయోగపడకపోయినా.. అధికారం కోల్పోయాక టీడీపీకి మాత్రం ఎంతో ఉపయోగపడుతోంది. ఐటీడీపీ ద్వారా పంపుతున్న పోస్టులనే టీడీపీ స్ధానిక క్యాడర్ జనంలోకి షేర్ చేస్తోంది. ఇది వైసీపీకి కంటగింపుగా మారిపోతోంది.
వైసీపీపై టీడీపీ పైచేయి సాధించడంలో..
బయట పరిస్ధితి ఎలా ఉన్నా.. సోషల్ మీడియాకు వచ్చేసరికి మాత్రం వైసీపీతో పోలిస్తే గత కొంతకాలంగా టీడీపీ పైచేయి సాధిస్తూ వస్తోంది. దీనికి చాలా కారణాలున్నా ప్రధానంగా వినిపించే పేరు చింతకాయల విజయ్. హార్డ్ కోర్ టీడీపీ కార్యకర్త అయిన విజయ్ ఐటీడీపీ ద్వారా రచించే వ్యూహాలు, పెట్టే పోస్టులు ఇప్పుడు టీడీపీ సోషల్ మీడియా వింగ్ ను ప్రత్యర్ధి పార్టీ వైసీపీ కంటే పైచేయి సాధించేలా చేశాయి.
దీంతో సోషల్ వార్ లో టీడీపీ చాలా ముందుంది. ముఖ్యంగా టీడీపీ బలహీనతలపై వైసీపీ పెట్టే పోస్టులతో పోలిస్తే ఐటీడీపీ పెట్టే పోస్టుల వేగం, క్వాలిటీ, ప్రత్యర్ధి బలహీనతల గుర్తింపు వెనుక ఉన్నది చింతకాయల విజయ్. అందుకే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఆయన్ను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.
భారతీపేతో సీఐడీకి దొరికిన విజయ్
ఇన్నాళ్లూ వైసీపీ ప్రభుత్వ తప్పిదాలు, నిర్ణయాలపై ఐటీడీపీ చాలా పోస్టులే పెట్టేది. అవి జనంలోకి షేర్ అయిన తర్వాత ఎక్కువగా షేర్ చేస్తున్న వారిని వైసీపీ సర్కార్ సీఐడీ సాయంతో టార్గెట్ చేస్తూ కేసులు పెడుతోంది. అయితే ఇప్పటివరకూ తెరవెనుక ఉండి వైసీపీని టార్గెట్ చేస్తున్న చింతకాయల విజయ్ ఈసారి సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతిని ఉద్దేశించి పెట్టిన భారతీపే పోస్టుతో సీఐడీకి దొరికారు.
దీంతో సీఐడీ ఆయన పాత్రపై నిర్ధిష్ట ఆధారాలు సంపాదించి పకడ్బందీగా కేసు పెట్టినట్లు తెలుస్తోంది. అయితే సోషల్ మీడియా పోస్టులపై ఇప్పటికే కోర్టుల తీర్పుల్ని గమనిస్తే ఈ కేసులో ఏం జరగబోతోందో ఊహించవచ్చు. ఈ విషయం సీఐడీకి కూడా తెలుసు. అయితే చింతకాయల విజయ్ ను టార్గెట్ చేయడం ద్వారా టీడీపీ సోషల్ మీడియా వింగ్ ఐటీడీపీ దూకుడుకు కొంతమేర అడ్డుకట్ట వేయొచ్చనేది వైసీపీ సర్కార్ వ్యూహంగా కనిపిస్తోంది.