నాకు ఆ తోడు లేదు.. అయినా దేవుడున్నాడు-జగన్ కామెంట్స్-పెడనలో నేతన్న నేస్తం రిలీజ్
ఏపీలో నాలుగో విడత వైఎస్సార్ నేతన్న నేస్తం నిధుల్ని సీఎం జగన్ ఇవాళ కృష్ణాజిల్లా పెడనలో విడుదల చేశారు. వరుసగా నాలుగో ఏడాది ఈ నిధుల్ని ప్రభుత్వం లబ్దిదారులకు నేరుగా వారి ఖాతాల్లోకి పంపింది. ఈ సందర్భంగా లబ్దిదారులు తమకు ఏ విధంగా నేతన్న నేస్తం నిధులు అందుతున్నాయో సీఎం జగన్ సమక్షంలో వివరించారు. జగన్ కు వారు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం సీఎం జగన్ కీలక ప్రసంగం చేసారు.
నేతన్న నేస్తం విడుదల చేసిన జగన్
రాష్ట్రంలో చేనేత వర్గాలకు ఏటా వైసీపీ సర్కార్ ఇస్తున్న వైఎస్సార్ చేనేత నేస్తం నిధుల్ని సీఎం జగన్ ఇవాళ కృష్ణాజిల్లా పెడనలో విడుదల చేశారు. అనంతరం లబ్దిదారుల్ని ఉద్దేశించి జగన్ ప్రసంగించారు. స్వాతంత్ర పోరాటంలో కీలకంగా ఉన్న మగ్గాన్ని నమ్ముకుని ఈ పోటీ ప్రపంచంలో బతకడానికి ఇబ్బందులు పడుతున్న పరిస్ధితి చూస్తున్నామని సీఎం జగన్ అన్నారు. కానీ అలాంటి చేనేత సోదరుల్ని ఆదుకోవాలనే ఆలోచన గతంలో ఎవరూ చేయలేదన్నారు. తాను మాత్రం చేనేతల్ని ఆదుకునేందుకు నేతన్న నేస్తం అందిస్తున్నట్లు జగన్ తెలిపారు. తన పాదయాత్రలో చేనేతల కష్టాలు విని వారి కోసం ఈ పథకాన్ని రూపొందించినట్లు జగన్ వెల్లడించారు.
గతానికీ, ఇప్పటికీ తేడా ఇదే
గతంలో ఉన్న ప్రభుత్వాలు చేనేతల్ని పట్టించుకోలేదని, ఇప్పుడు ప్రభుత్వం వారిని ఎలా ఆదుకుంటుందో చూడాలని చేనేత కుటుంబాలని జగన్ కోరారు. ప్రభుత్వం నేతన్న నేస్తం ద్వారా ఇస్తున్న ఆర్ధిక సాయంతో జాకార్డ్ లిఫ్టింగ్ మిషిన్స్ వంటి ఆధునిక పరికరాలతో తమ మగ్గాల్ని అప్ గ్రేడ్ చేసుకుని కొత్త వస్త్రాల్ని తయారు చేసే అవకాశం చేనేతలకు ఈ పథకం ద్వారా దక్కిందన్నారు. 2018తో పోలిస్తే మగ్గాల అప్ గ్రేడ్ తర్వాత చేనేతల ఆదాయం మూడు రెట్లు పెరిగిందని ప్రతీ అధ్యయనం చెప్తుందని జగన్ గుర్తుచేశారు. ఆప్కో వస్త్రాల్ని వైసీపీ ప్రభుత్వంలో ఆన్ లైన్ ద్వారా విక్రయిస్తున్నట్లు జగన్ గుర్తుచేశారు.
పదవులన్నీ వారికే
ఇవాళ కేబినెట్లోనూ తొలివిడతలో 56 శాతం బీసీ, ఎస్సీ,ఎస్టీ, మైనార్టీలకు పదవులు ఇస్తే రెండో విడతకు వచ్చే సరికి 70 శాతం పదవులు వారికి ఇచ్చామని జగన్ తెలిపారు. రెండు కేబినెట్లలోనూ ఐదుగురికి డిప్యూటీ సీఎం పదవులు ఇస్తే ఇవి కూడా బీసీ, ఎస్సీ,ఎస్టీ, మైనార్టీలకు ఇచ్చామన్నారు. అసెంబ్లీ స్పీకర్ గా బీసీ, మండలి ఛైర్మన్ గా ఎస్సీ, మండలి డిప్యూటీ ఛైర్మన్ గా మైనార్టీ అక్క కనిపిస్తోందని జగన్ తెలిపారు. సామాజిక న్యాయ చరిత్రలో వైసీపీ ప్రభుత్వంలో కొత్త అధ్యాయం మొదలైందన్నారు. రాజ్యసభకు 8 మందిని పంపిస్తే నలుగురు బీసీలేనన్నారు. మండలికి ఎమ్మెల్సీలుగా ఇప్పటివరకూ 32 మందిని పంపితే అందులో 18 మంది బీసీ, ఎస్సీ,ఎస్టీ, మైనార్టీలేనన్నారు. 98 మందికి మున్సిపల్ పదవులిస్తే బీసీ, ఎస్సీ,ఎస్టీ, మైనార్టీలకు ఇచ్చింది ఏకంగా 70 పదవులు అన్నారు.
విపక్షాలు, మీడియాపై జగన్ వ్యాఖ్యలు
తనకు విపక్షాల మాదిరిగా ఎన్నెన్నో పత్రికలు, టీవీలు లేవని, తనకు ఈనాడు సపోర్ట్ ఉండకపోవచ్చని, ఆంధ్రజ్యోతి తోడు ఉండకపోవచ్చని, టీవీ 5 అండ ఉండకపోవచ్చని, దత్తపుత్రుడి సాయం ఉండకపోవచ్చని, కానీ తనకు దేవుడి దయ,మీ చల్లని దీవెనలు ఉన్నాయని జగన్ తెలిపారు. దేవుడు ఇంకా మంచి చేసే అవకాశం మీ బిడ్డకు ఇవ్వాలని కోరుకోవాలన్నారు. పెడన అభివృద్ధి కోసం మంత్రి జోగి రమేష్ వినతి పత్రం ఇచ్చారని, ఇందులో రోడ్లు, వంతెనలతో పాటు పలు ప్రతిపాదనలు ఉన్నాయని, రూ.102 కోట్లు అడిగారని, ఈ మొత్తం నిధులు ఇచ్చేందుకు సిద్దమని సీఎం జగన్ హామీ ఇచ్చారు. కాసేపటి కిందే మచిలీపట్నం పోర్టుకు కోర్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలిసిందన్నారు.