Karnataka Next CM : సీఎం పదవి ఫ్రంట్ రేసులో ఆ ఇద్దరు... బ్రాహ్మణ నేతకే బీజేపీ పట్టం కట్టబోతుందా?
కర్ణాటక ముఖ్యమంత్రిగా యడియూరప్ప రాజీనామా నేపథ్యంలో తదుపరి సీఎం ఎవరన్నది హాట్ టాపిక్గా మారింది. యడియూరప్ప సామాజికవర్గమైన లింగాయత్ నుంచే మరోసారి సీఎంను ఎంపిక చేస్తారా... లేక ఇతర వర్గాలకు అవకాశం ఇస్తారా అన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికైతే అధిష్ఠానం నుంచి ఎటువంటి ప్రకటన లేనప్పటికీ పలువురి పేర్లు మాత్రం తెర పైకి వస్తున్నాయి.అధిష్ఠానం 8 మంది పేర్లతో ఇప్పటికే జాబితా సిద్ధం చేసిందని... అందులో ఒకరిని సీఎంగా ప్రకటించే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు బ్రాహ్మణ వర్గానికి చెందిన నేతకు ఈసారి ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టవచ్చునన్న వాదన కూడా వినిపిస్తోంది.
Recommended Video

ఫ్రంట్ రేసులో ఆ ఇద్దరు...
వెస్ట్ ధర్వాడ్ ఎమ్మెల్యే అరవింద్ బెల్లాద్,విజయపురా ఎమ్మెల్యే బసన్నగౌడ పాటిల్ యాత్నల్,మంత్రులు ముర్గేశ్ ఆర్ నీరణి,బసవరాజ్ బొమ్మై తదితరుల పేర్లు బీజేపీ సిద్ధం చేసిన జాబితాలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే సీఎం రేసులో ప్రధానంగా ఇద్దరి పేర్లు ముందు వరుసలో ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇందులో ఒకరు కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి కాగా మరొకరు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి. ప్రహ్లాదో జోషి బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందినవారు. ఒకవేళ ఆయన్ను సీఎంగా నియమిస్తే 1988 తర్వాత ఆ సామాజికవర్గానికి అవకాశం ఇవ్వడం ఇదే తొలిసారి అవుతుంది. ఇక సీటీ రవి వొక్కలిగ సామాజికవర్గానికి చెందిన నేత. ఆయనకు సీఎంగా అవకాశమిస్తే దక్షిణ కర్ణాటకలో పార్టీ బలపడుతుందనే వాదన ఉన్నది.

ప్రహ్లాద్ జోషి వైపే బీజేపీ మొగ్గు...?
ప్రహ్లాద్ జోషి ప్రస్తుతం ధర్వాడ్ లోక్సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2004 నుంచి ధర్వాడ్ నుంచి ఆయన వరుసగా ఎన్నికవుతూ వచ్చారు. 2012-2016లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. బీజేపీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్తో ఆయనకు బలమైన సంబంధాలు ఉన్నాయి. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకముందు ఆర్ఎస్ఎస్లో ఆయన క్రియాశీలకంగా వ్యవహరించారు. ప్రస్తుత కర్ణాటక రాజకీయాల్లో అన్ని పార్టీల నేతలతోనూ ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రహ్లాద్ జోషి వైపే బీజేపీ అధిష్ఠానం మొగ్గుచూపవచ్చునన్న ప్రచారం జరుగుతోంది.

ప్రహ్లాద్ జోషికి కలిసొచ్చే అంశాలు...
కాంగ్రెస్ మాజీ ఎంపీ,ప్రొఫెసర్ ఐజీ సనాది మాట్లాడుతూ... 'పార్టీ పట్ల జోషీ నిబద్దతను,ఆయన పనితనాన్ని మేము గమనించాం. సాధారణంగా జాతీయ పార్టీలు అలాంటి నాయకుడి కోసమే చూస్తాయి. అభివృద్ది,మత సామరస్యం వంటి అంశాలపై జోషీ ఫోకస్ పెట్టగలిగితే.. ఉత్తర కర్ణాటక నుంచి ఆయన మంచి నాయకుడిగా ఎదిగే అవకాశం ఉంది. గతంలో దిగ్గజ నేత హెచ్ఎన్ అనంత్ కుమార్తో ఉన్న సాన్నిహిత్యం,ప్రస్తుతం ప్రధాని మోదీతో జోషీకి ఉన్న సాన్నిహిత్యాన్ని బట్టి సీఎం పదవి ఆయనకే దక్కవచ్చు.' అని అభిప్రాయపడ్డారు.

జోషిపై సానుకూల దృక్పథం..
ప్రహ్లాద్ జోషిపై ఇంటా,బయటా చాలామందిలో సానుకూల దృక్పథం ఉంది. జోషీ బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన నేతనే అయినప్పటికీ అందరినీ కలుపుకుపోగల సత్తా ఆయనకు ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉమేశ్ దుషీ అనే బీజేపీ నేత మాట్లాడుతూ... ధార్వాడ్లో బ్రాహ్మణుల ఓట్లు 85వేల వరకు ఉన్నాయని చెప్పారు. 2019 లోక్సభ ఎన్నికల్లో ఆయనకు 2 లక్షల పైచిలుకు మెజారిటీ వచ్చిందన్నారు. దీన్ని బట్టి మిగతా వర్గాల్లోనూ ఆయనకు ఆదరణ ఉందన్న విషయం స్పష్టమవుతోందన్నారు. ఒకవేళ జోషీని సీఎంగా ప్రకటిస్తే హుబ్బలి-ధార్వాడ్ ప్రాంతం నుంచి సీఎంగా ఎన్నికైన మూడో నేతగా నిలుస్తారు. గతంలో ఇదే ప్రాంతానికి చెందిన ఎస్ఆర్ బొమ్మై,జగదీశ్ శెట్టర్ సీఎంలుగా పనిచేశారు.












Click it and Unblock the Notifications