యడియూరప్ప కీలక నిర్ణయం... కొత్తగా 17 మంది ఎమ్మెల్యేలకు కేబినెట్ హోదా...
కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప కీలక నిర్ణయం తీసుకున్నారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు బదులు కొత్తగా 13 మంది ఎమ్మెల్యేలకు కేబినెట్ ర్యాంకు హోదా కల్పించారు. మరో నలుగురు ఎమ్మెల్యేలకు సహాయ మంత్రి హోదా కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని వివిధ బోర్డులు,కార్పోరేషన్లకు వీరిని ఛైర్పర్సన్లుగా నియమించి ఈ హోదాలు కట్టబెట్టారు. అలాగే ఓ రిటైర్డ్ ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్కి కూడా కేబినెట్ ర్యాంకు హోదాతో సీఎం మీడియా అడ్వైజర్ పోస్టు కట్టబెట్టారు.
Recommended Video
ప్రస్తుతం యడియూరప్ప కేబినెట్లో 27 మంది మంత్రులు ఉన్నారు. మరో 7 మందికి కేబినెట్లో స్థానం కల్పించే వెసులుబాటు ఉంది. అయితే ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండటం... కేబినెట్ విస్తరణకు ఒత్తిడి పెరుగుతుండటంతో మధ్యే మార్గంగా యడియూరప్ప ఈ నిర్ణయం తీసుకున్నారు. తద్వారా ఆశావహుల్లో ప్రభుత్వంపై అసంతృప్తి ఏర్పడకుండా జాగ్రత్త పడ్డారు. అయితే ఉండాల్సిన సంఖ్య కంటే ఎక్కువ మందికి కేబినెట్ హోదాను కట్టబెట్టడంపై న్యాయపరమైన చిక్కులు తలెత్తుతాయా అన్న చర్చ కూడా జరుగుతోంది.
కొత్తగా కేబినెట్ ర్యాంకు హోదా దక్కించుకున్న ఎమ్మెల్యేల్లో ఎం.చంద్రప్ప,దుర్యోధన్ మహలింగప్ప,నెహ్రూ ఒలేకర్,నరసింహ నాయక్,శివనగౌడ నాయక్,కలకప్ప బండి,శంకర్ పాటిల్ మునెనకొప్ప,మదల్ విరుపక్షప్ప,సిద్దు సవాది,పాటిల్ నదహళ్లి,దత్తాత్రేయ రేవూర్,పి.రాజీవ్,ఎస్.వి.రామచంద్ర ఉన్నారు. సహాయ మంత్రి హోదా దక్కించుకున్నవారిలో రాజ్కుమార్ పాటిల్ తెల్కూర్,సీఎస్ నిరంజన్ కుమార్,ఏఎస్ జయరాం,ఎన్.లింగన్న ఉన్నారు.