ఏపీలో అల్లర్లకు చంద్రబాబు భారీ స్కెచ్- విజయసాయిరెడ్డి సంచలన ట్వీట్ !
ఏపీలో చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నిత్యం ఏదో ఒక అంశాన్ని ప్రస్తావిస్తూ ట్వీట్లు పెడుతూనే ఉంటారు. అయితే అందులో కొన్ని విషయాలు మాత్రం ఎప్పుడూ సంచలనంగానే కనిపిస్తుంటాయి. ఇదే క్రమంలో తాజాగా విజయసాయిరెడ్డి చేసిన తాజా ట్వీట్ సంచలనం రేపుతోంది.
ఏపీలో మూడు రాజధానుల్ని అమల్లోకి తెచ్చేందుకు వైసీపీ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దీన్ని అడ్డుకునేందుకు చంద్రబాబు, ఇతర విపక్ష పార్టీలతో కలిసి ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో వైసీపీ సర్కార్ రాజధానులుగా ప్రతిపాదిస్తున్న కర్నూలు, వైజాగ్ లో పర్యటనలు కూడా చేపడుతున్నారు. ఈ టూర్లలో టీడీపీ శ్రేణులు కూడా భారీఎత్తున తరలివస్తున్నాయి. దీంతో భారీ స్ధాయిలో కాకపోయినా చంద్రబాబుకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతూనే ఉన్నాయి.
వీటిని ప్రస్తావిస్తూ చంద్రబాబు మూడు రాజధానులకు వ్యతిరేకంగా అల్లర్లకు కుట్రలు చేస్తున్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇవాళ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో అల్లర్లు సృష్టించడానికి చంద్రం భారీ స్కెచ్ వేశాడని, అమరావతిని అంగీకరించాలంటూ ఉత్తరాంధ్రలో ఘర్షణలు లేపాలనిచూస్తే ప్లాన్ ఫ్లాప్ అయిందని, కర్నూలు వెళ్లి తనే రెచ్చగొట్టే ప్రయత్నం చేసాడని సాయిరెడ్డి ఆరోపించారు. మీరు కడుపు మాడ్చుకుని మాకు కమ్మని భోజనం వడ్డించండి అనేలా చంద్రబాబు వాలకం ఉందని ఆయన విమర్శించారు.