డ్రీమ్ బడ్జెట్లు ఇలా.. సేద్యం నుంచి ఐటీ వరకు స్వీయ ప్రగతి
న్యూఢిల్లీ: ప్రతియేటా ఫిబ్రవరిలో కేంద్ర ఆర్థిక మంత్రులు పార్లమెంట్లో బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పించిన సందర్భంగా లోక్సభలో ప్రసంగించడం ఆనవాయితీ. చరిస్మాతో కూడిన వారి ప్రసంగాలు దేశ ప్రగతి రూపురేఖలను మార్చేశాయి. తమ ప్రసంగాలతో దేశ ప్రగతి కోసం వారి మనస్సు పొరల్లో దాచి పెట్టుకున్న రహస్యమైన అతిపెద్ద ఆలోచనలన్నీ బయటకు వచ్చాయి. భారత్ రూపురేఖలనే మార్చేశాయి. బ్రిటిష్ వలస పాలన నుంచి విముక్తి పొందిన 1947 ఆగస్టు 15 నుంచి ఇప్పటి వరకు ఏటా పార్లమెంట్కు సమర్పించిన బడ్జెట్లు భారతదేశ పరివర్తనలో కీలక పాత్ర పోషించాయి. దేశ విభజన సమస్యలను అధిగమించి.. వ్యవసాయ, పారిశ్రామిక రంగంలో స్వయం సమ్రుద్ధి సాధించడంలో బడ్జెట్లు కీలక భూమిక పోషించాయి.
1970 - 71లో ఇందిరాగాంధీ గరీబీ హఠావో నినాదం అందుకున్నా.. 1986, 1987, 1997ల్లో పన్ను ఎగవేత దారులపై వీపీ సింగ్, రాజీవ్ గాంధీ, చిదంబరంలు కొరడా ఝుళిపించినా.. పన్ను విస్త్రుతి పెంచినా.. 2000లో మిలీనియం బడ్జెట్ అంతర్జాతీయ ఐటీ రంగానికి చుక్కానిగా నిలిచాయి మన దేశీయ ఆర్థిక మార్కెట్లు. అటువంటి బడ్జెట్ ప్రసంగాల్లో అణి ముత్యాలు అనదగ్గవి ఎనిమిది ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఆ ప్రసంగాలను ఒకసారి పరిశీలిద్దాం..
మొదటి నుంచి బడ్జెట్ కేటాయింపుల్లో రక్షణకు సింహభాగం
బ్రిటిష్ వలస పాలకులు ఆడిన వింత నాటకంలో 1947లో భారత్, పాకిస్థాన్గా చీలిపోయిన భారత్కు విభజన భారం మోయలేనిదిగా మారిందంటే అతిశయోక్తి కాదు. స్వాతంత్ర్యానంతరం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్లోనే రూ.24.59 కోట్లు ద్రవ్యలోటు ఏర్పడింది. తొలి ఆర్థికశాఖ మంత్రి షణ్ముఖం బడ్జెట్ ప్రతిపాదనల్లో రెవెన్యూగా రూ.171.15 కోట్లుగా ప్రతిపాదించారు. కానీ వ్యయం రూ.197.39 కోట్లుగా నిర్ణయిస్తే అందులో రూ.92.74 కోట్లు రక్షణ బడ్జెట్గా నిర్ణయించారు. తొలి బడ్జెట్ కేటాయింపుల్లో అత్యధిక శాతం భద్రత, ఆహార సంక్షోభం, శరణార్థుల పునరావాసానికే ఖర్చు చేశారు. 1951లో భారత రిపబ్లిక్ లో తొలి ఆర్థిక మంత్రిగా జాన్ మథాయి.. ఆర్థికంగా ఆశావాహ ప్రగతి సాధన దిశగా అవసరమైన ప్రణాళిక సంఘం రూపకల్పనకు బాటలు వేశారు. 1968లో అప్పటి ఆర్థిక శాఖ మంత్రి మొరార్జీ దేశాయి ప్రవేశ పెట్టిన బడ్జెట్ ప్రజలే ప్రధానంగా నిర్దేశించిందన్న అభిప్రాయాలు వచ్చాయి.
