వైసీపీపై కోపం వైఎస్ పై చూపిస్తారా ? కూటమిపై షర్మిల ఫైర్..!
ఏపీలో కూటమి సర్కార్ పై పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల ఇవాళ నిప్పులు చెరిగారు. వైఎస్సార్సీపీపై కోపాన్ని తన తండ్రి వైఎస్ పై చూపిస్తారా అంటూ కూటమి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైఎస్ విగ్రహాన్ని కూల్చివేసిన ఘటనపై షర్మిల తీవ్రంగా స్పందించారు. వైఎస్ కూ, వైసీపీకి ఎలాంటి సంబంధం లేదని షర్మిల తేల్చేశారు. ఈ సందర్భంగా వైఎస్ గొప్పతనాన్ని షర్మిల చెప్పుకొచ్చారు.
కూటమి ప్రభుత్వానికి వైసీపీపై కోపాన్ని వైఎస్సార్ విగ్రహాల మీద చూపిస్తారా అని షర్మిల ప్రశ్నించారు. అసలు వైసీపీకీ వైఎస్సార్ కీ ఏం సంబంధమని అడిగారు. మహానేత పేరు పెట్టినంత మాత్రాన వైఎస్సార్ ఏమైనా వారి సొత్తా, లేక పేటెంట్ రైటా అని నిలదీశారు. వైఎస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అన్నారు. చివరి క్షణం దాకా తన జీవితాన్ని ప్రజల కోసమే త్యాగం చేసిన ప్రజా నాయకుడన్నారు. తెలుగు ప్రజల గుండెల్లో ఆయనది చెరగని ముద్ర అన్నారు.

సంక్షేమ పథకాల అమలులో ఈ దేశానికి దిశా నిర్దేశం వైఎస్సార్ అని, ప్రజాక్షేమమే పరమావధిగా చివరి దాకా పరితపించిన గొప్ప వ్యక్తి అని షర్మిల తెలిపారు. ఇంతటి ప్రజాభిమానం కలిగిన నాయకుడికి నీచ రాజకీయాలు చేసే వారితో కలిపి ఆపాదిస్తారా అని ప్రశ్నించారు. ఆయన విగ్రహాల మీద కక్ష రాజకీయాలు చేస్తారా అని అడిగారు. ఇదెక్కడి దిక్కుమాలిన చర్య అన్నారు. నందిగామ గాంధీ సెంటర్ లో వైఎస్ విగ్రహాన్ని తొలగించడం దుర్మార్గమన్నారు. ఈ చర్యను కాంగ్రెస్ ఖండిస్తోందన్నారు.

ఇది కూటమి ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనమని షర్మిల ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో మహానేత మరణం తర్వాత గాంధీ సెంటర్ వద్ద నాటి ప్రభుత్వం అక్కడ వైఎస్సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిందని, విగ్రహం చుట్టూ వైసీపీ అక్రమంగా వేసుకున్న సెట్టింగులు తొలగించుకోవాలని, దానికి తమకేం అభ్యంతరం లేదని క్లారిటీ ఇచ్చారు. కానీ ఇదే సాకుగా చూపి వైఎస్ విగ్రహాల మీద చేయి వేస్తే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. కాబట్టి తొలగించిన చోట వెంటనే రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఉద్యమం తప్పదని తీవ్రంగా హెచ్చరించారు.












Click it and Unblock the Notifications