యూఎస్ నుంచి ఢిల్లీకి: మరో ఫ్లైట్లో బెంగళూరుకు పునీత్ రాజ్కుమార్ కూతురు: నటి రమ్య తోడుగా
బెంగళూరు: గుండెపోటుతో కన్నుమూసిన శాండల్వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్కుమార్ పార్థివ దేహానికి ఆదివారం అంత్యక్రియలు జరుగుతాయి. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కొద్దిసేపటి కిందటే ఈ విషయాన్ని ప్రకటించారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహిస్తామని తెలిపారు. కంఠీరవ స్టూడియోలో పునీత్ పార్థివ దేహానికి అంత్యక్రియలను చేపడతారు. ఆయన తండ్రి రాజ్కుమార్, తల్లి పార్వతమ్మల సమాధులు అక్కడే ఉన్నాయి.
వాటి పక్కనే పునీత్ రాజ్కుమార్ పార్థివ దేహానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. పునీత్ రాజ్కుమార్కు వందిత, ధృతి అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారిలో ధృతి రాజ్కుమార్ అమెరికాలో చదువుకుంటున్నారు. తన తండ్రి మరణవార్త తెలిసిన వెంటనే ఆమె అమెరికా నుంచి బయలుదేరారు. ఈ మధ్యాహ్నం ఒంటిగంటకు దేశ రాజధానిలో ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు.
తనిఖీలన్నీ పూర్తి చేసుకున్న తరువాత 2 గంటల సమయంలో ఢిల్లీ నుంచి నుంచి ఎయిరిండియా విమానంలో ఆమె బెంగళూరుకు బయలుదేరారు. ఈ సాయంత్రం 6 గంటలకు ఆమె బెంగళూరుకు చేరుకుంటారు. నగర శివార్లలోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కంఠీరవ స్టేడియానికి చేరుకుంటారు. ఆమె కంఠీరవ స్టేడియానికి వచ్చేసరికి సాయంత్రం 7 గంటలవుతుందనే అంచనాలు ఉన్నాయి. అందుకే- అంత్యక్రియలను ఆదివారానికి వాయిదా వేసినట్లు ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై చెప్పారు.
కాగా- బెంగళూరు విమానాశ్రయంలో ధృతి వెంట ఉండటానికి ప్రముఖ నటి రమ్య వెళ్తారు. సాయంత్రం 4 గంటలకు ఆమె విమానాశ్రయానికి వెళ్తారని తెలుస్తోంది. రాజ్కుమార్ కుటుంబానికి రమ్య ఆప్తురాలు. శివ రాజ్కుమార్ కోరిక మేరకు రమ్య కెంపెగౌడ ఎయిర్పోర్ట్కు వెళ్తారని సమాచారం. దగ్గరుండి ధృతి రాజ్కుమార్ను తీసుకుని కంఠీరవ స్టేడియానికి వస్తారు. మరో కుమార్తె వందిత రాజ్కుమార్ బెంగళూరులోనే ఉన్నారు. తల్లి అశ్విని రేవంత్ వెంట ఉంటున్నారు.