ఆల్మట్టి ఎత్తు పెంచేస్తుంటే పట్టదా? చంద్రబాబుపై జగన్ ఫైర్..!
కృష్ణానదిపై ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపుకు కర్నాటక ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఏపీలో చంద్రబాబు సర్కార్ పట్టించుకోవడం లేదని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ ఆరోపించారు. చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను పూర్తిగా గాలికొదిలేశారని విమర్శించారు. రాష్ట్రానికి సంబంధించిన హక్కులను కాపాడే ఉద్దేశం ఏ కోశానా మీలో కనిపించటంలేదన్నారు. ఆల్మట్టి డ్యాం ఎత్తును పెంచడానికి కర్ణాటక ప్రభుత్వం చకాచకా అడుగులేస్తుంటే, వారి కేబినెట్లో వారు ఎత్తు పెంచడానికి ఆమోదం తెలుపుకుంటే, కనీసం మీకు చీమకుట్టినట్టైనా లేదన్నారు.
ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపుతో ఏపీలో అనేక ప్రాంతాలు సాగునీరు, తాగునీరు లేక ఎడారిగా మారిపోయే ప్రమాదం ఉన్నాసరే మీరెందుకు పట్టనట్టు వ్యవహరిస్తున్నారని జగన్ నిలదీశారు. రాష్ట్ర హక్కులను కాపాడాల్సిన స్థానంలో ఉన్న మీరే, రాష్ట్రాన్ని ఈ రకంగా దెబ్బతీస్తుంటే ఎలా? రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేకపోతే మీకెందుకు ఆ పదవి అన్నారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కృష్ణాజలాల విషయంలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు. 1995లో ఆల్మట్టి ఎత్తు 509.016 మీటర్ల నుంచి 524.256 మీటర్లకు నీటిని నిల్వ చేయడానికి అవసరమైన పనులు, స్పిల్వే సహా, గేట్ల నిర్మాణ పనులు జరుగుతుంటే అప్పట్లో మీరు సీఎంగా ఉన్నా, మీ ఎంపీల బలంమీదే అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉన్నా, 1995-2004వరకూ కేంద్రంలో చక్రం తిప్పినట్టుగా మీకుమీరే గొప్పలు చెప్పుకున్న కాలంలో, మీకున్న రాజకీయబలాన్ని రాష్ట్ర ప్రయోజనాలకోసం వాడలేదన్నది నిజమే కదా అని అడిగారు.

సుప్రీంకోర్టు ఆదేశాలతో 519 మీటర్లకు పరిమితం అయినా, చివరకు మీ హయాంలోనే తాను కోరుకున్న స్థాయిలో ఆల్మట్టి స్పిల్వే సహా గేట్లు పెట్టేందుకు అవసరమైన పనులు కర్ణాటక ప్రభుత్వం పూర్తిచేసిందనేది వాస్తవం కాదా? అని జగన్ ప్రశ్నించారు. రెండున్నర దశాబ్దాలుగా, వర్షాభావం నెలకొన్న సంవత్సరాల్లో ఆల్మట్టి ఎత్తు పెంపు ప్రభావం చాలా తీవ్రంగా ఉందన్నారు. రాష్ట్రంలో కృష్ణాజలాలపై ఆధారపడ్డ ప్రాంతాలు ఎంతగా దెబ్బతింటున్నాయో, తాగునీరు లేక ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో చూస్తూనే ఉన్నామన్నారు. ఇవన్నీ మీ వైఫల్యాల పుణ్యమే కదా చంద్రబాబూ అన్నారు.
.@ncbn గారూ… మీరు రాష్ట్ర ప్రయోజనాలను పూర్తిగా గాలికొదిలేశారు. రాష్ట్రానికి సంబంధించిన హక్కులను కాపాడే ఉద్దేశం ఏ కోశానా మీలో కనిపించడంలేదు. ఆల్మట్టి డ్యాం ఎత్తును పెంచడానికి కర్ణాటక ప్రభుత్వం చకాచకా అడుగులేస్తుంటే, వారి కేబినెట్లో వారు ఎత్తు పెంచడానికి ఆమోదం తెలుపుకుంటే, కనీసం…
— YS Jagan Mohan Reddy (@ysjagan) October 1, 2025
ఇప్పుడు మళ్లీ, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే, మళ్లీ ఆల్మట్టి లో 519 మీటర్ల నుంచి 524.256 మీటర్ల కు పెంచి నీటిని నిల్వ చేయడానికి కర్ణాటక ప్రభుత్వం అన్నిరకాలుగా సిద్ధమయ్యిందన్నారు. నీటినిల్వ సామర్థ్యాన్ని 129.72 టీఎంసీల నుంచి ఏకంగా 279.72 టీఎంసీలకు పెంచాలని నిర్ణయం తీసుకోవడమే కాదు, దీనికోసం రానున్న 3 ఏళ్లలో రూ.70వేల కోట్లు ఖర్చు చేయాలని నిశ్చయించిందన్నారు. ఇంత జరుగుతున్నా మీలో కదలిక కనిపించడంలేదన్నారు. ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వంలో మీరు చక్రం తిప్పుతున్నారని మీరు, మీ ఎల్లోమీడియా రోజూ ప్రచారం చేసుకుంటున్నారని, పైగా మీ ఎంపీల బలంమీదే కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉందన్న మాటకూడా వాస్తవమే అన్నారు. మరి అలాంటప్పుడు మీకున్న రాజకీయ బలాన్ని ఉపయోగించి, ఒత్తిడి తెచ్చి తద్వారా పనుల నిలుపుదలకు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆదేశాలు ఎందుకు ఇప్పించలేకపోతున్నారని ప్రశ్నించారు.

కర్ణాటక మంత్రివర్గం సెప్టెంబరు 16న నిర్ణయం తీసుకుంటే ఇప్పటివరకూ మీరెందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు. అసలు రాష్ట్రం అంటే మీకు పట్టింపు ఉందా? లేదా? చంద్రబాబు మీరు ఇప్పటికైనా మేలుకోండన్నారు. కేంద్రంలో ఎంపీల సంఖ్యాపరంగా మీకున్న బలాన్ని ఉపయోగించుకుని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. ఆల్మట్టి ఎత్తు పెంపును అడ్డుకోవడంతోపాటు, KWDT-2 విచారణపై దృష్టిపెట్టి, సమర్థవంతమైన వాదనలు వినిపించాలన్నారు. లేదంటే భావితరాల మనసుల్లో చరిత్ర హీనుడిగా మిగిలిపోతారన్నారు.












Click it and Unblock the Notifications