ప్రముఖ కథారచయిత పెద్దిభొట్ల సుబ్బరామయ్య కన్నుమూత!..
విజయవాడ: కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ప్రసిద్ద కథారచయిత పెద్దిభొట్ల సుబ్బరామయ్య(79) కన్నుమూశారు. గత కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన నాలుగు రోజుల క్రితం విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. పెద్దిభొట్ల మృతిపై సాహితీ లోకం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. కాగా, 1938 డిసెంబర్ 15న పెద్దిభొట్ల గుంటూరులో జన్మించారు. పాఠశాల విద్యను ఒంగోలులో అభ్యసించారు. ఉన్నతవిద్యను విజయవాడలో కొనసాగించారు. కాలేజీలో చదువుతున్న రోజుల్లోనే 'వేయిపడగలు' రచయిత విశ్వనాథ సత్యనారాయణ వద్ద శిష్యరికం చేశారు.
ఆ తర్వాతి కాలంలో విజయవాడలోని ఆంధ్రా లయోలా కాలేజీలో 40ఏళ్లు అధ్యాపకుడిగా పని చేశారు. 1996లో పదవీ విరమణ చేశారు.ఆయన సాహితీ ప్రస్థానంలో.. 200కు పైగా కథలు రాశారు. 'పూర్ణాహుతి', 'దుర్దినం', 'శుక్రవారం', 'ఏస్ రన్నర్', 'వీళ్ళు' (కథాసంకలనం) వంటివి ఆయన కథల్లో బాగా పాపులర్ అయ్యాయి. 'ముక్తి', 'చేదుమాత్ర' వంటి నవలలు పెద్దిభొట్లకు మంచి పేరు తెచ్చాయి.
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుతో పాటు రావిశాస్త్రి సాహిత్య స్మారకనిధి, గోపీచంద్ స్మారక అవార్డు, అప్పాజోస్యుల విష్ణుభొట్ల కందాలం ఫాండేషన్ వంటి పలు ప్రతిష్టాత్మక అవార్డులు, సన్మానాలు పెద్దిభొట్లకు లభించాయి. పెద్దిభొట్ల తాను జీవించి ఉండగానే తన శరీరాన్ని మంగళగిరిలోని ఎన్నారై ఆసుపత్రికి దానం చేస్తున్నట్టు అప్పట్లో ప్రకటించారు. ఆ మేరకు ఆయన పార్థివదేహాన్ని ఆసుపత్రి సిబ్బంది స్వాధీనం చేసుకోనున్నారు.