బెంగళూరు హింస: సెక్షన్ 144 పొడగింపు - ఇప్పటిదాకా 52 కేసులు, 264 అరెస్టులు - బీజేపీపై డీకే ఫైర్
వారం రోజులు గడిచినా హింసాత్మక ఘటనల ప్రభావం నుంచి బెంగళూరు ఇంకా తేరుకోలేదు. దీంతో ప్రభావిత ప్రాంతాల్లో సెక్షన్ 144 పొడిగిస్తున్నట్లు సిటీ పోలీస్ కమిషనర్ కమల్ పంత్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆగస్టు 18(మంగళవారం వరకు) నిషేధాజ్ఞలు కొనసాగుతాయని, పులకేశినగర్ అసెంబ్లీ సెగ్మెంట్ లోని డీజే హళ్లి, కేజీ హళ్లి పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రాంతాల్లో ప్రజలెవరూ బయట తిరగొద్దని, ఇద్దరు, అంతకంటే ఎక్కువ మంది గుమ్మికూడితే వెంటనే అరెస్టు చేస్తామని సీపీ వార్నింగ్ ఇచ్చారు.
బెంగళూరు హింసకు సంబంధించి వారం తర్వాత కూడా కేసుల నమోదు, అరెస్టుల పర్వం కొనసాగుతున్నది. ఆదివారం నాటికి ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద, పలు పోలీస్ స్టేషన్లలో 52 ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయని, ఆయా కేసులకు సంబంధించి 264 మందిని అరెస్టు చేశామని, రాబోయే రోజుల్లో లభించే ఆధారాలను బట్టి ఈ సంఖ్య పెరగొచ్చని బెంగళూరు ఈస్ట్ డీసీపీ శరణప్ప మీడియాకు తెలిపారు.
మనిషి పుర్రెను కాల్చుకుని - విశాఖలో సైకో రాజు కలకలం - అతని ఇంట్లో ఓ యువతి..
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బెంగళూరు అల్లర్ల ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకు పెరిగింది. ఈనెల 11న రాత్రి సమయంలో వేల మంది ఆందోళనకారులు.. పులకేశినగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి ఇల్లు, డీజే హళ్లి, కేజీ హళ్లి పోలీస్ స్టేషన్లపై దాడి చేసి, చుట్టుపక్కల ప్రాంతాల్లో సుమారు 300 వాహనాలను తగులబెట్టారు. ఆందోళనకారులను అడ్డుకునే క్రమంలో పోలీసులు కాల్పులు జరపగా, అదే రోజు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరిన సయీద్ నదీమ్(24) అనే యువకుడు శనివారం సర్జరీ తర్వాత కన్నుమూశాడు. అతనికి కరోనా పాజిటివ్ గా డాక్టర్లు నిర్ధారించారు. ఇదిలా ఉంటే,
బెంగళూరు అల్లర్లపై అధికార బీజేపీ కావాలనే రాజకీయం చేస్తున్నదని, కమలనాథుల అంతర్గత కుమ్ములాటల వల్లే దీన్ని పెద్దది చేశారని కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ ఆరోపించారు. మహ్మద్ ప్రవక్తను కించపరుస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీనివాసమూర్తి బంధువు నవీన్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టడమే వివాదానాకి మూలకారణంగా వెల్లడైనవేళ... దీనిపై కాంగ్రెస్ పార్టీ సైతం ఆరుగురు సభ్యులతో నిజ నిర్ధారణ కమిటీ వేసింది.
అడ్డొస్తే రామ్ పోతినేనిపై చర్యలు - విజయవాడ ఏసీపీ వార్నింగ్ - అంతలోనే హీరో మరో ట్విస్ట్
''కాంగ్రెస్ కమిటీ దర్యాప్తులో నిజాలు బయటికొస్తాయి. అంతర్గత సమస్యలను పక్కదారి పట్టించేందుకే బీజేపీ అల్లర్లను రాజకీయం చేస్తున్నది. నిజానికి తన పోస్టుపై బీజేపీ శ్రేణులే వివాదాన్ని సృష్టించారని నవీన్ ఇదివరకే చెప్పాడు. ఈ విషయంలో తప్పు చేసిన తమ వాళ్లను బీజేపీ కాపాడుకుంటున్నది''అని కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ అన్నారు.