పులివెందులలో పాగా కోసం టిడిపి అభివృద్ది మంత్రం:ఫలించేనా?
కడప:ప్రతిపక్షనేత జగన్ నైతిక స్థైర్యం దెబ్బతీయాలంటే ఆయన సొంత నియోజకవర్గం పులివెందులలో పాగా వేయడమే సరైన పరిష్కారమని టిడిపి చాలా కాలం కిందటే నిర్ణయించుకుంది.
అయితే అది అంత సులభం కాదని అంచనా వేసిన టిడిపి అందుకోసం కేవలం రాజకీయ వ్యూహాలే చాలవని...అభివృద్ది మంత్రం పఠిస్తేనే ప్రయోజనం ఉండొచ్చని విశ్లేషించింది. ఆ క్రమంలో మిగిలిన చోట్ల సంగతేమో కానీ ఈ నియోజకవర్గంలో మాత్రం సమస్యల పరిష్కారం పై పూర్తిగా దృష్టి సారించింది. ఇక్కడి ప్రజలకు ప్రధాన సమస్యలుగా ఉన్నవాటిని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ లక్ష్యం వైపు అడుగులు వేస్తోంది. అయితే మరికొన్ని నెలల్లో సార్వత్రిక ఎన్నికలు రానున్న నేపథ్యంలో మరి పులివెందులలో టిడిపి పాగా అనే కోరిక సఫలమవుతుందా?...అక్కడ ప్రస్తుత పరిస్థితి ఏమిటనే విషయాలపై ఒక విశ్లేషణ.
వైఎస్ కుటుంబం అడ్డా...పులివెందుల
కడప జిల్లాలో పులివెందులకో ప్రత్యేకమైన స్థానం ఉంది. కారణం అది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆయన తనయుడు జగన్ ఫ్యామిలీకి సుదీర్ఘకాలంగా కంచుకోట. గత నాలుగు దశాబ్దాలుగా ఎన్నికలొస్తే అక్కడ వైఎస్ కుటుంబానిదే హవా...ఈ విషయం రాజకీయం గురించి కాస్తో కూస్తో తెలిసిన ప్రతి తెలుగువాడికి తెలుసు. అందుకే పులివెందుల గురించి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఢిల్లీ దాకా తెలుసు. పులివెందులలో సర్పంచ్ పదవితో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన వైఎస్ కుటుంబం ఆ తరువాత కాలంలో ఏకంగా అవిభాజ్య ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠం అధిష్టించేంత వరకూ ఎదిగింది. అంతేకాదు ఆ తరువాత ఆ కుటుంబం పట్టు పులివెందులకే కాకుండా ఆ నియోజకవర్గం ఉన్న కడప జిల్లా అంతటిపై పెరిగింది.
పులివెందులపై పట్టు...ఎంతలా అంటే
మరోసారి పులివెందులపై వైఎస్ కుటుంబం పట్టు గురించి మాట్లాడితే...మిగతా ప్రాంతాల రాజకీయ పరిస్థితులతో,పరిణామాలతో సంబంధం లేకుండా పులివెందులలో ప్రజలు ఎప్పుడూ వైఎస్ కుటుంబానికే పట్టం కట్టేవారు. అందుకు నిదర్శనంగా ఆనాటి ప్రముఖ కథానాయకుడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ఏర్పాటుచేసినప్పుడు రాష్ట్రం అంతా ఒకలా స్పందించినా అక్కడ ప్రజలు మాత్రం వైఎస్ కుటుంబానికే పట్టం కట్టారు. ఆ తరువాత కూడా అక్కడ ఎప్పుడూ అంతే!
టిడిపి కన్ను...ఎందుకంటే?
ఇక ప్రస్తుత విషయానికొస్తే 2014 ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి రావడం...వైఎస్ జగన్ మరోసారి పులివెందుల నియోజకవర్గం నుంచి గెలిచి ప్రధాన ప్రతిపక్ష నేతగా నిలవడం జరిగాయి. అధికార...ప్రతిపక్ష పార్టీల మధ్య సహజంగా ఉండే విభేదాల నేపథ్యంలో జగన్ వైఖరి టిడిపి అధినేత చంద్రబాబును బాగా చికాకు పరిచింది. వారి బేధాబిప్రాయాలు రాజకీయాలను దాటి వ్యక్తి గత స్థాయికి చేరిన పరిస్థితి. దీంతో జగన్ ను దెబ్బతీయాలంటే ఏమి చేయొచ్చనే సమాలోచనల్లో భాగంగా ముందుగా కడప జిల్లాలో...అందులోనూ పులివెందుల నియోజకవర్గం లో టిడిపి పాగా వేస్తే జగన్ నైతిక స్థైర్యం బాగా దెబ్బతీయొచ్చనే ఆలోచనకు చంద్రబాబు కూడా సై అన్నారట.
