చంద్రబాబు పావులు, ఆ దెబ్బకు మోడి దిగొస్తారా? 'కేసీఆర్దే ఫైనల్'
న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ ప్రభుత్వంపై టీడీపీ మరోసారి అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెడుతోంది. ఈ మేరకు విజయవాడ ఎంపీ కేశినేని నాని మంగళవారం అవిశ్వాస తీర్మానానికి సంబంధించి లోకసభ సెక్రటరీ జనరల్కు లేఖ రాశారు. బుధవారం నాటి కార్యకలాపాల్లో అవిశ్వాస తీర్మానాన్ని చేర్చాలని కోరారు. టీడీపీ అవిశ్వాసానికి లాలూ ప్రసాద్ వంటి వారు మద్దతిచ్చారు.
Recommended Video
చదవండి: ట్విస్ట్.. వైసీపీ ఫ్లోర్ లీడర్గా బుట్టా రేణుక: అందుకేనని విజయసాయి ఆగ్రహం
కాంగ్రెస్ వంటి ప్రతిపక్షం మద్దతును కూడా చంద్రబాబు కోరే అవకాశం లేదని తెలుస్తోంది. కానీ ఆ పార్టీ అడగకున్నా మద్దతిస్తుందా తెలియాల్సి ఉంది. హోదా, విశాఖ రైల్వే జోన్, కడప స్టీల్ ప్లాంట్ సహా పలు అంశాలపై టీడీపీ డిమాండ్ చేస్తోంది.
డిప్యూటీ చైర్మన్ పదవిపై బాబు పావులు
డిప్యూటీ చైర్మన్ పదవి అంశాన్ని ఉపయోగించి బీజేపీని ఇరుకున పెట్టాలని చంద్రబాబు చూస్తున్నారని తెలుస్తోంది. ఈ మేరకు పావులు కదుపుతున్నారు. రాజ్యసభలో బీజేపీకి తగిన బలం లేదనే అంచనాకు వచ్చిన చంద్రబాబు పలు ప్రాంతీయ పార్టీల నేతలతో సమాలోచనలు జరుపుతున్నారని తెలుస్తోంది. ప్రాంతీయ పార్టీల బలం తెలియాలన్నా వచ్చే ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల హవా నడుస్తుందన్న సంకేతాలు జాతీయ స్థాయిలో పంపించాలన్నా బీజేపీ, కాంగ్రెస్సేతర అభ్యర్థిని ఉమ్మడిగా నిలబెడితే బాగుంటుందని కొత్త వ్యూహానికి తెరతీశారు. అలా కుదరకుంటే ఎన్డీయేతర పక్షాల అభ్యర్థులకు టీడీపీ మద్దతిచ్చే అవకాశం ఉందని సమాచారం. వైసీపీ ఇప్పటికే తన వైఖరిని ప్రకటించింది. ఓటింగుకు దూరంగా ఉంటామని ప్రకటించింది. రాష్ట్రంలోను పలువురు నేతలతో చంద్రబాబు భేటీ అవుతున్నారు. ఏపీ నుంచి ఢిల్లీ వరకు బీజేపీపై ఒత్తిడి పెంచాలనుకున్న బాబు వ్యూహం ఎంత వరకు ఫలిస్తుంది, కేంద్రం దిగి వస్తుందా అనేది ప్రశ్నే అంటున్నారు.
అవిశ్వాసం ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు కాదు
కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టి తీరతామని, ఇదే విషయాన్ని అఖిలపక్ష సమావేశంలో స్పష్టంగా చెప్పామని టీడీపీ ఎంపీ సుజనా చౌదరి అన్నారు. ప్రజల ఆకాంక్షను తెలియజేసేందుకే తప్ప, ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు అవిశ్వాస తీర్మానం పెట్టడం లేదన్నారు. విభజన శాస్త్రీయంగా జరగలేదని స్వయంగా మోడీనే అన్నారని, దానిని సరిచేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. నాలుగేళ్లుగా కేంద్రానికి సహకరించినా ఏపీకి అన్యాయం చేశారు తప్ప పట్టించుకోలేదన్నారు.
విజయసాయి రెడ్డి అలా చెప్పారు, కచ్చితంగా అడగలేదు
దేశంలో ఏపీ అంతర్భాగంగా ఉందనే విషయాన్ని ఎప్పటికప్పుడు గుర్తు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందనే విషయాన్ని అఖిలపక్ష సమావేశంలో టీడీపీ చెప్పిందని తెలుస్తోంది. తాము పార్లమెంట్ ఉభయ సభల్లోనూ నిరసన కొనసాగిస్తామని, లోకసభలో అవిశ్వాస తీర్మానాన్నిప్రవేశపెట్టి తీరతామని టీడీపీ చెప్పింది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై సుజన విమర్శలు గుప్పించారు. ఏపీకి హోదా ఇస్తే బాగుంటుందని ప్రధాని మోడీతో విజయసాయి అన్నారే తప్ప, హోదా కావాలని కచ్చితంగా అడగడం లేదన్నారు.
కేసీఆర్దే తుది నిర్ణయం
విభజన హామీలపై పార్లమెంటులో చర్చ జరగాలని కోరుకుంటున్నామని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత జితేందర్ రెడ్డి అన్నారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణకు అన్ని విధాలా కేంద్రం సహకరించాలన్నారు. గత సమావేశాలు వృథా అయ్యాయని, కాబట్టి బుధవారం నుంచి జరిగే పార్లమెంటు సమావేశాల్లో అర్థవంత చర్చ జరగాలని ఆకాంక్షించారు. కేంద్రంపై టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై కేసీఆర్దే తుది నిర్ణయం అన్నారు. కానీ అవిశ్వాస తీర్మానంను ఆమోదించాక నిర్ణయం తీసుకుంటామని కవిత టీడీపీకి షాకిచ్చారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ కూడా అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టేందుకు సిద్ధమవుతోంది.