మోడీ, పవన్ కళ్యాణ్లను టార్గెట్ చేసిన జగన్
విజయవాడ: సీమాంధ్ర ఎన్నికల ప్రచారంలో తనపై బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, నేత ఎం. వెంకయ్య నాయుడు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిస్పందించారు. తనపై పవన్ కళ్యాణ్ చేసిన విమర్శకు కూడా ఆయన స్పందించారు. జగన్ పదవీ కాంక్ష వల్లనే రాష్ట్ర విభజన జరిగిందని పవన్ కళ్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం బహిరంగ సభలో అన్న విషయం తెలిసిందే.
సీమాంధ్రలోని చమురుతో దేశాన్ని బాగు చేస్తానని మోడీ అంటున్నారని, మోడీ దొంగ మాటలు చెబుతున్నారని జగన్ అన్నారు. నా వల్లనే విభజన జరిగిందని నలుగురు నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. 1999 నుంచి 2004 వరకు రాష్ట్రానికి బిజెపి, తెలుగుదేశం చేసిందేమిటని ఆయన అడిగారు. కృష్ణా జిల్లా కైకలూరు ఎన్నికల ప్రచార సభలో ఆయన గురువారం సాయంత్రం ప్రసంగించారు.

ఎన్డీఎ ఏర్పాటు చేసిన మూడు రాష్ట్రాల్లో పరిస్థితి దారుణంగా ఉందని, ఒక్క అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం కూడా లేదని జగన్ అన్నారు. చత్తీస్గడ్ రాజధాని రాయపూర్కు పదివేల కోట్ల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి మూడేళ్లలో రూ. 400 కోట్లు ముష్టి వేసి చేతులు దులుపుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. 25 లోకసభ స్థానాలను కూడా మనమే గెలుచుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని ఆయన అన్నారు.
చంద్రబాబులా తాను అబద్ధాలు ఆడలేనని, ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వలేనని ఆయన అన్నారు. చంద్రబాబుకు 65 ఏళ్ల వయస్సు వచ్చిందని, ఇక తాను ఉండననీ తన పార్టీ ఉండదనీ చంద్రబాబుకు తెలుసునని ఆయన అన్నారు. నాలుగేళ్లుగా కాంగ్రెసుతో చంద్రబాబు కుమ్మక్కయి తన మీద తప్పుడు కేసులు పెట్టించారని ఆయన అన్నారు. చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు రెండెకరాల యజమాని అని, ఇప్పుడు వేల కోట్లు ఎలా వచ్చాయని ఆయన అన్నారు. ఏ రాజకీయ పార్టీ నేత వెళ్లని మారుమూల ప్రాంతానికి కూడా తాను వెళ్లానని ఆయన చెప్పుకున్నారు. వైయస్ నుంచి తనకు విశ్వసనీయత వారసత్వంగా వచ్చిందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications