ఆనంకు జగన్ మరిన్ని షాకులు ? సెక్యూరిటీ నుంచి సహాయనిరాకరణ దాకా ! కాలు బయటపెట్టకుండా !
వైసీపీతో విభేదిస్తున్న నెల్లూరు జిల్లా పెద్దాయన, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డికి వరుస షాకులు తప్పడం లేదు. ఒకప్పుడు ఉమ్మడి ఏపీకి సీఎం పదవి వచ్చినట్లే వచ్చి మిస్సయిన రామనారాయణరెడ్డికి ఇప్పుడు ఎమ్మెల్యేగా కూడా గౌరవం దక్కడం లేదు. వైసీపీపై విమర్శలు మొదలుపెట్టగానే అప్రమత్తమైన జగన్.. ఆయనకు షాకులు ఇస్తూ వచ్చారు. ఇప్పుడు వాటి తీవ్రత మరింతగా పెరిగినట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
ఆనంకు జగన్ మార్క్ షాకులు
వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డికి సీఎం జగన్ మార్క్ షాకులు తగులుగుతున్నాయి. ఇప్పటికే ఇలాంటి షాకులతో ఏకంగా రాష్ట్రం వదిలి వెళ్లిపోయిన రెబెల్ ఎంపీ రఘురామ తరహాలో ఇప్పుడు ఆనంకు కూడా జగన్ షాకులు ఇస్తున్నారు. ఎక్కడా బహిరంగంగా వీటిపై మాట్లాడకపోయినా జగన్ తన పని తాను చేసేస్తున్నారు. ఇప్పటికే వెంకటగిరి పరిణామాల్ని దగ్గరనుండి గమనిస్తున్న వారికి అవేంటో తెలుస్తూనే ఉన్నాయి. రాబోయే రోజుల్లో వీటి తీవ్రత మరింత పెరగబోతున్నట్లు తెలుస్తోంది.
సెక్యూరిటీ తగ్గింపుతో
తాజాగా ఆనం రామనారాయణ రెడ్డికి ఉన్న 2 ప్లస్ 2 సెక్యూరిటీని జగన్ సర్కార్ 1 ప్లస్ 1కు తగ్గించింది. అంతే కాదు ఈ విషయాన్ని నేరుగా ఆనంకు చెప్పలేదు. కేవలం సెక్యూరిటీ సిబ్బందికి మాత్రమే మెసేజ్ లు పెట్టారు. దీంతో వీరు రిలీవ్ అయ్యేందుకు లెటర్ ఇచ్చేందుకు సైతం ఆనం నిరాకరించినట్లు తెలుస్తోంది. స్ధానిక డీఎస్పీ జోక్యం చేసుకుని మాట్లాడినా లెటర్ ఇచ్చేందుకు ఆనం ఒప్పుకోలేదు. దీంతో ఉన్నతాధికారులతో ఈ విషయంపై మాట్లాడినట్లు తెలుస్తోంది. మరోవైపు ఎర్రచందనం స్మగ్లర్లు, మావోయిస్టుల ప్రభావిత ప్రాంతంలో ఉన్న వెంకటగిరికి ఎమ్మెల్యేగా ఉన్న ఆనంకు భద్రత తగ్గింపుతో ఆయన భద్రత ప్రమాదంలో పడిందని అనుచరులు వాపోతున్నారు.
తోటి ఎమ్మెల్యేలతో మాటల దాడి
ఆనం రామనారాయణరెడ్డిపై వైసీపీ అధిష్టానం కన్నెర్ర చేయగానే నెల్లూరు, తిరుపతి జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలంతా ఆయన్ను టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. అవసరం ఉన్నా లేకపోయినా ఆనంపై విమర్శలు ఎక్కుపెడుతూ అధిష్టానం దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారు. నెల్లూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిల్ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు తాజాగా ఆనం వ్యవహారాన్ని లేవనెత్తుతూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తద్వారా ఆనంపై అధిష్టానం మరింత ఒత్తిడి పెంచుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విమర్శలపై ఆనం మాత్రం స్పందించడం లేదు.
వెంకటగిరిలో సహాయనిరాకరణ ?
ఆనం స్ధానంలో వెంకటగిరి వైసీపీ ఇన్ ఛార్జ్ గా నియమించిన నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి వెంటనే రంగంలోకి దిగారు. స్ధానికంగా ఉన్న అధికారుల్ని, పోలీసుల్ని తనకు అనుకూలంగా ఉన్నవారిని నియమించుకోవడం, బదిలీలు చేయించుకోవడం మొదలుపెట్టారు. ఇదే క్రమంలో తాజాగా మున్సిపల్ కమిషనర్ కూడా నేదురుమల్లికి విధేయంగా వ్యాఖ్యలు కూడా చేశారు. స్ధానిక వైసీపీ నేతలు కూడా ఆనంకు గుడ్ బై చెప్పి నేదురుమల్లి వైపు మొగ్గుతున్నారు. అధికారుల నుంచి కనీస సహకారం కూడా లేదు. భద్రత ఎలాగో తగ్గిపోయింది. దీంతో ఇప్పుడు ఆనంకు పొమ్మనకుండానే పొగబెట్టేలా వైసీపీ అధిష్టానం,సీఎం జగన్ వ్యవహరిస్తున్నట్లు తెలిపోయింది. ఇక నిర్ణయించుకోవాల్సింది ఆనం రామనారాయణ రెడ్డే.