రాత్రయితే 'నైటీ'ల్లో మగవాళ్లు: ఇంటి ముందు పెద్ద పురుషాంగాలతో దిష్టిబొమ్మలు..
Recommended Video
బ్యాంకాక్: దెయ్యాల భయంతో అప్పట్లో 'ఓ స్త్రీ రేపురా' అన్న ప్రచారం బాగానే జరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని గ్రామాల ప్రజలు తమ ఇళ్లకు సైతం ఇవే బోర్డులను తగిలించుకున్నారు.
ఇప్పుడిలాంటి పరిస్థితే థాయిలాండ్ లోని 'న చియూక్ యాయ్' గ్రామస్తులకూ ఎదురైంది. ఇటీవల గ్రామంలోని ఐదుగురు పురుషులు మృత్యువాత పడటంతో.. ఈ మరణాలకు దెయ్యమే కారణమన్న ప్రచారం జరిగింది. దీంతో దెయ్యాల నుంచి రక్షించుకోవడానికి కనీవిని ఎరుగని ఓ కొత్త విధానాన్ని ఫాలో అయిపోతున్నారు.
అసలేంటి కథ?:
'న చియూక్ యాయ్' గ్రామంలో కొన్నాళ్ల క్రితం ఓ భర్త లేని మహిళ మృతి చెందింది. అప్పటినుంచి ఆమె గ్రామంలోని పురుషులను పట్టి పీడిస్తోందన్న ప్రచారం మొదలైంది. రాత్రివేళ ఇంట్లో నిద్రిస్తున్న పురుషుల శరీరాల్లోకి ప్రవేశించి.. నిద్రలోనే వారిని చంపేస్తోందన్న గుసగుసలు మొదలయ్యాయి.
ఇంటిముందు ఆ దిష్టిబొమ్మలు..:
ఇటీవల చనిపోయిన ఐదుగురు పురుషులు దెయ్యం కారణంగానే చనిపోయారని భావించారు. దెయ్యం బారి నుంచి తమ ఇంటి మగవాళ్లను రక్షించుకునేందుకు ఇప్పుడక్కడ దిష్టిబొమ్మల తంతు మొదలైంది. అయితే అవి సాదాసీదా దిష్టిబొమ్మలైతే ఇంత చర్చ ఉండేది కాదు. పెద్ద పురుషాంగాల్ని కలిగిన దిష్టిబొమ్మల్ని తమ ఇంటి ముందు ఉంచుతున్నారు.
'ఇక్కడ మగవాళ్లు లేరు':
పెద్ద పురుషాంగాలను కలిగిన పురుషులను చూస్తే దెయ్యం భయపడుతుందని.. అందుకే ఇలాంటి దిష్టిబొమ్మలను ఇంటి ముందు పెడుతున్నామని అక్కడివారు చెబుతున్నారు. అంతేకాదు, 'ఇక్కడ మగవాళ్లు ఎవరూ లేరు' అంటూ ఇంటిముందు బోర్డులు సైతం పెట్టేస్తున్నారు.
రాత్రైతే నైటీల్లోకి మగవాళ్లు..:
కేవలం 90మంది మాత్రమే ఉండే ఈ గ్రామంలో.. రాత్రయిందంటే చాలు పురుషులను భయం వెంటాడుతుందట. దెయ్యాల బారి నుంచి రక్షించుకోవడానికి రాత్రవగానే.. నైటీలు వేసుకుని, లిప్ స్టిక్స్ పెట్టుకుని అచ్చు ఆడవాళ్లలా తయారవుతారట. ఆడవాళ్లలా కనిపిస్తే దెయ్యాలు తమ దరిచేరవని అక్కడివారు భావిస్తున్నారు.
ప్రయత్నం ఫలించిందట..:
ఇంటి ముందు దిష్టిబొమ్మల్ని పెట్టాకే.. తమ గ్రామంలో పురుషుల మరణాలు ఆగిపోయాయని అక్కడివారు చెబుతున్నారు. తమ ప్రయత్నం ఫలించిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కాగా, మొదట ఇద్దరు పురుషులు హఠాణ్మరం చెందడంతో ఈ భయం మొదలైనట్టు తెలుస్తోంది. రాత్రి పూట స్నానం చేసి ఎప్పటిలాగే నిద్రకు ఉపక్రమించిన ఆ ఇద్దరు.. తెల్లారేసరికి చనిపోయారట. 40ఏళ్ల వయసు, ధిట్టంగా ఉండే ఆ ఇద్దరికి ఎలాంటి జబ్బు లేదట. దీంతో దెయ్యమే వారిని చంపేసిందన్న ప్రచారానికి అక్కడ బీజం పడింది.