ఆయన వల్లే వైయస్ వివేకా ఓటమి: రాయపాటి, 'పారిపోయిన జగన్'
అసెంబ్లీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి సరిగా లేదని, ఆయన అహంకారం వల్లే కడప ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైయస్ వివేకానంద రెడ్డి ఓడిపోయారని ఎంపీ.
గుంటూరు: అసెంబ్లీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి సరిగా లేదని, ఆయన అహంకారం వల్లే కడప ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైయస్ వివేకానంద రెడ్డి ఓడిపోయారని ఎంపీ రాయపాటి సాంబశివ రావు అన్నారు.
చంద్రబాబుపై నిప్పులు చెరిగిన రోజా
ఆయన గుంటూరులో విలేకరులతో మాట్లాడారు. పట్టిసీమను అడ్డుకునేందుకు జగన్ విశ్వప్రయత్నాలు చేశారన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా పట్టిసీమ ఆగలేదని చెప్పారు. అభివృద్ధిని అడ్డుకోవడమే జగన్ లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా పోలవరం ఆగదని చెప్పారు.
జగన్ తన వైఖరి మార్చుకోకపోతే జీవితాంతం ప్రతిపక్ష నేతగానే మిగిలిపోవడం ఖాయమని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం చేసే ప్రతి పనినీ విమర్శించడమే ప్రతిపక్షం విధానం కారాదన్నారు. కాంగ్రెస్ హయాంలో వాజ్ పేయీ వంటి నేతలు ప్రభుత్వానికి నిర్మాణాత్మక సూచనలు చేసేవారన్నారు.
శాసనసభలో జగన్ వ్యవహరిస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని, ప్రతికూల దృక్పథాన్ని వీడి హుందాగా వ్యవహరించాలన్నారు. రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాన్ని సర్వత్రా హర్షిస్తుంటే జగన్ విమర్శించడం వల్ల అతనికే నష్టమన్నారు.
గతంలో తామంతా ఇందిర, రాజీవ్ బ్రాండ్తో గెలిచేవాళ్లమని, భవిష్యత్తులో చంద్రబాబు ఇమేజ్తోనే గెలుస్తామని రాయపాటి చెప్పారు. మంచీ చెడునూ విశ్లేషించే పరిపక్వత జగన్కు లేదన్నారు.
జగన్ పారిపోయారు: పత్తిపాటి
తనపై చేసిన ఆరోపణలను రుజువు చేయలేక సభ నుంచి జగన్, వైసిపి పారిపోయిందని మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. వైసిపి కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అసెంబ్లీలో తాను విసిరిన సవాల్కు జగన్ జవాబివ్వాలన్నారు.
జగన్ సభలో అసత్యాలు మాట్లాడుతున్నారని, ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టు చూపించడం జగన్కు, అతని ప్రత్రిక, ఛానల్కు ఆనవాయితీగా మారిందన్నారు. ఒక ఎజెండాగా మారిందని అన్నారు.
అగ్రిగోల్డ్ భూములు కొనలేదని, తమకున్నఆస్తులకు, అగ్రిగోల్డ్ భూములకు సంబంధంలేదన్నారు. ఆధారాలు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని, లేకపోతే రాజీనామా చేసి, రాజకీయాల నుంచి తప్పుకోవాలని జగన్కు సవాల్ విసిరానని, ఏ సమాధానం చెప్పకుండా జగన్ పారిపోయారన్నారు.