అమరావతి పాదయాత్రపై సస్పెన్స్- హైకోర్టు అభయం సరిపోలేదా ? సుప్రీంవైపే చూపు !
ఏపీలో అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరుతూ అరసవిల్లికి రైతులు చేపట్టిన పాదయాత్ర గత నెలలో అర్దాంతరంగా నిలిచిపోయింది. హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో పోలీసులు రైతుల్ని టార్గెట్ చేయడంతో పాదయాత్ర రామచంద్రపురంలో నిలిచిపోయింది. ఆ తర్వాత హైకోర్టు ఇచ్చిన తీర్పు రైతులకు ధైర్యం ఇవ్వలేకపోతోంది.దీంతో ఇప్పటికీ రైతులు పాదయాత్ర తిరిగి ఎప్పుడు మొదలవుతుందో చెప్పలేని పరిస్ధితి నెలకొంది.

అమరావతి పాదయాత్రపై సస్పెన్స్
అమరావతి రైతులు రాజధాని కోసం అరసవిల్లికి చేపట్టిన పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో నిలిచిపోయింది. అప్పటికే పశ్చిమగోదావరి జిల్లాలో వైసీపీ కార్యకర్తలు నల్లబెలూన్లతో నిరసనలకు దిగడం, పోటాపోటీగా నినాదాలు చేయడం, చివరికి రాజమండ్రిలో దాడుల వరకూ వెళ్లడంతో అమరావతి పాదయాత్ర ముందుకు సాగడం కష్టంగా మారిపోయింది. అదే సమయంలో హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై వెలువడిన ఉత్తర్వులతో పోలీసులు యాత్రను టార్గెట్ చేశారు. చివరికి రామచంద్రపురం వరకూ వెళ్లిన యాత్రను ఐడీ కార్డుల పేరుతో పోలీసులు నిలిపేశారు. దీంతో రైతులు కూడా వెనక్కి తగ్గక తప్పలేదు.

అభయమివ్వని హైకోర్టు తీర్పు ?
అమరావతి రైతుల పాదయాత్రకు ముందుగా ఏ షరతులతో అయితే అనుమతి ఇచ్చారో అవే షరతులను కొనసాగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో రైతులు పాదయాత్రను తిరిగి ప్రారంభిస్తారని అంతా భావించారు. కానీ రైతులు 2 వేల మందిని విడతల వారీగా యాత్రలో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలని కోరడంతో ప్రభుత్వం ఒప్పుకోలేదు. దీనిపై క్లారిటీ రాకపోవడంతో మిగతా షరతులతో యాత్ర కొనసాగేలా చూడాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో హైకోర్టు తీర్పు ప్రకారం యాత్ర చేసే పరిస్దితి లేదని రైతులు భావించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో యాత్ర పునరుద్ధరణపై రైతులు క్లారిటీ ఇవ్వడం లేదు.

సుప్రీంకోర్టు వైపే చూపు ?
హైకోర్టు తీర్పు తర్వాత కూడా అమరావతి రైతులు యాత్రను పునరుద్ధరించకపోవడంతో ఇప్పుడు వారి దృష్టి సుప్రీంకోర్టు అమరావతి పిటిషన్లపై ఇచ్చే తీర్పుపైనే ఉందని తెలుస్తోంది. అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్ఎల్పీతో పాటు రైతులు దాఖలు చేసిన పిటిషన్లపైనే సుప్రీంకోర్టు విచారణ ప్రారంభమై ఈ నెల 14కు వాయిదా పడింది. ఇప్పుడు ఆ పిటిషన్లపై సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందిస్తే అప్పుడు అమరావతి పాదయాత్ర ప్రారంభించేందుకు రైతులు ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సుప్రీంకోర్టు విచారణ పూర్తయి తుది ఉత్తర్వులు వెలువడేందుకు చాలా సమయం పడుతుంది. దీంతో పాదయాత్ర ఇప్పట్లో మొదలుకావడం కష్టమేనన్న ప్రచారం జరుగుతోంది.












Click it and Unblock the Notifications