జగన్ కుట్రలు సాగవు, అమరావతిని అడ్డుకుంటున్నారు: దేవినేని ఉమ
విజయవాడ/ హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణాన్ని ప్రతిపక్షనేత వైయస్ జగన్ అడ్డుకుంటున్నారని మంత్రి దేవినేని ఉమమహేశ్వర రావు ఆరోపించారు. అందుకే జగన్ కోర్టుల్లో కేసులు వేస్తున్నారంటూ దేవినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారంనాడు నెల్లూరు జిల్లాలో పర్యటించిన ఆయన జిల్లాలోని సోమశిల, కండలేరు ప్రాజెక్టుల పనులు పరిశీలించారు.
ఈ రెండు ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. జిల్లాలో ఏటా 50 వేల నుంచి లక్ష ఎకరాలకు సాగునీరు అందించేలా తమ ప్రభుత్వం కృషి చేస్తుందని దేవినేని తెలిపారు. 2018లోగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతామని మంత్రి దేవినేని ఉమ చెప్పారు. జగన్ కుట్రలు సాగవని, రాష్ట్రంలో అభివృద్ధి ఆగదని ఆయన అన్నారు.
పోలవరం కుడి కాలువ పట్టిసీమ చంద్రబాబు సంకల్పానికి మరో నిదర్శనమని ఆయన అన్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టి రెచ్చగొట్టాలని జగన్ ప్రయత్నించారని ఆయన అన్నారు. జగన్ కళ్ల ముందే పోలవరం, అమరావతి నిర్మాణాలు జరుగుతాయని ఆయన అన్నారు.
గ్రీన్ బెల్ట్ లేదు
రాజధాని మాస్టర్ప్లాన్లో గ్రీన్బెల్టు లేదు, అగ్రికల్చర్ జోన్ మాత్రమే ఉందని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. అగ్రికల్చర్ జోన్లో నిర్మాణాలకు ఎటువంటి ఇబ్బంది లేదని నారాయణ చెప్పారు. రెండు వేర్వేరు అని ఆయన చెప్పారు. రైతులకు అవగాహన కల్పిస్తామని చెప్పారు. రైతులను గందరగోళానికి గురి చేసి రెచ్చగొట్టడం ప్రతిపక్షాలకు తగదని ఆయన చెప్పారు.
అగ్రికల్చర్ జోన్పై రైతుల అభ్యంతరాలకు 3 నెలల గడువు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. అభ్యంతరాలుంటే ప్రభుత్వానికి తెలియజేయాలని ఆయన చెప్పారు. తాత్కాలిక సచివాలయం శంకుస్థాపన తేదీని త్వరలో ప్రకటిస్తామని మంత్రి నారాయణ మీడియాకు చెప్పారు.