Year Ender 2021 : జగన్ కు కొత్త ఏడాదిలో సవాళ్లివే- పార్టీ, ప్రభుత్వం, ప్రత్యర్ధుల వారీగా
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తయింది. మరో రెండున్నరేళ్లలో సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి. మరో ఏడాది గడిస్తే ఎన్నికల వాతావరణం మొదలు కావడం ఖాయం. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ప్రభుత్వ, అధికార పార్టీ అధినేతగా ఉన్న సీఎం జగన్ కు కొత్త సవాళ్లు విసిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది సవాళ్లను విజయవంతంగా అధిగమించగలిగితే మాత్రం వచ్చే ఎన్నికల నాటికి సీఎం జగన్ మరోసారి విజయవంతమైన నేతగా నిరూపించుకునే అవకాశాలు కూడా ఉంటాయి.

ఈ ఏడాదిలో వైఎస్ జగన్
ఈ ఏడాది ఏపీ సీఎం వైఎస్ జగన్ పైనే అందరి దృష్టీ ఉండబోతోంది. ఓవైపు రాష్ట్రంలో సొంత పార్టీని, ప్రభుత్వాన్ని సక్రమంగా నడుపుకుంటూ మరోవైపు పొరుగు రాష్ట్రాలు, కేంద్రంతో సత్సంబంధాలు నడుపుతూ కొత్త ఏడాదిలో జగన్ విజయవంతం కాగలరా లేదా అన్నది ఈ ఏడాది తేల్చబోతోంది. ఇప్పటికే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రెండున్నరేళ్లు పూర్తయిన నేపథ్యంలో రాబోయే ప్రతీ నెలా జగన్ కు పలు సవాళ్లు విసరబోతోంది. దీంతో జగన్ ఈ సవాళ్లను ఎలా ఎదుర్కొంటారనే దానిపైనే ఆయన సొంత పార్టీ వైసీపీతో పాటు ప్రభుత్వ భవిష్యత్తు ఆధారపడి ఉండబోతోంది.

సొంత పార్టీలో సవాళ్లు
వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకముందు పార్టీలో అన్ని విషయాలు జగన్ నేరుగా పర్యవేక్షించేవారు. నేతలతో నేరుగా మాట్లాడేవారు. ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మాత్రం జగన్ కు అంతగా తీరిక కుదరడం లేదు. దీంతో పార్టీ నేతల్ని సమన్వయం చేసే బాధ్యతల్ని ప్రాంతాల వారీగా నేతలకు అప్పగించేశారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ బాధ్యతల్ని సైతం ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి అనధికారికంగా అప్పగించేశారు. దీంతో ఇప్పుడు పార్టీపై పూర్తిస్ధాయిలో దృష్టిపెట్టేందుకు వీలు కావడం లేదు. ఇదే అదనుగా పలువురు నేతలు తమ స్వప్రయోనాల కోసం వివాదాల్ని తెరపైకి తెస్తున్నారు. వీటిని పరిష్కరించడం కష్టంగా మారుతోంది.

ప్రభుత్వంలో సవాళ్లు
వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన దగ్గరి నుంచి తీసుకునే ప్రతీ నిర్ణయాన్ని విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. ఆ తర్వాత వాటిపై కోర్టుల్లో కేసులు పడుతున్నాయి. కోర్టుల్లో సైతం ఊరట లభించడం లేదు. దీంతో ప్రభుత్వ పాలన గాడితప్పుతోంది. ప్రభుత్వం కీలకంగా భావిస్తున్న పలు పథకాలపై ఇప్పటికీ కోర్టుల్లో కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ టార్గెట్ అయిన మూడు రాజదానుల వ్యవహారంలో హైకోర్టు విచారణతో ఈ బిల్లుల్ని వెనక్కి తీసుకోవాల్సిన పరిస్ధితి ఎదురైంది. దీంతో ప్రభుత్వం తీసుకునే ప్రతీ నిర్ణయం ఇప్పుడు ఆచితూచి తీసుకోవాల్సి వస్తోంది. కాదంటే న్యాయవివాదాల్ని ఎదుర్కోక తప్పడం లేదు. వీటికి తోడు విపక్షాలు వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రభుత్వ ప్రతిష్టను దిగజారుస్తున్నాయి. వీటికి మళ్లీ సీఎం జగన్ సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్ధితి.
Recommended Video

ప్రత్యర్ధుల నుంచి సవాళ్లు
సీఎం జగన్ కు ఓవైపు పార్టీ, మరోవైపు ప్రభుత్వం నుంచి సవాళ్లు ఎదురవుతున్న క్రమంలోనే ప్రత్యర్ధులైన విపక్షాల నుంచి కూడా సవాళ్లు తప్పడం లేదు. ముఖ్యంగా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని కచ్చితంగా వ్యతిరేకించాలనే ఉద్దేశంతో విపక్షాలు చేస్తున్న రచ్చ జగన్ కు ఇబ్బందికరంగా మారిపోతోంది. దీంతో ప్రత్యర్ధుల్ని జగన్ తక్కువ అంచనా వేయలేని పరిస్ధితి దాపురిస్తోంది. కొత్త ఏడాదిలో సైతం పింఛన్ల పెంపు సందర్భంగా జగన్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. ఇప్పటికే ప్రతిపక్షాలు అమరావతి రాజధాని అంశంపై జత కట్టాయి. రాబోయే రోజుల్లో పటిష్టమైన వైసీపీని దెబ్బకొట్టేందుకు ఇంకా చాలా విషయాల్లో జత కట్టే అవకాశాలు లేకపోలేదు. దీంతో వీరిని ఎదుర్కోనేందుకు జగన్ కొత్త వ్యూహాలు సిద్ధం చేసుకోక తప్పని పరిస్ధితి. దీంతో విపక్షాలతో జగన్ పోరు ఈ ఏడాది హైలెట్ అయ్యే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications