విజయవాడలోనే జెండా ఎగరేయనున్న జగన్-పంద్రాగస్టు ప్రసంగంపై ఆసక్తి..!
ఏపీలో స్వాతంత్ర దిన వేడుకలకు రంగం సిద్ధమవుతోంది. దేశవ్యాప్తంగా ఏటా జరిగే ఈ వేడుకల్ని ఏపీలోనూ ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఏపీ ప్రభుత్వం తరఫున విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో అధికారికంగా పంద్రాగస్టు వేడుకలు జరుగుతాయి. ఇందులో సీఎం వైఎస్ జగన్ జాతీయ పతాకావిష్కరణ చేస్తారు. అలాగే జగన్ చేయబోయే ప్రసంగానికి ఈసారి చాలా ప్రత్యేకతలు ఉండబోతున్నాయి.
రేపు ఉదయం 9 గంటలకు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సీఎం వైఎస్ జగన్ స్వాతంత్ర వేడుకల జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. రాష్ట్రస్ధాయి స్వాతంత్య్ర వేడుకలకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్రప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జాతీయ పతాకావిష్కరణ అనంతరం సాయుధ దళాల నుండి గౌరవ వందనం స్వీకరిస్తారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సీఎం ప్రసంగిస్తారు.

రాష్ట్రస్దాయిలో జరిగే స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాల్లో ప్రదర్శన కోసం వివిధ శాఖలకు చెందిన శకటాలను ఇందిరాగాంధీ స్టేడియంలో సిద్దం చేశారు. ఉదయం 9 గంటలకు వేడుకలు ప్రారంభం కానున్న దృష్ట్యా ఆహ్వనితులు, పాస్లు ఉన్నవారు ఉదయం 8 గంటలకల్లా సభా ప్రాంగణంలో కేటాయించిన సీట్లలో కూర్చోవాలని అధికారులు కోరారు. ఈ కార్యక్రమం అనంతరం సాయంత్రం ఐదున్నర గంటలకు రాజ్భవన్లో గవర్నర్ ఇచ్చే తేనీటి విందు (ఎట్ హోమ్) కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరుకానున్నారు.
మరోవైపు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సీఎం జగన్ చేసే ప్రసంగానికి పలు ప్రత్యేకతలు ఉన్నాయి. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జగన్ చేస్తున్న ఐదో పంద్రాగస్టు ప్రసంగం ఇది. అలాగే జగన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన ఇందిరాగాంధీ స్టేడియంలోనే ఈ వేడుకలు జరుగుతున్నాయి.
మరోవైపు ఈ ప్రసంగం వైసీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్ చేసే చివరి పంద్రాగస్టు ప్రసంగం కానుంది. వచ్చే ఏడాది ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటైతే ఆ ముఖ్యమంత్రి తిరిగి పంద్రాగస్టు ప్రసంగం చేస్తారు. అలాగే ఈ ప్రసంగంలో సీఎం జగన్ మూడు రాజధానులపై మాట్లాడతారా లేదా అన్నది కీలకంగా మారింది.












Click it and Unblock the Notifications