చంద్రబాబు శ్రీలంక టూర్-సాయిరెడ్డి రిక్వెస్ట్-గోదావరి వరద పరామర్శలతో చెడుగుడు..
ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీగా సాగుతున్న రాజకీయాల్లో మాటల తూటాలు పేలుతున్నాయి. ముందస్తు ఎన్నికల సంకేతాలతో ఇరుపార్టీల నేతలు పరస్పరం ప్రత్యర్ధులపై రెచ్చిపోతున్నారు. సందు దొరికిందంటే చాలు సోషల్ మీడియాలోనూ పోస్టులతో హల్ చల్ చేస్తున్నారు. ఇక నిత్యం చంద్రబాబుపై ట్వీట్లు పెడుతూ ఆయన్ను ఇరిటేట్ చేసే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఇప్పుడు గోదావరి వరదల పరామర్శల రూపంలో మరో అస్త్రం దొరికింది. ఇక ఆయన వదుకుంటారా ?
చంద్రబాబు వరద పరామర్శలు
గోదావరి నదికి చాలా కాలం తర్వాత తీవ్రంగా వరదలు వచ్చాయి. ఇందులో గోదావరికి ఇరువైపులా ఉన్న జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. లంక గ్రామాలు మునిగిపోయాయి. పోలవరంలో పరద గోదావరి ఉగ్రరూపం కనిపిస్తోంది. వేల మంది నిరాశ్రయులయ్యారు. దీంతో ఆయా గ్రామాల్లో బోటులో ప్రయాణిస్తూ విపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు ధైర్యం చెప్తున్నారు. ఇదే క్రమంలో నిన్న చంద్రబాబు తృటిలో ప్రమాదం నుంచి కూడా తప్పించుకున్నారు. ఆయన బోటు దిగిన వెంటనే అందులో ఉన్న మాజీ మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు నీళ్లలో పడ్డారు. చివరికి ఎలాగోలా బయటపడ్డారు.
చంద్రబాబుపై సాయిరెడ్డి వ్యంగ ట్వీట్
గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన, ఆయన చేస్తున్న విమర్శలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యంగంగా స్పందించారు. చంద్రబాబును టార్గెట్ చేస్తూ ట్వీట్ పెట్టారు. ఇందులో సాయం అందుతోందయ్యా అంటూ బాధితులు చంద్రబాబుకు చెప్పినట్లున్న వార్తా కథనం క్లిప్ ను కూడా తన ట్వీట్ కు జత చేశారు. తద్వారా బాధితుల్ని పరామర్శించేందుకు వెళ్తున్న చంద్రబాబుకు వారికి సాయం అందుతోందంటూ ఫీడ్ బ్యాక్ వస్తున్నట్లు సాయిరెడ్డి చెప్పే ప్రయత్నం చేశారు.
చంద్రబాబు దిగ్భ్రాంతి
వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న చంద్రబాబుకు బాధితులు తమకు సాయం అందడం లేదంటూ మొరపెట్టుకుంటున్నట్లు ఇవాళ టీడీపీ అనుకూల పత్రికల్లో వార్తలొచ్చాయి. దీంతో అదేమీ లేదు తమకు సాయం అందుతోందంటూ బాధితులు చెప్తున్నట్లు వైసీపీ పత్రిక సాక్షిలో వచ్చిన వార్తను తన ట్వీట్ కు జత చేసిన సాయిరెడ్డి... ప్రభుత్వం తమకు భోజనం, మంచినీళ్లు, వసతి కల్పిస్తోందని లంక గ్రామాల ప్రజలు చెప్పడంతో చంద్రబాబు దిగ్భ్రాంతికి గురైనట్లు సాయిరెడ్డి చెప్పుకొచ్చారు. దీంతో టీడీపీ నేతలు పడవలో నుంచి కిందకు దూకి హడావిడి చేశారన్నారు.
చంద్రబాబును శ్రీలంకకు వెళ్లమన్న సాయిరెడ్డి
ప్రస్తుతం గోదావరి వరద గ్రామాల్లో పర్యటిస్తున్న చంద్రబాబుకు ఈ సందర్భంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఓ కీలక సూచన కూడా చేశారు. ప్రచారం కోసం వరద ప్రాంతాలకు వెళ్తున్న చంద్రబాబు.. అక్కడ కాకుండా శ్రీలంకకు వెళ్తే ఎక్కువ ప్రచారం వస్తుందని సలహా ఇచ్చారు. అసలే సంక్షోభంతో అల్లాడుతున్న శ్రీలంకకు వెళ్లాలంటూ సాయిరెడ్డి చంద్రబాబుకు చేసిన సూచనపై టీడీపీ నేతలు, అభిమానులు మండిపడుతున్నారు. సాయిరెడ్డికి ట్విట్టర్ లోనే కౌంటర్లు ఇచ్చేస్తున్నారు.