భారతదేశ చరిత్రలో ఏకైక మహిళా ఆర్థిక మంత్రి ఇందిరా
భారతదేశంలో కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రి కం ఆర్థిక మంత్రిగా పని చేసిన మహిళానేత ‘ఉక్కు మనిషి' ఇందిరాగాంధీ ఒక్కరే. ఆమె ఆర్థిక మంత్రిగా 1970 - 71 సంవత్సర బడ్జెట్ను సమర్పించారు. అప్పట్లో ‘గరిబీ హఠావో' అంటే దేశ ప్రజలందరికీ ఫేమస్. అప్పటి ప్రధానిగా శ్రీమతి ఇందిరాగాంధీ ఆర్థికశాఖ మంత్రిగానూ పలు పేదరిక వ్యతిరేక పథకాలకు శ్రీకారం చుట్టారు. దీనివల్ల మిగులు ఆదాయం గల భారతదేశ ఆర్థిక వ్యవస్థ ద్రవ్యలోటుల్లో చిక్కుకున్నదన్న విమర్శ కూడా ఉన్నది. ఆమె తన బడ్జెట్ ప్రసంగంలో ‘జాతీయ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే ఉత్పాదక శక్తులు అభివృద్ధి సాధించకుండా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయ సుస్థిరత సాధించడం కష్ట సాధ్యం' అని పేర్కొన్నారు. బలహీన సామాజిక వర్గాల సంక్షేమానికి చర్యలు తీసుకోకుండా ఇటువంటి అభివృద్ధి సుస్థిరంగా నిలబడదని కూడా చెప్పారు. ఆర్థికాభివ్రుద్ధితోపాటు పేదల బాగోగులను పరిగణనలోకి తీసుకునేందుకు వీలుగా విధానాలు రూపొందించడం తప్పనిసరి ఆమె పేర్కొన్నారు. పేదలకు సంక్షేమాన్ని అందుబాటులోకి తెచ్చి, వారిని ఉత్పాదక శక్తులను అనుసంధానించాలని ఆమె చెప్పారు.
పన్ను పరిధి విస్తరణకు వీపీ సింగ్ ఇలా ప్రతిపాదనలు
ఇండస్ట్రీయల్ మ్యాగ్నెట్ ధీరూభాయి అంబానీతోపాటు దేశంలో పన్ను ఎగవేతకు పాల్పడుతున్న బడాబాబులందరితోనూ ముక్కు పిండి మరీ పన్ను వసూలు చేయడంలో కీలక పాత్ర పోషించారు 1986లో నాటి ఆర్థిక మంత్రి విశ్వనాథప్రతాప్ సింగ్. 1986 - 87 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ సమర్పించిన వీపీ సింగ్.. మోడిఫైడ్ వాల్యూయాడెడ్ టాక్స్ (మోడ్వాట్ క్రెడిట్) ప్రవేశపెట్టారు. దీని లక్ష్యం అంతా పన్ను ఎగవేతదారులకు దారులు మూసేసి వినియోగదారులకు మేలు చేయడమే. నాడు పార్లమెంట్లో బడ్జెట్ సమర్పిస్తూ విశ్వనాథ ప్రతాప్ సింగ్ ‘పెట్రోలియం, పొగాకు, చేనేత వంటి కొన్నిరంగాలు మినహా వినియోగ వస్తువులపై ఎక్సైజ్ సుంకం విధిస్తూ మేం ప్రతిపాదిస్తున్న దీర్ఘకాలిక ద్రవ్య విధానం ప్రస్తుత దేశీయ ఆర్థిక వ్యవస్థను విస్తరించడానికి ఉత్తమ పరిష్కార మార్గం. ఈ పన్ను విధానం ఉత్పాదకులు పూర్తిగా, ఇన్ స్టంట్గా చెల్లించిన ఎక్సైజ్ సుంకం తిరిగి పొందే వెసులుబాటు కలుగుతుంది. ఈ ప్రభుత్వం బ్లాక్ మార్కెట్లీర్లు, పన్ను ఎగవేతదారులు, స్మగ్లర్లకు వ్యతిరేకం' అని స్పష్టం చేశారు. ఏ కోశానా రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. ప్రస్తుతం గతేడాది జూలై నుంచి అమలులోకి వచ్చిన జీఎస్టీకి శ్రీకారం చుట్టిందీ వీపీ సింగ్ అంటే అతిశయోక్తి కాదు.
