వైసీపీ ఫ్రెండ్ కాదు-టీడీపీ శత్రువూ కాదు-హైకోర్టు తరలింపు ఇలా..టీజీ వెంకటేష్ కామెంట్స్
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో స్నేహం కొనసాగుతోంది. అయితే ఈ విషయం మాత్రం అటు బీజేపీ కానీ, ఇటు వైసీపీ కానీ అంగీకరించవు. అయినా కేంద్ర, రాష్ట్రాల మధ్య సంబంధాల పేరుతో వీరిద్దరి స్నేహం కొనసాగుతోంది. మరోవైపు 2019 ఎన్నికలకు ముందు బీజేపీతో విభేధించి కేంద్రం నుంచి బయటికి వచ్చిన టీడీపీ శత్రుత్వం మొదలుపెట్టింది. ఎన్నికల్లో ఓడిపోయాక మాత్రం మౌనంగా ఉండిపోయింది. దీంతో టీడీపీ-బీజేపీ మధ్య శత్రుత్వం కూడా అప్పుడప్పుడూ తెరపైకి వస్తోంది.
ఈ నేపథ్యంలో వైసీపీతో బీజేపీ సాగిస్తున్న స్నేహం, టీడీపీతో సాగిస్తున్న శత్రుత్వంపై బీజేపీ మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ ఇవాళ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీతో బీజేపీకి ఎలాంటి స్నేహం లేదని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే టీడీపీతో బీజేపీ శత్రుత్వం కూడా శాశ్వతం కాదన్నారు. అసలు రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులంటూ ఉండరని టీజీ వెల్లడించారు. అసలే రాష్ట్రంలో బీజేపీతో పొత్తు కోసం టీడీపీ ప్రయత్నిస్తున్న తరుణంలో టీజీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
అటు కర్నూలుకు హైకోర్టు తరలింపుపైనా టీజీ వెంకటేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. కర్నూల్లో హైకోర్టు ఏర్పాటుకు బీజేపీ కట్టుబడి ఉందన్నారు. అలాగే వైసీపీ ప్రభుత్వం కూడా అసెంబ్లీలో కర్నూల్లో హైకోర్టు ఏర్పాటుపై తీర్మానం చేయాలని ఆయన సలహా ఇచ్చారు. ఆ తీర్మానాన్ని కేంద్రానికి పంపిస్తే తాము దీనిపై కేంద్రాన్ని ఒప్పించి హైకోర్టు తెచ్చుకుంటామని టీజీ తెలిపారు. ఇప్పటికే హైకోర్టు తరలింపుకు సంబంధించి ప్రతిష్టంభన కొనసాగుతోంది. కేంద్రం కూడా దీనిపై రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు కలిసి మాట్లాడుకోవాలని సూచించింది. ఈ నేపథ్యంలో టీజీ హైకోర్టు తరలింపుపై అసెంబ్లీ తీర్మానం కోరడం చర్చనీయాంశమైంది.