జగన్కు నిమ్మగడ్డ రూట్ క్లియర్ ? సర్కారు ఊహించినట్లే- అనుకున్నదానికంటే ముందే
ఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికల నేపథ్యంగా వైసీపీ ప్రభుత్వానికి, ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్కూ మధ్య జరుగుతున్న పోరు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఈ పోరు హైకోర్టు, సుప్రీంకోర్టుకూ మధ్య నలుగుతోంది కూడా. ఈ పోరులో కొందరు బాధితులుగా మిగులుతుంటే మరికొందరు మాత్రం అవకాశాలు వెతుక్కుంటున్నారు. ఇంకొందరైతే తమకు అవకాశం దక్కుతుందని లెక్కలేసుకుంటున్నారు. ప్రభుత్వం మాత్రం తాము ఊహించిన విధంగానే నిమ్మగడ్డ వ్యూహాలు ఉన్నాయని, ఇది అంతిమంగా తమకే ప్రయోజనం చేకూరుస్తుందనే అంచనాతో సంతోషంగా కనిపిస్తోంది.
పోరు వారిది, పరీక్ష వీరికి
ఏపీలో స్ధానిక సంస్ధల వాయిదా తర్వాత నెలకొన్న పరిణామాల్లో ప్రభుత్వ ఉద్యోగులుగా రాజ్యాంగ సంస్ధ అయిన ఎన్నికల కమిషన్లో ఉన్న వారంతా రకరకాల పరీక్షలు ఎదుర్కొంటున్నారు. ఇందులో కొందరు ప్రభుత్వ వ్యూహాలకు సహకరిస్తుండగా.. మరికొందరు మాత్రం ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ ఆదేశాలను పాటిస్తున్నారు. ఇలా ప్రభుత్వ ఆదేశాలు పాటిస్తున్న వారిపై నిమ్మగడ్డ కన్నెర్ర చేస్తుండగా.. గతంలో నిమ్మగడ్డకు సహకరించిన వారిని ప్రభుత్వం టార్గెట్ చేసి సీఐడీ విచారణలు చేయించింది. దీంతో ఎస్ఈసీ ఉద్యోగులంతా ఇప్పుడు నిమ్మగడ్డ ఎప్పుడు వెళ్లిపోతారా అని ఎదురుచూస్తూ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నట్లు తెలుస్తోంది.
ఎస్ఈసీలో వరుస వికెట్లు
ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ మధ్య స్ధానిక ఎన్నికల విషయంలో నెలకొన్న పోరులో సర్కారుకు సహకరిస్తూ తనను ధిక్కరిస్తున్న వారిపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ వరుసగా వేటు వేస్తున్నారు. ఇప్పటికే తాను సెలవుపై వెళ్లి, తోటి ఉద్యోగులను కూడా ఎన్నికలకు సహకరించకుండా రెచ్చగొట్టారంటూ జాయింట్ డైరెక్టర్ సాయిప్రసాద్పై వేటు వేసిన నిమ్మగడ్డ.. అనంతరం ఎస్ఈసీ కార్యదర్శిగా ఉన్న ఐఏఎస్ వాణీ మోహన్ను సైతం తొలగించి ప్రభుత్వానికి సరెండర్ చేశారు. దీంతో కమిషన్లో మిగతా ఉద్యోగులకు హెచ్చరికలు పంపారు.వీరి స్ధానాల్లో మరో ఇద్దరు ఉద్యోగులను ప్రభుత్వం ఆయనకు కేటాయించాల్సి ఉంది.
వాణీ మోహన్ స్ధానంలో ఎవరు ?
ఇప్పటివరకూ ఎన్నికల సంఘంలో కార్యదర్శిగా ఉన్న వాణీ మోహన్ను ఎస్ఈసీ నిమ్మగడ్డ తొలగించడమే కాకుండా ప్రభుత్వానికి సరెండర్ చేయడంతో ఆమె స్ధానంలో మరో కార్యదర్శిని ప్రభుత్వం కేటాయించాల్సి ఉంది. దీంతో ఇప్పుడు వాణీ మోహన్ స్ధానంలో తమకు అనుకూలంగా ఉండే దీటైన వ్యక్తి కోసం ప్రభుత్వం అన్వేషణ సాగిస్తోంది. తమకు విధేయులుగా ఉండే ఐఏఎస్ లేదా ఐఎఫ్ఎస్ లేదా మరో అఖిల భారత సర్వీసు అధికారిని నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వాణీ మోహన్తో పోలిస్తే ఆమె స్ధానంలో వచ్చే అధికారి ప్రభుత్వానికి సహకరించే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. ఆ పరిస్ధితే వస్తే వారిని నిమ్మగడ్డ స్టాండ్ ఎలా ఉండబోతుందన్నది సర్కారు నిర్ణయం తర్వాత తేలాల్సి ఉంది.
జగన్ సర్కారుకు అలా రూట్ క్లియర్
వాస్తవానికి ఈ ఏడాది మార్చితో ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్ పదవీకాలం ముగిసిపోనుంది. ఆ తర్వాత తమకు అనుకూలమైన అధికారికి ఎన్నికల కమిషనర్గా నియమించి స్ధానిక ఎన్నికల నిర్వహణకు తెర తీయాలని ప్రభుత్వం యోచిస్తోంది. నిమ్మగడ్డ స్ధానంలో వచ్చే ఎన్నికల కమిషనర్ ఆధ్వర్యంలో గతంలో పనిచేసిన టీమ్ను మార్చి కొత్త వారిని నియమించాలని వ్యూహాలు రచిస్తోంది. కానీ నిమ్మగడ్డ రమేష్ ఇప్పుడే వారిని తొలగించుకుంటూ వెళ్లడం ద్వారా ప్రభుత్వానికి మార్గం సుగమం చేస్తున్నారు. నిమ్మగడ్డ తాజాగా వేటు వేసిన అధికారుల స్ధానంలో అంతకంటే విధేయులను నియమించేందుకు ప్రభుత్వానికి అవకాశం కలుగుతోంది. ఈ పరిణామాలు సహజంగానే వైసీపీలో ముందుగానే సంతోషం నింపుతున్నాయి.