జగన్ రేపటి విశాఖ టూర్ వాయిదా-భారీ వర్షాలే కారణం- మళ్లీ ఎప్పుడంటే ?
నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాదాపు అన్ని జిల్లాల్లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అతలాకుతలం అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చేపట్టే అధికారిక కార్యక్రమాలు, ప్రభుత్వాధినేతల పర్యటనలపైనా ప్రభావం పడుతోంది. ఇదే క్రమంలో రేపు వైజాగ్ లో జరగాల్సిన సీఎం జగన్ టూర్ కూడా వాయిదా పడింది.
భారీ వర్షాల కారణంగా సీఎం జగన్ విశాఖ పర్యటన వాయిదా వేసుకున్నారు. ఈ నెల 13న వైఎస్సార్ వాహనమిత్ర పథకం మూడో విడత నిధుల విడుదల కోసం విశాఖకు జగన్ వెళ్లాల్సి ఉంది. ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం అందిస్తున్న వాహన మిత్ర నిధులను విడుదల చేసే నిమిత్తం ఈ నెల 13న విశాఖ పర్యటనను జగన్ ఖరారు చేసుకున్నారు. ఇందుకోసం ఇప్పటికే ప్రభుత్వం షెడ్యూల్ను కూడా ఖరారు చేసింది. భారీ వర్షాలతో ఈ టూర్ కాస్తా 15కు వాయిదా పడింది. భారీ వర్షాల కారణంగా విశాఖలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టనున్న పర్యటన వాయిదా పడినట్లు అధికారులు ప్రకటించారు.

వాస్తవానికి విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీలో ఏర్పాటు చేయనున్న కార్యక్రమంలో వాహన మిత్ర నిధులను జగన్ లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. అయితే రెండు రోజులుగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండటం,వాటి ప్రభావం ఏపీలోనూ ఎక్కువగా ఉండటంతో పలు కార్యక్రమాలు రద్దవుతున్నాయి. మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేసింది.
ఈ నేపథ్యంలో జగన్ పర్యటనను ఈ నెల 15కు వాయిదా వేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ టూర్ షెడ్యూల్ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.












Click it and Unblock the Notifications