వైసీపీ అసంతృప్తుల టార్గెట్ సజ్జల -ఆల్ రౌండర్ ఆరోపణలు-వారధి నుంచి విరోధి వరకూ..
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన కొత్తలో సీఎం జగన్ తర్వాత ప్రభుత్వంలో నంబర్ టూ ఎవరనే చర్చ ఎక్కువగా సాగేది. దీనికి సమాధానం రావడానికి ఎంతో కాలం పట్టలేదు. అంతవరకూ జగన్ తర్వాత నంబర్ టూగా వైసీపీ కీలక ఎంపీ విజయసాయిరెడ్డి ఉంటారని భావించిన వారికి ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన సజ్జల రామకృష్ణారెడ్డి దూకుడు చూసే సరికి నంబర్ టూ ఎవరనే దానిపై అనుమానపు మేఘాలన్నీ తొలగిపోయాయి. దీంతో ఇప్పుడు సీఎం జగన్ ను కలవాలనుకునే ఎవరైనా సజ్జలతోనే మాట్లాడాలనేంతగా పరిస్ధితి మారిపోయింది.

వైసీపీలో సజ్జల పాత్ర
వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న మాజీ జర్నలిస్టు సజ్జల రామకృష్ణారెడ్డి మొదట్లో ప్రభుత్వ సలహాదారు పాత్రతో పాటు పార్టీ వ్యవహారాలకే పరిమితమైనట్లు కనిపించారు. కానీ పార్టీలో కీలక ఎంపీ విజయసాయిరెడ్డితో విభేధాల నేపధ్యంలో వైసీపీలో తానేమిటో నిరూపించుకోవాల్సిన పరిస్ధితి సజ్జలకు ఎదురైనట్లు చెబుతారు. దీంతో సజ్జల దూకుడు పెంచారు. పార్టీకి అండగా ఉన్న పెద్దలతో పాటు మీడియాతోనూ సన్నిహత సంబంధాలు పెంచుకుంటూ పోయారు. ఆ తర్వాత ప్రభుత్వ వ్యవహారాలపై పట్టు పెంచుకుంటూ వచ్చారు. పార్టీలో ఎలాగో పట్టు ఉండనే ఉంది. దీంతో ఇప్పుటు సజ్జల అటు వైసీపీతో పాటు వైసీపీ ప్రభుత్వంలోనూ కీలక నేతగా చెలామణి అవుతున్నారు.

జగన్ తర్వాత నంబర్ టూ
వాస్తవానికి వైసీపీలో నంబర్ వన్, నంబర్ టూ అనే నంబర్లు ఎప్పుడూ కనిపించవు. కానీ ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి ప్రస్తుతం పోషిస్తున్న పాత్ర చూస్తుంటే ఆయనే నంబర్ టూ అనే చర్చ జోరుగా సాగుతోంది. ఎందుకంటే మంత్రులు ప్రెస్ మీట్లు పెట్టాలన్నా, పార్టీలో, ప్రభుత్వంలో పదవులు లభించాలన్నా సజ్జల ఆశీర్వాదం ఉండాల్సిందే. పార్టీలో మీడియాతోనూ సత్సంబంధాలు కొనసాగించడంలో సజ్జల తర్వాతే ఎవరైనా. దీంతో ఇప్పుడు ప్రభుత్వంలో జగన్ ను కలిసేందుకు వెళ్లాలన్నా సజ్జలను కలిశాకే అన్నట్లుగా పరిస్ధితి మారిపోయింది. తాజాగా ఉద్యోగసంఘాలు ప్రభుత్వ పెద్ద అయిన సీఎం జగన్ తో జరపాల్సిన చర్చల్ని సైతం సజ్జలే నిర్వహించారు. దీంతో సర్కార్ లో సజ్జల నంబర్ టూ అనే చర్చ అంతకంతకూ పెరుగుతోంది.

