ఏపీలో రాహుల్ భారత్ జోడో యాత్ర- 4 రోజులు-100 కి.మీ-జగన్ అనుమతిస్తారా ? అడ్డుకుంటారా ?
దేశంలో బీజేపీ అనుసరిస్తున్న విద్వేష విధానాలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న భారత్ జోడో యాత్ర వచ్చేనెల 7న ప్రారంభం కానుంది. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ సాగే ఈ యాత్ర మధ్యలో ఏపీలోనూ సాగబోతోంది. కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ ఈ యాత్రలో భాగంగా ఏపీలో పర్యటించబోతున్నారు. ఈ మేరకు రూట్ మ్యాప్ రెడీ అవుతోంది. అయితే ఈ యాత్రకు సీఎం జగన్ ఏపీలో అనుమతిస్తారా లేక ఆంక్షలు పెడతారా అన్నది ఉత్కంఠ రేపుతోంది.
రాహుల్ భారత్ జోడో యాత్ర
దేశవ్యాప్తంగా బీజేపీ సాగిస్తున్న విద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపుమేరకు రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్రకు సిద్ధమవుతున్నారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ 3500 కిలోమీటర్ల మేర సాగే ఈ యాత్ర సెప్టెంబర్ 7న తమిళనాడులో ప్రారంభం కానుంది. అనంతరం కేరళ, కర్నాటక, ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఉత్తర్ ప్రదేశ్, హర్యానా, ఢిల్లీ, పంజాబ్, చంఢీఘడ్ మీదుగా జమ్ము,కశ్మీర్ కు చేరుకుని అక్కడ ముగుస్తుంది. కేవలం ఐదు నెలల వ్యవధిలో ఈ యాత్ర పూర్తి చేయాలనేది కాంగ్రెస్ ఆలోచన.
ఏపీలో 4 రోజుల్లో 100 కిలోమీటర్లు
ఇదే క్రమంలో ఏపీలో నాలుగు రోజుల పాటు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కొనసాగనుంది. ఆంధ్ర ప్రదేశ్ లో మొత్తం 100 కిలోమీటర్ల మేర.. 4 రోజుల పాటు రాహల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర కొనసాగనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇంకా ఏయే తేదీలు అనేవి ప్రకటించాల్సి ఉంది. ఏపీలో రెండు లోకసభ నియోజకవర్గాలు, నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల గుండా రాహుల్ గాంధీ పాదయాత్ర ఉంటుందని సమాచారం. దీనిపై త్వరలో పూర్తి వివరాలు ప్రకటించనున్నారు.
జగన్ అనుమతిస్తారా ?
అయితే రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ జోడో యాత్రకు తమ పార్టీ డీఎంకేతో అధికారం పంచుకుంటున్న తమిళనాడులో కానీ, విపక్ష సీపీఎం అధికారంలో ఉన్న కేరళలో అడ్డంకులు ఉండకపోవచ్చు. అయితే ఏపీకి వచ్చే సరికి మాత్రం వైసీపీ అధినేత, సీఎం జగన్ అనుమతిస్తారా లేదా అన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. రాహుల్ గాంధీ యాత్ర షెడ్యూల్ ఇంకా ప్రకటించలేదు. ప్రకటించాక ఏపీ ప్రభుత్వం అనుమతి కోరే అవకాశముంది. అప్పుడు జగన్ ఎలా స్పందిస్తారన్నది కీలకంగా మారింది.
జగన్ ఓదార్పును అడ్డుకున్న సోనియా
గతంలో తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఇది తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్ జగన్ ఓదార్పు యాత్ర చేపట్టారు. అయితే అప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్నారు. దీంతో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ దాన్ని అడ్డుకున్నారు. వ్యక్తిగతంగా యాత్రలు పెట్టి అప్పటి రోశయ్య ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టొద్దని సూచించారు. కానీ జగన్ కుటుంబం వినలేదు. దీంతో కాస్త కఠినంగానే చెప్పి పంపేశారు. దీన్ని జగన్ అవమానంగా భావించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వచ్చి మరీ యాత్ర కొనసాగించారు. అప్పుడు రోశయ్య ప్రభుత్వం సాయంతో కాంగ్రెస్ జగన్ ఓదార్పు యాత్రను అడ్డుకోవడమే కాక కేసులు పెట్టింది. ఆ తర్వాత సీబీఐ కేసులు పెట్టి ఏకంగా జైలుకే పంపింది. ఇప్పుడు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కోసం జగన్ అధికారంలో ఉన్న ఏపీలోకి వస్తున్నారు. దీంతో రాహుల్ యాత్రకు జగన్ అనుమతి ఇవ్వడం ఉత్కంఠ రేపుతోంది.