రాజకీయం కాదు...అభివృద్ది మంత్రం
అయితే పులివెందులలో పాగా వేయాలంటే కేవలం రాజకీయం ద్వారా సాధ్య పడదని...పులివెందులలో ప్రజలను తమవైపు ఆకట్టుకోవాలంటే అంతకుమించి చేయాలని...అదే అభివృద్ది మంత్రమని స్థానిక టిడిపి నేతలు చంద్రబాబుకు తెలిపారట. అందుకు సానుకూలంగా స్పందించిన చంద్రబాబు వైఎస్ ఫ్యామిలీ ఆ నియోజకవర్గంలో ఇప్పటివరకూ చేయలేని పనులను కూడా తాము చేసి చూపిస్తే అక్కడి వారిని తమవైపు తిప్పుకోవచ్చని...అలాగే జగన్ కూడా అభివృద్దిపై ఏమీ మాట్లాడలేని పరిస్థితి ఉంటుందని ఆ దిశలో టిడిపి ప్రభుత్వం కార్యాచరణకి సంసిద్దమైంది.
నీరే...ఇక్కడి ప్రధాన సమస్య
రాయలసీమ ముఖ్య సమస్య అయిన నీరే పులివెందులకు కూడా ప్రధాన సమస్య కావడంతో ముందుగా ఆ సమస్యని పరిష్కరించేందుకు టిడిపి ప్రభుత్వం పూనుకుంది. నాలుగు దశాబ్దాలుగా వైఎస్ ఫ్యామిలీ పాలనలో ఉన్నప్పటికీ పులివెందులకు ప్రధాన సమస్యగా ఉన్న తాగు- సాగునీటి సదుపాయంకల్పించి వైఎస్ కుటుంబం చేయలేని పని చేసి చూపించిన భావన రప్పించేందుకు చంద్రబాబు పట్టదలతో ఆ దిశలో కృషి చేసి నీటి సమస్యను ఓ కొలిక్కి తెచ్చారు. గండికోట ప్రాజెక్టుకి కృష్ణాజలాలను తరలించి అక్కడ నుంచి పులివెందుల ప్రాంతంలోని చిత్రావతి, పైడిపాలెం ప్రాజెక్టులకు నీరందించారు. తద్వారా పులివెందుల కెనాల్స్కు నీటిని విడుదల చేశారు. దీంతో పులివెందుల ప్రజలకు తాగు-సాగునీటి సదుపాయం ఏర్పడింది. వ్యవసాయపరంగా ఆ ప్రాంతం బాగా పుంజుకునే పరిస్థితి ఏర్పడింది.
మరి ఇప్పుడు...ఆ కోరిక నెరవేరుతుందా?
మరో ఏడాదిలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో తాము చేసిన కృషి, వాటి ఫలాలు తమకు ఎంతవరకు ప్రయోజనకరంగా పరిణమిస్తాయో టిడిపి లెక్కలు వేస్తోంది. పులివెందులలో టీడీపీ సాధించిన ప్రగతి ఆ పార్టీకి గతంతో పోలిస్తే మరింత సానుకూల స్పందనకు దోమద పడటం ఖాయమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గతంలో వేరే పార్టీల ఉనికే నామమాత్రమైన ఇక్కడ...ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సమావేశాలు నిర్వహిస్తే జనాలు భారీగానే తరలివస్తున్నపరిస్థితి కనిపిస్తోంది. పులివెందుల ప్రజల్లో ఈ మార్పు రావడం వెనుక స్థానిక టీడీపీ నేతల నిర్విరామ కృషి కూడా ఉందని చెప్పకతప్పదు.
ఎవరెవరంటే...మరి ఫలితం!
పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ సతీష్కుమార్రెడ్డి, మరో నేత రాంగోపాల్ రెడ్డి...వీరిద్దరూ కలసి పులివెందుల ప్రజల్లో రాజకీయ పరివర్తన తేవడానికి అహర్నిశలూ శ్రమించారు. పులివెందుల వైఎస్ కుటుంబం సెంటిమెంట్ నుంచి ప్రజల మెంటాలిటీ టీడీపీ వైపు మళ్లించేందుకు ఎంతో కష్టపడ్డారు. ఇదే సందర్భంలో సతీష్కుమార్రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. పులివెందులకు నీటిని తెచ్చేవరకూ తన గడ్డం మీసాలను తీయబోనని కడపలో ఆయన శపథం చేశారు. రెండేళ్లపాటు అదే విధంగా తిరిగారు. తన పంతం నెరవేరాకే ఆయన గడ్డం మీసాలు తొలగించారు. ఇక రాంగోపాల్ రెడ్డి ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు వారికి అందేలా శ్రద్ధపెట్టారు. టీడీపీ హయాంలో పులివెందులకు నాలుగు వేల ఇళ్లు మంజూరయ్యాయి. ఇంకా అనేక అభివృద్ది పనులతో ఆ ప్రాంత ప్రజల మనసు చూరగొన్నారు. ఇప్పుడు మరో నేత, ఎమ్మెల్సీ బీటెక్ రవి కూడా వీరి దారిలోనే కృషి సాగిస్తున్నారు. ఈ విషయంలో వీరికి మంత్రుల అండదండలతో పాటు సిఎం చంద్రబాబు ఆశీస్సులు దండిగా ఉన్నాయి. మరైతే ఇంత జరిగాక...ఇన్ని జరిగాక ప్రతిపక్షనేత జగన్ అడ్డా పులివెందులలో పాగా వేయాలన్న టిడిపి ఆకాంక్ష ఎంతవరకు నెరవేరుతుందో చూడాలంటే మరో ఏడాది వరకు వేచిచూడక తప్పదు.