తారకరత్నను పరామర్శించిన విజయసాయిరెడ్డి- రేపు గుడ్ న్యూస్ ?
గుండెపోటుతో బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న టాలీవుడ్ హీరో తారకరత్నను ఇవాళ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పరామర్శించారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు.
కుప్పంలో నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభం నేపథ్యంలో గుండెపోటుకు గురైన టాలీవుడ్ హీరో నందమూరి తారకరత్న ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్దితి ఆందోళనకరంగా ఉండటంతో నందమూరి కుటుంబ సభ్యులతో పాటు పలువురు ఆయన్ను పరామర్శిస్తున్నారు. ఇదే క్రమంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఇవాళ తారకరత్నను పరామర్శించారు.
బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి వెళ్లిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అక్కడ తారకరత్నను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్ధితిపై డాక్టర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే తారక్ కుటుంబ సభ్యులకు సాయిరెడ్డి ధైర్యం చెప్పినట్లు తెలుస్తోంది. అనంతరం మీడియాతో ఆ వివరాల్ని సాయిరెడ్డి పంచుకున్నారు. ప్రస్తుతం తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉందని సాయిరెడ్డి వెల్లడించారు. తారకరత్న ఆరోగ్యం కుదుటపడ్డాక వాపు తగ్గుతుందని, అప్పుడు పురోగతి కనిపిస్తుందన్నారు. రేపటి నుంచి పురోగతి ఉండే అవకాశం ఉందని డాక్టర్లు చెప్పినట్లు సాయిరెడ్డి వెల్లడించారు. డాక్టర్లు మంచి ట్రీట్ మెంట్ ఇస్తున్నట్లు సాయిరెడ్డి తెలిపారు.
బాలకృష్ణ అక్కడే ఉండి అన్ని విషయాలు దగ్గరుండి చూసుకుంటున్నట్లు సాయిరెడ్డి వెల్లడించారు. బాలకృష్ణకు సాయిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తారకరత్న గుండెపోటు వచ్చిన రోజు 45 నిమిషాల పాటు మెదడుకు రక్తప్రసరణ ఆగిపోవడం వల్ల నరాలు కాస్త దెబ్బతిన్నాయని, ఇవాళ పరిస్ధితి చాలా మెరుగ్గా ఉందన్నారు. గుండెతో పాటు రక్తప్రసరణ చాలా బాగుందన్నారు. రేపటి కల్లా పరిస్ధితి మరింత మెరుగుపడొచ్చని తెలుస్తోందన్నారు.