కఠిన నిర్ణయాలతో ప్రజలు త్యాగాలు చేయక తప్పదిలా
1991లో దేశ ఆర్థిక వ్యవస్థ అంతా అస్తవ్యస్థమై.. రోజువారీ ప్రభుత్వ కార్యకలాపాల నిర్వహణ కోసం ప్రపంచ బ్యాంకులో పసిడి రుణం తీసుకోవాల్సిన దుస్థితిలో భారత ఆర్థిక వ్యవస్థ ఉంది. ఈ పరిస్థితుల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోని పీవీ నర్సింహరావు క్యాబినెట్లో ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ సంస్కరణలతో కూడిన బడ్జెట్ ప్రవేశపెట్టారు. అనిశ్చితిలో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు దేశంలో ‘ఎగ్జిమ్' పాలసీ అమలులోకి తెచ్చారు. బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పిస్తూ మన్మోహన్ సింగ్ మాట్లడుతూ ‘ఇక సమయం నష్టపోవడానికి వీల్లేదు' అని తేల్చి చెప్పారు. ఇప్పటికే ద్రవ్యోల్బణం ఆకాశాన్నంటే స్థాయికి దూసుకెళ్లిందన్నారు. ఎటువంటి సూక్ష్మ ఆర్థిక సర్దుబాట్లలోనైనా ఆలస్యం జరిగితే సర్దుకోవడం కష్టసాధ్యమవుతుంది. చెల్లింపుల్లో అసమతుల్యత విపత్కర పరిస్థితులకు దారి తీస్తుందని, తర్వాత సరిదిద్దడానికే వీలు లేకుండా పోతుందని స్పష్టం చేశారు. ‘తక్షణం విశ్వసనీయమైన ద్రవ్య సర్దుబాటు, సూక్ష్మ, ఆర్థిక స్థిరీకరణకు చర్యలు తీసుకుంటే తర్వాతీ క్రమంలో ద్రవ్య వ్యవస్థ ప్రభుత్వ నియంత్రణలోకి వస్తుంది. ఇది తప్పనిసరిగా ఆహ్వానించదగ్గ పరిణామం. ఈ ప్రక్రియను చేపట్టేందుకు కనీసం మూడేళ్ల గడువు తీసుకుంటుందన్నారు. బాధల్లేకుండా సర్దుబాట్లేమీ ఉండవు. ఆర్థిక స్వాతంత్ర్యాన్ని, స్వయం ప్రతిపత్తిని కాపాడుకునేందుకు ప్రజలు త్యాగాలకు సిద్ధం కావాలి' పిలుపునిచ్చారు. భారత ఆర్థిక వ్యవస్థను ఆరోగ్యకరంగా తీర్చిదిద్దుకోవాలని కోరారు.
పన్ను పునాది బలోపేతానికి చిదంబరం చర్యలిలా
దేశంలో పన్ను పునాదిని బలోపేతం చేసేందుకు ప్రతిపాదనలు సమర్పించిన పీ చిదంబరం.. 1997లో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వ హయాంలో ఆర్థిక మంత్రిగా ప్రవేశపెట్టిన బడ్జెట్ను ‘డ్రీమ్ బడ్జెట్' అని పిలుస్తారు. పన్ను శ్లాబులను సవరించారు. స్వచ్ఛంద వ్యక్తిగత ఆదాయం (వీడీఐఎస్) అమలులోకి తీసుకొచ్చారు. నాడు ‘డ్రీమ్ బడ్జెట్'గా చిదంబరం ప్రవేశ పెట్టిన ప్రతిపాదనల ఫలితంగా పన్ను వసూళ్లు భారీగా పెరిగాయి. అలా 1997 - 98లో రూ.18,700 కోట్ల మేరకు పన్ను వసూలైతే 2010 - 11 నాటికి పన్ను వసూళ్లు రూ. 1,00,100 కోట్లకు చేరుకున్నాయి. వీడీఐఎస్ పథకం కింద రూ.10 వేల కోట్లు వసూలయ్యాయి. ఈ సందర్భంగా చిదంబరం మాట్లాడుతూ ‘నేను స్వచ్ఛంద వెల్లడి పథకం ప్రవేశపెడుతున్నా. ఆయా సంవత్సరాలతో సంబంధం లేకుండా వెల్లడించే ఆదాయం, ఆస్తులు, సెక్యూరిటీలపై అధిక పన్ను చెల్లించకుండా మాఫీ చేయడం జరుగుతుంది. వారిపై ఎటువంటి చర్య తీసుకోకుండా చట్టపరంగా భద్రత ఉంటుంది' అని తెలిపారు.
గ్లోబల్ ఐటీకి మార్గదర్శిగా భారత్ ఇలా వ్యూహం
భారతదేశాన్ని సాఫ్ట్ వేర్ అభివ్రుద్ధి హబ్గా ప్రమోట్ చేస్తూ వాజపేయి ప్రభుత్వ హయాంలో ఆర్థిక మంత్రిగా 2000లో బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పించారు బీజేపీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా. ఇది కాల క్రమంలో సాఫ్ట్ వేర్ రంగంలో భారత్ అసాధారణ రీతిలో ప్రగతి సాధించడమే కాదు అంతర్జాతీయ సమాజానికి ఐటీ సేవల ఎగుమతి దారుగా నిలిచింది. 1999 డిసెంబర్ నాటికి ప్రతికూల ప్రగతి నమోదు చేసుకున్న ఎగుమతుల్లో డాలర్ల రూపేణా పెరుగుతుంది. మన ఎగుమతులు కూడా ఉత్సాహంగా ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగిపోవడంతో దిగుమతి బిల్లు 600 కోట్ల డాలర్లకు చేరుకున్నది. తాజాగా బడ్జెట్ ప్రతిపాదనలు అత్యున్నత స్థాయికి చేరుతాయి' అని యశ్వంత్ సిన్హా పేర్కొన్నారు.