ఆల్ రౌండర్ గా సజ్జల
ప్రభుత్వం తరఫున రాజకీయ ప్రత్యర్ధుల్ని విమర్శించాలన్నా, ప్రభుత్వ విధానాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నా, ఆ విధానాలతో ప్రభుత్వానికి చిక్కులు ఎదురైనప్పుడు కౌంటర్లు ఇవ్వాలన్నా ఇప్పుడు సజ్జల పేరే వైసీపీలో వినిపిస్తోంది. విపక్షాలు చేసే విమర్శలకు సైతం ఇప్పుడు సజ్జల స్పందించకుండా మిగతా నేతలు, మంత్రులు, ఎంపీలు స్పందించే పరిస్దితి లేదు. దీంతో సజ్జల అటు మంత్రుల పాత్రను, ఇటు అధికారుల పాత్రలో ఆల్ రౌండర్ అయిపోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇది సహజంగానే పార్టీలో ఆయన ప్రత్యర్ధులతో పాటు వైసీపీ అసంతృప్త నేతలకు చికాకుగా మారిపోతోంది. దీంతో అదను చూసి వారు సజ్జలపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు.

సజ్జల సకల మంత్రా అని రఘురామ ప్రశ్న
ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి పోషిస్తున్న పాత్రపై వైసీపీ అసంతృప్త నేతల్లో అసహనం పెరుగుతోంది. తాజాగా వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి పోషిస్తున్న పాత్రపై సూటి విమర్శలు చేశారు. ప్రభుత్వంలో ఏం చేయాలన్నా సజ్జలపైనే ఆధారపడుతుండటాన్ని ఆయన తప్పుబట్టారు. అలాగే రేపు మంత్రి అయ్యే అవకాశం కూడా ఉన్న సజ్జల.. ఆ తర్వాత అన్ని శాఖలకూ మంత్రిగా ఉంటారా లేక ఆయన తీసుకున్న శాఖకే మంత్రిగా ఉంటారా అని కూడా రఘురామ ప్రశ్నించారు. దీంతో రఘురామ పోషిస్తున్న ఆల్ రౌండర్ పాత్ర మరోసారి తెరపైకి వచ్చింది.

సజ్జలపై డీఎల్ విమర్శలు
ఇవాళ వైసీపీపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి కూడా సజ్జల రామకృష్ణారెడ్డి పాత్రపై విమర్శలకు దిగారు. రాష్ట్రంలో ఏ శాఖ మంత్రి ఆ శాఖ ప్రెస్ మీట్లు పెట్టడం లేదని , దారిన పోయే వాళ్లంతా మీడియా సమావేశాలు పెడుతున్నారని సజ్జలను ఉద్దేశించి డీఎల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఇదే అంశాన్ని విపక్షాలతో పాటు వైసీపీలో అసంతప్త నేతలు కూడా పదే పదే లేవనెత్తుతున్న నేపథ్యంలో డీఎల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సజ్జల వైఖరిపై రఘురామ తర్వాత బహిరంగ విమర్శలు చేసిన రెండో నేత డీఎల్ రవీంద్రారెడ్డి కావడం మరో విశేషం.
Recommended Video

వారధి నుంచి విరోధి వరకూ సజ్జల ప్రస్ధానం
వైసీపీలో సజ్జల రామకృష్ణారెడ్డికి వారధిగా పేరుంది. అధిష్టానం అయిన సీఎం జగన్ కూ, వైసీపీలో ఆ తర్వాత స్ధాయిల్లో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర కీలక నేతలకూ మధ్య వారధిగా సజ్జల వ్యవహరిస్తున్నారు. నేతల గురించి సీఎం జగన్ కు ఫీడ్ బ్యాక్ ఇచ్చేది కూడా ఆయనేనని చెబుతారు. అలాంటి సజ్జలపై ఇప్పుడు వైసీపీ అసంతృప్త నేతలు చేస్తున్న విమర్శలు చూస్తుంటే ఆయన పోషిస్తున్న వారధి పాత్ర కాస్తా విరోధిగా మారిపోతోందని అర్ధమవుతోంది. పార్టీలో అవకాశాలు దక్కనివారు, తమ మాట చెల్లుబాటు కాని వారంతా సజ్జలను ఇప్పుడు టార్గెట్ చేసుకుంటున్నారు. ఇప్పటికే రఘురామ, డీఎల్ వంటివారు సజ్జలపై విమర్శలు చేస్తుండగా.. రాబోయే రోజుల్లో కింది స్ధాయి నేతలు కూడా ఇదే బాట పట్టే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. దీనంతటికీ సజ్జల ఏకపక్ష వైఖరే కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications