వైసీపీ ఎమ్మెల్యే రోజా సంచలనం-సొంత పార్టీలో కోవర్డులపై పోలీసులకు ఫిర్యాదు
ఏపీలో ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్న వైసీపీ నేత ఆర్కే రోజా ఇవాళ మరో సంచలనానికి తెర దీశారు. చిత్తూరు జిల్లాలో సొంత పార్టీ నేతల్ని సైతం వదిలిపెట్టని ఆమె.. ఇవాళ ఏకంగా వారిపై చిత్తూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిత్తూరు ఎస్పీ వద్దకు వెళ్లి మరీ వారిపై ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వ్యవహారం జిల్లాలో సంచలనంగా మారింది.
వైసీపి కోవర్టులపై చర్యలు తీసుకోవాలని చిత్తూరు ఎస్పి సెంధిల్కుమార్ కి నగరి ఎమ్మెల్యే ఆర్.కే.రోజా ఫిర్యాదు చేశారు. ఇవాళ చిత్తూరులోని ఎస్పి బంగ్లాలో ఎస్పీని కలిసి వినతిపత్రం అందించారు. అనంతరం ఆర్.కే.రోజా మీడియాతో మాట్లాడుతూ వైసీపీలో ఉంటూ టీడీపీతో జత కలిసి పార్టీ కి ద్రోహం చేసే వారిని ఉపేక్షించేది లేదంటూ మండిపడ్డారు. ఏపీ డీజీపీ పోటోలతో అసత్య ప్రచారం చేస్తున్నారని, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో ఫోటోలు వేసుకుని ఫ్లెక్సీలు వేసుకుని అధికారులను బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.
గతంలో వైసీపీ నుంచి సస్పెండ్ అయిన వారు వైసీపీ పేరు చెప్పుకుంటూ తిరుగుతున్నారని, వీరిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని చిత్తూరు ఎస్పి సెంధిల్ కుమార్ కి ఫీర్యాదు చేసినట్లు ఎమ్మెల్యే రోజా తెలిపారు. తన నియోజకవర్గం నగరికి చెందిన స్ధానిక కౌన్సిలర్లు, ఇతర నేతలతో ఎస్పీని కలిసి ఆమె ఈ ఫిర్యాదులు చేశారు. ఇప్పటికే తన నియోజకవర్గంలో సొంత పార్టీలో ఉంటూనే తనకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారని ఆమె ప్రత్యర్ధులపై ఎప్పటినుంచో ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా పోలీసులకే వారిపై ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. రోజా ఆరోపణలపై ఇప్పుడు ఎలా స్పందించాలో తెలియక పోలీసులు తల పట్టుకుంటున్నారు.