పవన్ కళ్యాణ్ సర్జరీపై స్పందించిన జగన్- ఎమోషనల్ మెసేజ్..!
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తాజాగా తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయనకు డాక్టర్లు సర్జరీ నిర్వహించారు. పవన్ కళ్యాణ్ అనారోగ్యంపై జనసేన పూర్తిగా క్లారిటీ ఇవ్వనప్పటికీ ఆయన కోలుకోవడానికి మాత్రం కనీసం పది రోజుల సమయం పడుతుందని తెలిపింది. దీంతో పవన్ ఆరోగ్యంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) స్పందించి ఓ ట్వీట్ చేశారు.
పవన్ కళ్యాణ్ గారూ.. మీరు శస్త్రచికిత్స తర్వాత వేగంగా, పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా అంటూ వైఎస్ జగన్ ఇవాళ ట్వీట్ చేశారు. గెట్ వెల్ సూన్ అంటూ తెలిపారు. తద్వారా రాజకీయంగా తమ మధ్య ఎన్ని విభేదాలు ఉన్నా వ్యక్తిగత విషయాల్లో స్పందించేందుకు మాత్రం అవేవీ అడ్డంకులు కావని జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లయింది. గతంలో జగన్ పుట్టిన రోజులకు చంద్రబాబు, పవన్, అలాగే వారి పుట్టినరోజులకు ఆయన శుభాకాంక్షలు కూడా చెప్పుకుంటూనే ఉన్నారు.

Wishing @PawanKalyan Garu a speedy and complete recovery following his surgery. Get well soon!
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 19, 2026
మరోవైపు పవన్ కు నిన్న సాయంత్రం సర్జరీ జరిగినట్లు జనసేన ఓ ప్రకటనలో తెలిపింది. శుక్రవారం ఉదయం అధికారులతో పాలనాపరమైన విషయాలపై చర్చిస్తున్న సందర్భంలో పవన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, కొద్ది నెలలుగా ఆరోగ్యపరంగా ఇబ్బందిపడుతున్నారని తెలిపింది. దీంతో ఆయన వ్యక్తిగత వైద్యుల సలహాతో శుక్రవారం అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకుని ఆసుపత్రికి వెళ్లారని, అక్కడ వైద్య పరీక్షలతోపాటు ఎం.ఆర్.ఐ నిర్వహించారని వెల్లడించింది. వాటిని పరిశీలించిన వైద్యులు శస్త్ర చికిత్స చేయవలసి ఉంటుందని నిర్ణయించి, శస్త్రచికిత్స చేశారని తెలిపింది. వారం నుంచి పది రోజులపాటు విశ్రాంతి తర్వాత ఆయన అధికారిక కార్యక్రమాలలో పాల్గొనవచ్చని డాక్టర్లు చెప్పినట్లు జనసేన వర్గాలు తెలిపాయి. అయితే దీర్ఘకాలం తగిన జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుందని, పూర్తి స్వస్థత చేకూరడానికి ఎక్కువ కాలం పడుతుందని కూడా డాక్టర్లు చెప్పినట్లు వెల్లడించింది.














Click it and Unblock the Notifications